Begin typing your search above and press return to search.

జగన్ పాదం..పవన్ బస్సు..బాబు సైకిలే కొంచెం రిపేరు..

By:  Tupaki Desk   |   18 May 2018 4:19 AM GMT
జగన్ పాదం..పవన్ బస్సు..బాబు సైకిలే కొంచెం రిపేరు..
X
పైన ఎండలు దంచికొడుతున్నాయి. ఈ టైంలో అందరూ ఏం చేస్తారు.. అంతా ఇంట్లోనే ఉండి కాలం గడిపేస్తారు.. పైగా వేసవి సెలవులు.. అందుకే ప్రశాంతమైన జీవితాన్ని అస్వాదించేందుకే మొగ్గుచూపుతారు. కానీ ఇప్పుడా ప్రశాంతత ఏపీలో లేదు.. పైన వేడి.. కింద వేడి నెలకొంది. ఓ పక్క జగన్ పాదయాత్రతో రాయలసీమ నుంచి దూసుకొస్తున్నారు. మరోపక్క జనసేనాని పవన్ ఉత్తరాంధ్ర నుంచి యాత్ర మొదలుపెట్టనున్నారు. దీంతో మధ్యలో ఉన్న చంద్రబాబు మాత్రమే ఇప్పుడే ఎలాంటి చడీచప్పుడు లేకుండా ఉన్నారు.

సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉంది. తీరిగ్గా ఈ ఎండలు కాస్త తగ్గాక రాజకీయాల్లో వేడి పుట్టించొచ్చు. తెలంగాణలో కామ్ గానే రాజకీయాలున్నాయి. కాంగ్రెస్ నాయకులు ఎండల్లో తిరగకుండా కాస్త విరామం ప్రకటించారు. ఏపీలో మాత్రం ఏడాది ముందే సమరం మొదలైంది.. యాత్రలతో ప్రతిపక్ష నాయకులు ప్రజల్లోకి వెళుతున్నారు.. ‘ఐదేళ్లపాటు టీడీపీని పాలించమని ప్రజలు అధికారమిచ్చారు. 4 ఏళ్లు కూడా గడువకముందే అటు జగన్, ఇటు పవన్ లొల్లి చేస్తున్నారు. మమ్మల్ని ప్రశాంతంగా బతకనీయడం లేదు.. కొద్దిరోజులు ఆగొచ్చు కదా..’ ఓ టీడీపీ ముఖ్య నేత వాపోయారు.. నిజమే.. ఇప్పుడప్పుడే అంత తొందరలేదు.. కానీ జగన్, పవన్ తమ రాజకీయ భవిష్యత్తును మొత్తం వచ్చే ఎన్నికల మీదే పెట్టడంతో చంద్రబాబు అండ్ కోకు ఈ సంకట స్థితి నెలకొంది

ఇదివరకే ఓసారి ప్రతిపక్షంలో ఉన్న జగన్ ఈసారి అధికారమే లక్ష్యంగా పాదయాత్ర చేపట్టారు. ఈసారి ఎలాగైనా సరే ఏపీ సీఎం కావడానికి శాయశక్తుల ప్రయత్నాలు చేస్తున్నారు. మరో వైపు ఎన్నాళ్లుగానో చేస్తున్న సినిమాలకు గుడ్ బై చెప్పి మరీ పవన్ రాజకీయాల్లోకి ఫుల్ టైం వచ్చేసారు. ఈ ఏడాదిలో ఎలాగైనా ఇద్దరూ అధికారమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికలకు ఏడాది సమయమున్నా కూడా అప్పుడే యాత్రలతో రాజకీయ వేడి పుట్టిస్తున్నారు..

ఓ వైసీపీ, ఇటు జనసేన కార్యక్షేత్రంలోకి దిగడంతో టీడీపీ కూడా అలెర్ట్ అయ్యింది.. చంద్రబాబు కూడా ప్రజల్లోకి వెళ్లడానికి రెడీ అయ్యారని తెలిసింది. దీంతో ఏపీలో త్రిముఖ పోరు అనివార్యంగా మారింది. ఎవరు గెలుస్తారో.. ఎవరు ఓడుతారో ఇప్పుడే చెప్పకున్నా.. సంవత్సరం ముందే ప్రచారపర్వం మొదలుపెట్టి యుద్ధానికి సిద్ధమయ్యారు. చూడాలి మరి ప్రజలు ఎవరికీ పట్టం కడతారో..