Begin typing your search above and press return to search.

ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలకు సీఎం క్లాస్.. ఎవరికి ఏ విషయంలో అంటే!

By:  Tupaki Desk   |   15 Nov 2019 9:34 AM GMT
ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలకు సీఎం క్లాస్.. ఎవరికి ఏ విషయంలో అంటే!
X
ప్రకాశం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గట్టిగా క్లాసులు వేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఎమ్మెల్యేల పనితీరుపై, నియోజకవర్గాల్లో ఏం జరుగుతోందనే అంశం గురించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెప్పించుకుంటున్నారు సీఎం. నేతల పనితీరే పార్టీ ఇమేజ్ ను ప్రభావితం చేస్తుందనే అభిప్రాయంతో జగన్ మోహన్ రెడ్డి వారి కి ఎప్పటికప్పుడు క్లాసులు పీకుతున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేల్లో ఒక్కోరికి ఒక్కో అంశంలో తలంటారట సీఎం. అందుకు సంబంధించిన విశేషాలు ఇలా ఉన్నాయి.

సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్ బాబుకు.. ఆయన నియోజకవర్గంలో సాగిస్తున్న దందాల గురించి సీఎం గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. నియోజకవర్గం పరిధిలోని గ్రానైట్ క్వారీల వారిని ఎమ్మెల్యే బెదిరిస్తున్నాడనే అభియోగాలున్నాయి. వారిని బెదిరిస్తూ డబ్బులు అడుగుతున్నారట ఎమ్మెల్యే మనుషులు. ఈ నేపథ్యంలో ఇప్పటికే తను అలాంటి పనులు మానుకొమ్మని హెచ్చరించినా ఆయన తీరు మారలేదంటూ ముఖ్యమంత్రి ఈ సారి గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్టుగా టాక్.

మార్కాపురం ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డికి గట్టిగానే క్లాస్ పడిందని సమాచారం. ప్రతి విషయంలోనూ నాగార్జున రెడ్డి తమ్ముడు, వారి తండ్రి, నాగార్జున రెడ్డి మామ ఇన్ వాల్వ్ అవుతున్నారని, వారు కూడా ఎమ్మెల్యేలుగా చలామణి అవుతున్నారనే అంశాన్ని సీఎం ప్రస్తావించినట్టుగా సమాచారం. దీంతో అవినీతికి ఆస్కారం ఏర్పడుతోందని, తీరు మార్చుకోవాలని జగన్ సూచించినట్టుగా తెలుస్తోంది.

గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబుకు కూడా సీఎం నుంచి గట్టి వార్నింగే వచ్చినట్టుగా సమాచారం. ఆయన గిద్దలూరులో ఉండకుండా ఎంతసేపూ మార్కాపురానికి పరిమితం అవుతున్న విషయాన్ని ప్రస్తావించారట సీఎం. తనను కలవాలనుకునే వాళ్లను మార్కాపురానికే రమ్మంటారట ఈయన . ఇంతకీ ఏ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అనే సందేహాలు తలెత్తున్నాయి. అలాగే నిజమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లకు అవకాశం ఇవ్వకుండా టీడీపీ బ్యాచ్ నే అన్నా రాంబాబు ఎంకరేజ్ చేస్తున్న అంశాన్నీ సీఎం ప్రస్తావించినట్టుగా సమాచారం. ప్రతి అంశంలోనూ అన్నా రాంబాబు పాత టీడీపీ వాళ్లకే ప్రాధాన్యతను ఇస్తున్న దాఖలాలున్నాయి. అలాగే నియోజకవర్గంలో బలంగా ఉన్న రెడ్డి సామాజికవర్గాన్ని అన్నా రాంబాబు పూర్తిగా పక్కన పెట్టారు. వారికి ఏ మాత్రం ప్రాధాన్యతను ఇస్తున్న దాఖలాలు లేవు. ఈ అంశాలను కూడా ప్రస్తావించి అన్నా రాంబాబుకు సీఎం క్లాస్ వేశారని సమాచారం.

కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ స్థానికంగా అందుబాటులో ఉండరనే పేరుంది. ఆయన బెంగళూరు నుంచి పాలన సాగిస్తూ ఉన్నారు. ఈ అంశాన్ని ప్రస్తావించారట ముఖ్యమంత్రి.

దర్శి ఎమ్మెల్యే కు కూడా ఇదే అంశంలో క్లాస్ తప్పలేదని సమాచారం. ఎమ్మెల్యే బెంగళూరులో ఉంటే, ఆయన తమ్ముడు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా చలామణి అవుతున్న అంశాన్ని జగన్ ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది. నియోజకవర్గంలో అందుబాటులో ఉండాలని ఆదేశించినట్టుగా తెలుస్తోంది.

ఇక చీరాల ఇన్ చార్జిగా ఉన్న ఆమంచి కృష్ణ మోహన్ ను జగన్ అసలు పలకరించలేదని సమాచారం. ఆయన తీరుపై ముఖ్యమంత్రి బాగా అసహనంతో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది