Begin typing your search above and press return to search.

బాబూ.. పాతాళభైరవి, మాయాబజార్ మిస్సయ్యారా?: ఐవీ రెడ్డి

By:  Tupaki Desk   |   31 Jan 2017 7:21 AM GMT
బాబూ.. పాతాళభైరవి, మాయాబజార్ మిస్సయ్యారా?: ఐవీ రెడ్డి
X
ఆంధ్రుల రాజధానిని అపహాస్యం చేయడానికి శతథా ప్రయత్నిస్తున్నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తన రాజకీయ జీవితాన్ని అడుగడుగునా వెన్నుపోట్లు - మోసం - వంచనలే ఊపిరిగా కొనసాగిస్తున్న చంద్రబాబు రాజధాని రూపంలో తన విశృంఖల విశ్వరూపాన్ని చూపుతున్నాడు. మూడు పంటలు పండే భూముల్లో రాజధాని అంటూ వ్యవసాయాన్ని తన చూపుతోనే ఛిద్రం చేసిన చంద్రబాబు - రాజధాని ప్రాంతంపై తన పార్టీ నేతలు - వారి బినామీలందరితోనూ కలిసి భూభకాసురుడిలా పడ్డాడు. వందల ఎకరాల భూములను దోచుకోవడం జరిగింది. అయితే బాబు దాహం అంతటితో తీరేది కాదు, దీంతో అడుగడుగునా దోపిడీ పర్వం కొనసాగుతూనే ఉంది.

ఆ దోపిడీలను కవర్ చేసుకోవడానికి రాజధాని విషయంలో గత రెండున్నర సంవత్సరాలుగా ఏదో ఒక ప్రహసనాన్ని నడిపిస్తూ ఆయన కాలం గడుపుతున్నాడు. అద్భుత రాజధానిగా చంద్రబాబు చేత చెప్పబడుతున్న అమరావతి ఇప్పటి వరకూ కనీసం గీతల వరకూ కూడా ఒక రూపంలోకి రాకపోవడం బాబు పాలన ప్రహసనానికి పరాకాష్ట. ఇప్పటి వరకూ రాజధాని నిర్మాణం పేరుతో.. ప్రపంచాన్ని అంతా చుట్టేయడం, ఆయా దేశాల నగరాల పేర్లు చెబుతూ.. వాటిల్లా ‘అమరావతి’ ని నిర్మించేస్తా.. అని చెప్పుకురావడం, ఇక ఏ దేశం వెళితే.. ఆ దేశం సహకారం అందిస్తామని చెప్పింది అనడం.. బాబుకు అలవాటుగా మారిపోయింది!

సింగపూర్ తో మొదలుపెట్టి - శ్రీలంక వరకూ ఇప్పటి ఎన్నో దేశాలకు ప్రత్యేక విమానాలేసుకు తిరగడం - ప్రకటనలు చేయడం జరిగింది. జరుగుతోంది. జనాలు నవ్వుతున్నారు.. అనే స్పృహ కూడా లేని దశకు పతనం అయిపోయాడు ఏపీ సీఎం. ఇక దేశాలన్నీ తిరగేసి.. అక్కడ ప్రసిద్ధ నిర్మాణాలు పేర్లను చెబుతూ, అలాంటి వాటిని ఇక్కడా నిర్మించేస్తానని ప్రగల్భాలు పలుకుతూ.. చిటికెల పందిళ్లు వేస్తూ.. ప్రజలకు మోసపూరిత మాటలు చెప్పడమే పనిగా పెట్టుకున్న చంద్రబాబుకు ప్రహసన పాలనలో సినిమాల పేర్లతో కూడా కామెడీ చేయడం అందరూ ఎరిగిన విషయమే.

ఏపీ రాజధానికి డిజైన్లు అంటూ.. విదేశీ ఆర్కిటెక్ట్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోవడం, వాటికి కోటానుకోట్లు చదివించుకోవడం.. అంతిమంగా ఆ డిజైన్లు పరమ చెత్తగా ఉండటం ఇది వరకటి వ్యవహారం. ఒకవైపు దేశంలో ఎన్నో పేరెన్నిక గల సంస్థలు ఉన్నా - బాబు మాత్రం విదేశీ మోజుతో.. దేశీయ ఇంజనీర్లను - ఆర్కిటెక్ట్ లను అవమానించే వ్యాఖ్యలు చేశాడు. అంతిమంగా ఆయన మెచ్చి తెచ్చిన విదేశీ ఆర్కిటెక్ట్ లు నవ్వులపాలయ్యే డిజైన్లను ఇచ్చాయి. వాటిపై జనాల నుంచి వచ్చిన వ్యతిరేకతకు జడిసి.. మళ్లీ మొదలుపెట్టించిన బాబు, ఇప్పటి వరకూ ఈ వ్యవహారాన్ని ఒక కొలిక్కి తీసుకురాలేకపోతున్నాడు!

