Begin typing your search above and press return to search.

ఇసుక స‌మ‌స్య‌పై తొలిసారి నోరు విప్పిన జ‌గ‌న్‌

By:  Tupaki Desk   |   4 Nov 2019 10:21 AM GMT
ఇసుక స‌మ‌స్య‌పై తొలిసారి నోరు విప్పిన జ‌గ‌న్‌
X
రాష్ట్రాన్ని గ‌డిచిన రెండు మాసాలుగా ఇబ్బందికి గురి చేస్తున్న ఇసుక స‌మ‌స్య‌తో భ‌వ‌న నిర్మాణ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. ఒక‌ర‌కంగా చెప్పాలంటే తిండికి కూడా ఇబ్బంది ప‌డుతున్న కుటుంబా లు ఉన్న మాట వాస్త‌వ‌మే. దీంతో ఈ విష‌యాన్ని ప్ర‌తిప‌క్షాలు త‌మ‌కు అనుకూలంగా మార్చుకుని మ‌రింత ప్ర‌చారం ప్రారంభించాయి. ప్ర‌భుత్వం ఇప్ప‌ట్లో స్పందించ‌దు.. అనే రేంజ్‌లో వారు చేసిన ప్ర‌చారం, ప్ర‌స్తుత ప‌రిస్థితి నేప‌థ్యంలో కార్మికులు కొంద‌రు ఆత్మ‌స్థ‌యిర్యం కోల్పోయి ఆత్మ‌హ‌త్య‌ల‌కు ఒడిగ‌ట్టారు. ఈ ప‌రిణామాల‌తో రాష్ట్రంలో ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.

తాజాగా ఇదే విష‌యంపై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ విశాఖ వేదిక‌గా లాంగ్ మార్చ్ నిర్వ‌హించ‌డం ప్ర‌బుత్వంపై విమ‌ర్శ‌లు చేసిన విష‌యం తెలిసిందే. ఇక‌, ప్ర‌భుత్వ ప‌రంగా చూసుకుంటే.. ఈ విష‌యంపై ఇప్ప‌టి వ‌ర‌కు పెద్ద‌గా నాయ‌కులు ఎవ‌రూ ముందుకు వ‌చ్చి స్పందించింది లేదు. ఒక‌రిద్ద‌రు మంత్రులు స్పందించినా.. రాష్ట్రంలో ఇసుక కొర‌త‌పై దృష్టి పెట్టామ‌ని, త్వ‌ర‌లోనే ప‌రిష్క‌రిస్తామ‌ని వెల్ల‌డించారు. అయిన‌ప్ప‌టికీ.. సీఎం జ‌గ‌న్ నుంచి ఎలాంటి ప్ర‌క‌ట‌న వ‌స్తుందా? అని కార్మికులు ఎదురుచూస్తున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా స్పందించిన జ‌గ‌న్‌.. ప్ర‌తిప‌క్షాలు చేస్తున్న రాద్ధాంతాన్ని ఎండ‌గ‌ట్టారు.

ప్ర‌స్తుతం అన్ని న‌దుల్లోనూ వ‌ర‌ద పోటెత్తుతోంద‌ని, ఊహించ‌ని విధంగా వ‌ర్షాలు రావ‌డం, ఒక‌టికి రెండు సార్లు న‌దుల‌కు వ‌ర‌ద‌లు పోటెత్త‌డంతో ఇసుక ల‌భ్య‌త సాధ్యం కావ‌డం లేద‌ని, లారీలు, ప్రొక్లెన్లు కూడా వెళ్ల‌లేని ప‌రిస్థితి నెల‌కొంద‌ని ఆయ‌న వెల్ల‌డించారు. కార్మికుల స‌మ‌స్య‌లుత‌మ‌కు తెలుసున‌ని, వారి ఓట్ల‌తోనే త‌మ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చింద‌ని చెప్పిన జ‌గ‌న్‌.. వారికి సంపూర్ణంగా ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంద‌న్నారు. రాష్ట్రంలోని 265 రీచ్ లలో కేవలం 61 రీచ్ లు మాత్రమే పని చేస్తున్నాయని జగన్ తెలిపారు.

ఇసుక కోసం లారీలు ట్రాక్టర్లు వెళ్లలేని స్థితి నెలకొందని.. అందుకే ఇసుక తీయడం లేదంటూ జగన్ తెలిపారు. ఇసుక సమస్య తాత్కాలికామేనన్న జగన్.. ఈ నెలాఖరులోగా ఇసుక సమస్య తీరుస్తామని స్పష్టం చేశారు. కార్మికుల ప‌క్ష‌పాతిగా ప్ర‌భుత్వం అడుగులు వేస్తుంద‌ని, ప్ర‌తి కార్మికుడికి అండ‌గా నిలుస్తుంద‌ని, రాబోయే రెండు వారాల్లోనే పూర్తిస్థాయిల స‌మ‌స్య ప‌రిష్కారం అవుతుంద‌ని వెల్ల‌డించారు.