Begin typing your search above and press return to search.

అగ్ర స్థానం కోల్పోయిన జాక్ 'మా'.. అదే కారణమా!

By:  Tupaki Desk   |   3 March 2021 10:14 AM GMT
అగ్ర స్థానం కోల్పోయిన  జాక్ మా.. అదే కారణమా!
X
చైనా దిగ్గజ వ్యాపారవేత్త, అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా చైనా బిలియనీర్ల జాబితాలో అగ్రస్థానం ను కోల్పోయారు. 2019 , 2020 లో వరుసగా రెండు సార్లు చైనా బిలియనీర్ల జాబితాలో తోలి స్థానంలో నిలిచిన అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా ఈ ఏడాది మాత్రం ఏకంగా నాలుగో స్థానానికి పడిపోయాడు. అయన ఆస్తి ప్రస్తుతం $55.64 బిలియన్లు గా ఉంది. ఇదిలా ఉంటే ఆయన వ్యాపార ప్రత్యర్థులు మాత్రం భారీగా సంపదను పోగేశారు. ఆయన కంపెనీలపై చైనా ప్రభుత్వం గట్టి నిఘా పెట్టడమే జాక్‌ మా స్థానం దిగజారడానికి కారణంగా తెలుస్తోంది.

ఈ ఏడాది చైనా బిలియనీర్ల జాబితాలో నాంగ్‌ ఫూ స్ప్రింగ్‌ కంపెనీ అధిపతి జోంగ్‌ షాన్ ‌షాన్‌ తోలి స్థానంలో నిలిచారు. తర్వాతి రెండు స్థానాల్లో టెన్సెంట్‌ హోల్డింగ్స్‌ పోనీ మా, ఈ-కామర్స్‌ పిన్ ‌డ్యువోడ్యువో అధిపతి కొలిన్‌ హువాంగ్‌ ఉన్నారు. జోంగ్‌ సంపద గత ఏడాది కాలంలో అనూహ్యంగా పెరిగి 85 బిలియన్‌ డాలర్లకు చేరగా.. టెన్సెంట్‌ మా సంపద ఏకంగా 70 శాతం ఎగబాకి 74.19 బిలియన్‌ డాలర్లకు చేరింది. ఇక హువాంగ్‌ సంపద 283 శాతం పెరిగి 69.55 బిలియన్‌ డాలర్లకు ఎగబాకింది. ఇక జాక్‌ మా, ఆయన కుటుంబ సంపద ఏడాది వ్యవధిలో 22 శాతం పెరిగి 55.64 బిలియన్‌ డాలర్లగా ఉంది.

చైనాలో అత్యంత ధనికుల్లో జాక్ మా ప్రముఖుడిగా ఉన్నారు. అంతర్జాతీయంగా ఆయన చేసిన సేవా కార్యక్రమాల వల్ల చైనాకు ప్రపంచ వ్యాప్తంగా కాస్త మంచిపేరును తీసుకొచ్చింది. కానీ, గతేడాది అక్టోబరు 24న చైనా బ్యాంకింగ్‌ వ్యవస్థలోని లోపాల్ని ఎత్తిచూపడంతో జాక్‌ మాపై అక్కడి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. చైనా బ్యాంకులు తాకట్టు దుకాణాల మనస్తత్వాన్ని వీడి విస్తృతంగా ఆలోచించాలని హితవు పలికారు. దీంతో ఆయన వ్యాఖ్యలపై మండిపడ్డ సీసీపీ అగ్రనాయకత్వం‌ ప్రతీకార చర్యలు ప్రారంభించింది. ఆయన వ్యాపార సామ్రాజ్యంపై నియంత్రణ సంస్థలతో నిఘా పెట్టింది. ఈ పరిణామాల తర్వాత జాక్‌ మా కొన్నాళ్ల పాటు బాహ్య ప్రపంచానికి కన్పించకుండా పోయారు. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా కుబేరుల జాబితాలో తొలి స్థానాన్ని కూడా కోల్పోయి నాలుగో స్థానంలో నిలిచారు.