ఒంటిచేత్తో హైదరాబాద్ ను నిర్మించేశాను.. అంటూ అనునిత్యం చెప్పుకునే బాబుగారు రెండున్నరేళ్ల నుంచి అమరావతి డిజైన్లపై ఏమీ తేల్చలేకపోతున్నాడు. ఇంతజేసీ అవన్నీ కేవలం గీతలే! ఇక ప్రహసనంలోకి సినిమా వాళ్లను కూడా ఇన్ వాల్వ్ చేసి.. మరింత కామెడీ చేస్తున్నారు చంద్రబాబు. ‘బాహుబలి’ సినిమా ఉన్నట్టుండి ఎందుకు గుర్తుకొచ్చిందో కానీ, దాని దర్శకుడు రాజమౌళి ఆలోచనల మేరకు డిజైన్లు చేయిస్తాం.. అని ఆ మధ్య ప్రకటించారు. రాజధాని నిర్మాణానికి రూపం ఇవ్వడం అంటే.. ఎంతో నైపుణ్యం ఉన్న ఆర్కిటెక్ట్ లు - అనుభవం కలిగిన ఇంజనీర్లు చేసే పని అనుకుంటాం. కానీ ఆఖరికి సెట్టింగులతో - గ్రాఫిక్స్ తో పని చేసుకునే సినిమా దర్శకుల ఆలోచనల మీద ఆధారపడటం చంద్రబాబు దివాళాకోరు తనానికి, ప్రచార ఆర్భాటానికి నిదర్శనంగా మారింది.

మరి ఆ సినిమా దర్శకుడితో అయినా ఆగారా అంటే అదీ లేదు, బాహుబలి తర్వాత వచ్చిన ‘గౌతమీ పుత్రశాతకర్ణి’ సినిమాను చూసిన బాబు - వెంటనే ఆ సినిమా దర్శకుడు క్రిష్ తో తన తదుపరి కామెడీని కొనసాగించడం మొదలుపెట్టాడు. రాజధాని నిర్మాణానికి క్రిష్ సహకారం తీసుకుంటామని అన్నాడు! అయితే.. ఇలాంటి ప్రహసనాన్ని అంతటితో అయినా ఆపితే అది చంద్రబాబు ఎందుకు అవుతాడు? అందుకే.. ఇప్పుడు మరికొన్ని సినిమాలు చూశారట!

ముఖ్యమంత్రి చంద్రబాబు, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణలు కలిసి.. ఇంద్ర - బద్రీనాథ్ - యమదొంగ సినిమాలను వీక్షించి.. వాటిల్లో వివిధ సెట్టింగ్స్ ను చూసి తెగ ఇదైపోయారట! అలాంటి సెట్టింగులు వేసిందో ఎవరో తెలుసుకుని..వారిని అమరావతి డిజైన్లకు వాడుకోవాలని నిర్ణయించేశారట. చివరకు ఆ సెట్టింగుల క్రెడిట్ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయిది అని తెలిసి.. అమరావతి నిర్మాణానికి ఆయననూ వాడేసుకోవాలని ఫిక్సయ్యారని తెలుస్తోంది.

బాహుబలి - గౌతమీ పుత్రశాతకర్ణి.. సినిమాల అనంతరం ఇప్పుడు ఇంద్ర - యమదొంగ - బద్రీనాథ్.. వంటి సినిమాల మీద పడ్డారు ఏపీ ముఖ్యపాలకులు! మరి వీరు ఇంతటితో అయినా ఆగుతారా? ఇంకా పాత సినిమాల వరకూ వెళ్లి ఈ ప్రహసనాన్ని కొనసాగిస్తారా? అనేది వేచి చూడాల్సిన అంశం. పై సినిమాలతో పోలిస్తే.. పాత సినిమాలైన మాయబజార్ - పాతాళభైరవి.. వంటి జానపద - పౌరాణిక సినిమాల్లో గొప్ప సెట్టింగులు ఉంటాయి. అలాగే విఠలాచార్య సినిమాల్లో మాయాభవనాలు - రాక్షస భవంతులు ఉంటాయి.. వాటిని చూసి వీళ్లు ముచ్చటపడినా పడొచ్చు! కానీ వాటి రూపకర్తలు మాత్రం బాబుకు ఇప్పుడు అందుబాటులో లేరు.

ఇప్పటి వరకూ రాజధాని నిర్మాణానికి రూపకల్పన చేయడానికి అంటూ ఎంతో విలువైన కాలాన్ని, అంతకు మించిన డబ్బును వృథా చేసిన చంద్రబాబు నాయుడు తాజాగా ఫోస్టర్ అండ్ పార్ట్ నర్స్ కు 67 కోట్ల రూపాయల చదివింపులను పూర్తి చేశారు. ఆ సంస్థ గీసిన డిజైన్లకు ఈ మొత్తాన్ని చెల్లిస్తున్నారు! ఆ డిజైన్లు ఎలా ఉంటాయో తెలీదు, పనికొస్తాయో లేదో అంతకన్నా తెలీదు.. కానీ ఆ విదేశీ సంస్థకు ఇంత డబ్బును చెల్లించుకుంటున్నారు. ఎవరి సొమ్మని ఇలా వ్యవహరిస్తున్నారో చంద్రబాబు సమాధానం చెప్పాలి. ఇప్పటి వరకూ రాజధాని విషయంలో జరిగిన ఇలాంటి చెల్లింపులన్నింటిపైనా శ్వేత పత్రం విడుదల చేయాల్సిన అవసరం ఉంది. ప్రజల తరపు నుంచి ప్రజాపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ డిమాండ్ చేస్తోంది.

-ఐవీ రెడ్డి,
గిద్దలూరు నియోజకవర్గ సమన్వయ కర్త, వైఎస్సార్ కాంగ్రెస్.