Begin typing your search above and press return to search.

గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు.. డిసైడ్ చేసిన జగన్

By:  Tupaki Desk   |   12 Aug 2021 3:00 AM GMT
గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు.. డిసైడ్ చేసిన జగన్
X
వినూత్న కార్యక్రమాలతో పాటు.. పాలనా పరంగా సరికొత్త ప్రయోగాలకు తెర తీస్తున్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తాజాగా అలాంటి నిర్ణయాన్ని తీసుకున్నారు. ఏపీలో సరికొత్తగా తీసుకొచ్చిన గ్రామ సచివాలయాలతో పాలనను మరింత ముమ్మరం చేయటంతోపాటు.. గ్రామ ప్రజలకు ప్రభుత్వ పరంగా అందాల్సిన పథకాలతో పాటు.. సేవల్ని అందిస్తున్న వైనం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లను కూడా షురూ చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు చెబుతున్నారు.

ఈ రిజిస్ట్రేషన్ల విధానాన్ని 2022 జనవరి నుంచి గ్రామ సచివాలయాల్లో షురూ చేయాలన్న యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల మొదటి వారంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలోనూ గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల అంశం చర్చకు వచ్చినట్లుగా చెబుతున్నారు. ఇప్పటివరకు భూములు.. ఇళ్లు.. ఆస్తులకు సంబంధించిన రిజిస్ట్రేషన్లను రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో నిర్వహించేవారు. అందుకు భిన్నంగా తాజాగా గ్రామ సచివాలయాల్లోరిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రారంభించాలన్న యోచనలో ప్రభుత్వం ఉందని చెబుతున్నారు.

దీంతో.. భూముల కొనుగోలు.. అమ్మకాలు మరింత సులువుగా ఉండటంతో పాటు.. ప్రజలకు ప్రయాణ కష్టాలు తీరటంతో పాటు.. రిజిస్ట్రేషన్ల శాఖపై ఒత్తిడి తగ్గించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉందని చెబుతున్నారు. ఈ విధానానికి సంబంధించిన కీలక శిక్షణను జోన్ల వారీగా ఎంపిక చేసి సచివాలయ సిబ్బందికి శిక్షణ ఇస్తున్నట్లు చెబుతున్నారు. రిజిస్ట్రేషన్లకు సంబంధించి ప్రామాణికంగా చెప్పే ‘మితాక్షరి’ పైన అవగాహన కల్పించటంతో పాటు.. తప్పులు చోటు చేసుకోకుండా రిజిస్ట్రేషన్లు చేసేందుకు వీలుగా శిక్షణ చేపడుతున్నారు. వీరి ట్రైనింగ్ మూడు నెలల పాటు సాగుతుందని చెబుతున్నారు.

వీరి శిక్షణ పూర్తి అయ్యాక.. సిబ్బందికి సమీపంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అనుసంధానం చేస్తారు. అక్కడ రెండు.. మూడు నెలల పాటు ప్రత్యక్షంగా పని నేర్చుకొనేలా చేస్తారు. జోన్ల వారీగా శిక్షణలు పూర్తి అయ్యాక.. గ్రామాల్ని యూనిట్ గా చేసుకొని సిబ్బందికి ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు చెబుతున్నారు. రిజిస్ట్రేషన్లతో పాటు.. పన్ను వసూళ్లు.. కొత్త భవనాల టౌన్ ప్లానింగ్ అనుమతులు ఇవ్వటం లాంటి వాటిని కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది.