Begin typing your search above and press return to search.

వ్యవసాయం, నీటి విలువ తెలిసిన ప్రభుత్వం మాది

By:  Tupaki Desk   |   9 Nov 2020 5:30 PM GMT
వ్యవసాయం, నీటి విలువ తెలిసిన ప్రభుత్వం మాది
X
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ .. ఈ రోజు సోమశిల హైలెవెల్‌ కెనాల్‌ ఫేజ్‌-2 కు శంకుస్థాపన చేశారు. నెల్లూరు జిల్లాలోని దుర్భిక్ష ప్రాంతాలను సుభిక్షం చేసే దిశగా సోమశిల హైలెవెల్‌ కెనాల్‌ ఫేజ్‌-2కు వర్చువల్‌ విధానంలో తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించారు. కాగా, సోమశిల హైలెవల్ కెనాల్ ఫేజ్ -1 నిర్మాణ పనులు ఇప్పటికే జరుగుతున్నాయి. తాజాగా 460 కోట్ల రూపాయల వ్యయంతో ఫేజ్‌-2 నిర్మాణ పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ కాలువ పనులు పూర్తయితే మెట్ట ప్రాంతాలైన ఉదయగిరి, వింజమూరు, దుత్తల్లూరు, ఆత్మకూరుతో పాటు ప్రకాశం జిల్లాలోని పలు గ్రామాలకు నీరు పుష్కలంగా అందుతుంది. దశాబ్దాల కాలంగా మెట్ట ప్రాంత వాసులు కలలుగన్న సాగునీటి సమస్యకు పరిష్కారం దొరికినట్లేనని ఆ ప్రాంతవాసులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కార్యక్రమంలో నీటిపారుదల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి పాల్గొన్నారు.

పెన్నా నది నీటిని సద్వినియోగం చేసుకుంటున్నామని ఈ సందర్భంగా సీఎం‌ తెలిపారు. నెల్లూరు జిల్లాలోని మరిన్ని ప్రాంతాలకు తాగు, సాగునీరు అందించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని చెప్పారు. నీరు, వ్యవసాయం విలువ తెలిసిన ప్రభుత్వం తమదని పేర్కొన్నారు. ప్రాజెక్టు పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేస్తామని తెలిపారు. జలయజ్ఞం పనులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తామని సీఎం స్పష్టం చేశారు. 2020-21లో 6 ప్రాధాన్యత ప్రాజెక్టులను పూర్తిచేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. 2022 ఖరీఫ్ ‌కు నీరిచ్చేలా పోలవరం ప్రాజెక్టు పూర్తిచేసి జాతికి అంకితం చేస్తామని సీఎం మాటిచ్చారు. నీటి విషయంలో ఎక్కడా రాజీపడేది లేదని తేల్చి చెప్పారు. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కృష్ణాపురం వద్ద రెండో దశ పనులకు శంకుస్థాపన చేశారు. రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో రూ.40 వేల కోట్లతో కరువు నివారణ చర్యలు చేపడుతున్నాం అని సీఎం జగన్‌ తెలిపారు

మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. సోమశిల హైలెవల్ కెనాల్ ఈ ప్రాంత రైతుల కల. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ ‌మోహన్ రెడ్డి మంచి మనసుతో ఆలోచించి హైలెవల్ పేజ్ 2ను ప్రారంభిస్తున్నారు. వెలిగొండ కూడా పూర్తయితే కరువు ప్రాంతమైన ఉదయగిరి, ఆత్మకూరు ప్రాంతాలు సస్యశ్యామలం అవుతాయి. ముఖ్యమంత్రి పాదం పెట్టిన వేళా విశేషం రాష్ట్రం సుభిక్షంగా ఉంది. సోమశిల హైలెవల్ ఫేజ్‌- 2, వెలిగొండ ప్రాజెక్ట్స్ పూర్తయితే ఇక సస్యశ్యామలమే. త్వరలో చాగోలు రిజర్యాయర్ కూడా పూర్తి చేస్తాం. పదేళ్ల తరువాత నెల్లూరు జిల్లాలో వరదలు పోటెత్తాయి. పెన్నా నుంచి 100 టీఎంసీల నీరు సముద్రంలోకి వెళ్లింది అని అన్నారు. సోమశిల జలాశయం నుంచి నీటిని ఎత్తిపోసి.. తాగునీటి కష్టాలను తీర్చడంతో పాటు ఈ మండలాల్లో 90 వేల ఎకరాలకు నీళ్లందించేందుకు ఎస్‌హెచ్‌ఎల్‌ఎల్‌సీ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. తొలి దశ కింద 43,547 ఎకరాలకు నీళ్లందించాలని నిర్ణయించింది. రూ.840.72 కోట్ల వ్యయం కాగల పనులను కాంట్రాక్టు సంస్థకు అప్పగించింది. ఇప్పటివరకు రూ.572.11 కోట్లను ఖర్చు చేసింది.