Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో ఇవ‌న్నీ ఉంటాయ‌ట‌

By:  Tupaki Desk   |   27 Oct 2017 1:30 AM GMT
జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో ఇవ‌న్నీ ఉంటాయ‌ట‌
X
ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌ - వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాద‌యాత్రకు చెందిన సంపూర్ణ వివ‌రాల‌ను ఆ పార్టీ వెలువ‌రించింది. న‌వంబ‌ర్ 2 నుంచి సాగ‌నున్న ఈ యాత్ర‌కు సంబంధించి పార్టీ అధికారికంగా వివ‌రాలు తెలియ‌జెప్పింది. వైఎస్ ఆర్ సీపీ ఎంపీ - పార్టీ సీనియ‌ర్ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రజాసంకల్పం పేరుతో వైఎస్ జగన్ పాదయాత్ర చేయనున్నారని ప్ర‌క‌టించారు. ఆరు మాసాలు 180 రోజులు 125 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రయాణం చేయనున్నారని...తర్వాత మిగిలిన 50 నియోజకవర్గాల్లో వైస్ జగన్ బస్సు యాత్ర చేపడతారని వివ‌రించారు. 13 జిల్లాల్లో దాదాపు 3వేల కి.మీ.కు పైగా పాదయాత్ర ఉంటుంద‌ని...దారి వెంట దాదాపు 5వేల సమావేశాలు - 180 ప్రభావిత సమావేశాలు - 125 భారీ బహిరంగ సభలు - లక్షకు పైగా నివాస ప్రాంతాలను వైఎస్ జగన్ పాదయాత్రలో కవర్ చేస్తారని ఎంపీ మేక‌పాటి తెలిపారు. ప్రత్యక్షంగా 45 లక్షలకు పైగా ప్రజలతో సమావేశాలు - చర్చిస్తారని... రెండు కోట్లకు పైగా ప్రజల్ని ప్రభావితం చేసే అవకాశం ఉంద‌ని వివ‌రించారు.వీటితో పాటుగా... పాద‌యాత్ర సాగే దారివెంట విస్త్రతమైన కార్యక్రమాలు, ప్రభావిత సంఘ సమావేశాలు, భారీ బహిరంగ సభలు - విభిన్నమైన కార్యక్రమాలు - పార్టీ కార్యకర్తలతో సమావేశాలు - విభిన్నమైన ముద్ర వేసే కార్యక్రమాలు జరుగుతాయి. మిగిలిన నియోజకవర్గాల్లో నియోజకవర్గ కోఆర్డినేటర్స్ రచ్చబండ అనే కార్యక్రమం చేస్తారు. 175 నియోజకవర్గాల్లో రచ్చబండ కార్యక్రమం జరుగుతుంది. 120 రోజుల పాటు ప్రతినియోజకవర్గంలో శాసనసభ్యుడు - కో ఆర్డినేటర్ ఈ రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తారని వెల్ల‌డించారు.

ఈ సంద‌ర్భంగా మ‌రిన్ని అంశాల‌ను ఎంపీ మేక‌పాటి వివ‌రించారు. రాష్ట్ర విభజన చేస్తూ ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ వాగ్ధానం చేశారని... దాన్ని తప్పనిసరిగా నిల‌బెట్టుకోవాల్సిన బాధ్య‌త‌ కేంద్ర ప్రభుత్వంపై ఉందని స్ప‌ష్టం చేశారు. ఆ మాట‌ను నిలుపుకునేలా రాష్ట్రప్రభుత్వం ఒత్తిడి తేవాల్సిన బాధ్యత ఉందన్నారు. ``చంద్రబాబు రాజకీయ కారణాలతో ప్రత్యేక హోదా బదులు.. ప్రత్యేక ప్యాకేజీ అంటున్నారు. ఆ ప్యాకేజీ వల్ల ఏపీ ఏ విధంగా లబ్ధిపొందిందో మనకు తెలీదు. హోదా వచ్చి ఉన్నట్లైతే రాష్ట్రం బాగుపడి ఉండేది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగుపడి ఉండేవి. పొరుగు రాష్ట్రాల వల్లే మనం కూడా అన్నివిధాలా అభివృద్ధికార్యక్రమాలు చేసుకుని ఉండేవాళ్లము. చంద్రబాబు ప్రజల్ని మెస్మరిజం చేయాలని చూసి తీరని చేటు చేశారు`` అని రాజమోహన్ రెడ్డి మండిపడ్డారు. ప్రత్యేక హోదా సాధించకపోవటం దుర‌దృష్టక‌ర‌మ‌న్నారు. ``5 కోట్ల ప్రజల హక్కును చంద్రబాబు కాలరాశారు. త‌న‌ కుటుంబం, త‌న హక్కులు చూసుకుంటున్న చంద్రబాబు రాష్ట్ర ప్రజల బాగోగులు కాలరాశారు. ప్రత్యేక హోదా వచ్చినట్టైతే ప్రతి కుటుంబం బాగుపడేది. తద్వారా రాష్ట్రమూ బాగుపడేది. పారిశ్రామిక రంగం పెరిగితే రాష్ట్రమూ బాగుపడేది. ఈ రాష్ట్రానికి తీరని ద్రోహం చంద్రబాబు చేశారు. ప్రత్యేక హోదా సాధించుకునే హక్కు మనమీద ఉంది. అందుకే రచ్చబండ కార్యక్రమంలో ప్రత్యేక హోదా కోరుతూ సంతకాల సేకరణ చేపట్టాలని నిర్ణయించాం`` అని ఎంపీ మేక‌పాటి తెలిపారు.

