Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ మాస్ట‌ర్ ప్లాన్‌.. పాద‌యాత్ర‌కు నో బ్రేక్స్!

By:  Tupaki Desk   |   11 Oct 2017 10:21 AM GMT
జ‌గ‌న్ మాస్ట‌ర్ ప్లాన్‌.. పాద‌యాత్ర‌కు నో బ్రేక్స్!
X
ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త పెరుగుతోంద‌నే చ‌ర్చ ఏపీ అంత‌టా జ‌రుగుతోంది. ప్ర‌జాప్ర‌తినిధుల‌పై ప్ర‌జ‌ల్లో నానాటికీ ఆగ్ర‌హం పెల్లుబుకుతోంది. ఇదే స‌మ‌యంలో ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ చేప‌ట్ట‌నున్న పాద‌యాత్ర గురించి టీడీపీ అధినేత చంద్రబాబులో గుబులు మొద‌లైంది. వీలైనంత‌గా దీనికి ఆటంకాలు సృష్టించేందుకు కుయుక్తులు ప‌న్నుతున్నారు. అయితే వీట‌న్నింటినీ ఎదుర్కొని.. పాద‌యాత్ర‌కు బ్రేక్ లేకుండా ఉండేందుకు వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌క్కా ప్ర‌ణాళిక రూపొందించారు. ఒక‌వేళ సీబీఐ కోర్టు మిన‌హాయింపు ఇవ్వ‌క‌పోతే.. పాద‌యాత్రకు ఆటంకం క‌ల‌గ‌కుండా ఎలా నిర్వ‌హించాల‌నే అంశంపై ఇప్ప‌టికే ఒక నిర్ణ‌యానికి వ‌చ్చార‌ట‌.

కేసుల బూచి చూపి వైఎస్సార్ సీపీ అధినేత‌ - ప్ర‌తిప‌క్ష‌నేత‌ జ‌గ‌న్ పాద‌యాత్ర‌ను ఇరుకున‌పెట్టాల‌ని చూస్తున్న సీఎం చంద్ర‌బాబుకు ఇప్పుడు షాక్ ఇవ్వబోతున్నారు. ఏపీ ప్ర‌భుత్వ పాల‌న‌లో ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు స్వ‌యంగా తెలుసుకుని వారికి భ‌రోసా ఇచ్చేందుకు ఏపీ మొత్తం పాద‌యాత్ర చేయాల‌ని నిర్ణ‌యించారు. మొత్తం ఇడుపుల‌పాయ‌తో మొద‌లు పెట్టి సుమారు ఆరు నెల‌ల పాటు 3వేల కిలోమీట‌ర్లు రాష్ట్రమంతా ప‌ర్య‌టించ‌బోతున్నారు. 2004లో అప్ప‌టి సీఎం చంద్ర‌బాబు పాల‌న లో ప్ర‌జ‌లు - రైతులు ప‌డుతున్న క‌ష్టాలు చూసి చ‌లించిపోయిన రాజ‌శేఖ‌ర రెడ్డి నాడు పాద‌యాత్ర చేశారు. ఇప్పుడు తండ్రి బాట‌లోనే న‌వంబ‌రు 2నుంచి జ‌గ‌న్ శ్రీ‌కారం చుట్టారు.

నవంబర్ 2వ తేదీ నుంచి జగన్ ఎలాంటి ఆటంకాలు లేకుండా పాదయాత్ర సాగేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ యాత్ర‌ ఎలాంటి విఘాతం లేకుండా సాగితే టీడీపీకి కొంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. పాదయాత్ర ప్రతి వారం ఆగితే రాజకీయంగా జగన్‌ పై ప్రత్యర్థులు విమర్శలు గుప్పిస్తారు. ఈ నేప‌థ్యంలో హాజరును మినహాయించాలని జగన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఒకవేళ కోర్టు మినహాయింపు ఇవ్వకపోతే ప్రతి శుక్రవారం ప్రత్యేక విమానంలో హైద్రాబాద్‌ కు చేరుకొని కోర్టుకు హాజరయ్యేలా ప్లాన్ చేస్తోంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరు విమానాశ్రయాలు ఉన్నాయి. పుట్టపర్తి సత్యసాయి ఎయిర్‌ పోర్ట్ - కడప - తిరుపతి - గన్నవరం - రాజమండ్రి - విశాఖపట్టణం ఎయిర్‌ పోర్ట్‌ ల ద్వారా ప్రత్యేక విమానాలతో హైద్రాబాద్‌ కు శుక్రవారం చేరుకొనేలా జగన్ ప్లాన్ చేస్తున్నారు. ఎయిర్‌ పోర్ట్ సౌకర్యం లేని జిల్లాల్లో రోడ్డు మార్గం ద్వారా హైద్రాబాద్‌ కు చేరుకునేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కర్నూల్ - గుంటూరులోని పల్నాడు ప్రాంతాల నుంచి రోడ్డు మార్గం ద్వారా హైద‌రాబాద్‌ కు చేరుకునే అవకాశం ఉందని వైసీపీ నేతలు భావిస్తున్నారు. 2014 ఎన్నికల సమయంలో ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరయ్యే విషయమై మూడు మాసాల పాటు మిన‌హాయింపు ఇచ్చిన విష‌యం తెలిసిందే!!