వీటితోపాటుగా నియోజకవర్గ రచ్చబండ కార్యక్రమంలో అక్కడ 30 కీలక గ్రామాల్లో నిర్వహించాల్సి ఉంటుందని ఎంపీ మేక‌పాటి వివ‌రించారు. ముఖ్యమైన సామాజిక వర్గాల నేతలను కలవటంతో పాటు బూత్ కమిటీలు బలపర్చటం ముఖ్యమైన వ్యవహారంగా నిర్ణయించామన్నారు. వైఎస్ ఆర్సీపీలో కీలకంగా ఉండే వారితో బూత్ కమిటీలు బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నాలుగు మాసాల్లో ఆ నియోజకవర్గాల్లో శాసనసభ్యుడు, కోఆర్డినేటర్ గడపగడపకు వెళ్లి అక్కడ కుటుంబ సభ్యులతో మమేకమై వారి కష్టసుఖాలు తెల్సుకోవాల‌ని సూచించారు. భవిష్యత్తులో దేవుడి దయ వల్ల, ప్రజల ఆశ్శీసులతో శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా గెలిపించాల్సిన అవసరం ఉందిదన్నారు. ఆరోజు దివంగత మహానేత వైఎస్ఆర్ పాదయాత్ర చేసి ప్రజల కష్టసుఖాలు తెల్సుకొని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని...ఆ విధంగా వైఎస్ జగన్ ప్రజల ఆశీర్వాద బలంతో ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రజాక్షేమ కార్యక్రమాలు చేప‌డ‌తార‌ని వివ‌రించారు.

కులమతాలకు అతీతంగా 5 కోట్ల ప్రజలను దృష్టిలో పెట్టుకొని తప్పనిసరిగా సంక్షేమకార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తారని మేకపాటి తెలిపారు. అందుకనే ఈ రోజున కోఆర్డినేటర్ అందరూ గడపగడపకూ వెళ్లటమే కాకుండా పల్లెనిద్ర చేయమని వైఎస్ జగన్ ఆదేశించారన్నారు. తద్వారా ప్రజలతో మమేకం అవ్వాల్సిన అవసరం ఉందన్నారు. వాళ్ల నియోజకవర్గాల్లో ఉండే కాలేజీలు, విద్యాసంస్థల్లో విద్యార్థులతో మమేకమై వారి పరిస్థితి తెల్సుకొని ప్రభావితం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అదేవిధంగా కోఆర్డినేటర్, శాసనసభ్యుడు ప్రత్యేక హోదా చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రత్యేక హోదా లాభాలను విద్యార్థులు, యువతకు తెలపాల్సిన అవసరం ఉందన్నారు. ఈ రచ్చబండ కార్యక్రమంలో 175 నియోజకవర్గాల్లో కోటి మంది ప్రజల్ని కలుసుకోవాల్సి ఉందన్నారు. తద్వారా ప్రజల మన్నలు, ప్రేమాభిమానాలు పొందాలన్నారు. ప్రజలతో మమేకమే, వారి మన్నలు, ప్రేమాభిమానాలు చూరగొన్ననాడే ప్రతి ఒక్కరం గెలవగలమని మేకపాటి చెప్పారు. తద్వారా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా గెలవచ్చు అన్నారు. మొదటి నాలుగు మాసాల్లో రచ్చబండ కార్యక్రమాలు పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. తర్వాత రెండునెలల్లో ఏం చేయాలి.. వేగంగా ప్రజలతో ఎలా మమేకమవ్వాలో పార్టీ పెద్దలు, వైఎస్ జగన్ తర్వాత నిర్ణయిస్తారని మేకపాటి స్పష్టం చేశారు. రచ్చబండ 2లో గ్రామంలో ప్రతి గడపనూ సందర్శించటంతో పాటు సంతకాల సేకరణ, పల్లె నిద్రలో భాగంగా స్థానికుల ఇంట్లో నిద్రించి స్థానిక ప్రజలతో సత్సంబంధాలు నెలకొల్పాల్సిన అవసరం ఉందన్నారు. ఏ ఇంట్లో నిద్రపోవాలో వ్యూహాత్మకంగా నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కళాశాల సమావేశాలు అనేది ప్రతి నెలా రెండు చోట్ల నిర్వహించాలన్నారు.