Begin typing your search above and press return to search.

పంచరైన సైకిల్ కు సర్వేల గాలి నిలవదు: ఐవీ రెడ్డి

By:  Tupaki Desk   |   5 Dec 2016 10:38 AM GMT
పంచరైన సైకిల్ కు సర్వేల గాలి నిలవదు: ఐవీ రెడ్డి
X
అమరావతి ప్రహసనానికి విరామం ఇచ్చారు. హామీల అమలులోనూ చేతులెత్తేశారు. అబద్ధాలు - అభూత కల్పనలతో నెట్టుకొస్తున్నారు. రెండు శాతం లోపు ఓట్ల తేడాతో దక్కిన అధికారం.. గోబెల్స్ ప్రచారంతో సాధించిన అవకాశం.. అందులోనూ సగ కాలం పూర్తి అయ్యింది. సానుకూల అంచనాలున్న తటస్తులకూ ఇప్పుడు తత్వం బోధపడుతోంది. ఇలాంటి నేపథ్యంలో… ఆవరించిన శూన్యంలోంచి తెలుగుదేశం పార్టీ సరికొత్త భూతాలను సృష్టిస్తోంది. సర్వేల పేరుతో.. పంచరైన సైకిల్ కు పంపు కొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

జాకీలేసే జాతి మీడియాను అడ్డం పెట్టుకుని.. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న పార్టీకి ఊపిరి వదిలే ప్రయత్నం జరుగుతోంది. వెంటిలేటర్ మీదకు చేరిన పార్టీ ప్రభను ఇలాంటి సర్వేలు కాపాడతాయా? అనేది సులభంగా అర్థం అయ్యే విషయమే. రంకు నేర్చినమ్మ బొంకు నేర్వదా అనేది అచ్చ తెలుగు సామెత. చంద్రబాబు గురించి ప్రజలకు వాస్తవాలు అర్థమవుతున్న ప్రతి సందర్భంలోనూ అభూత కల్పనలు కల్పించే పని పెట్టుకుని - బాబుకు జాకీలేసే జాతి మీడియాకు ఇది వంద శాతం వర్తించే సామెత.

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీకే అత్యధిక సీట్లు వస్తాయన్న ఆ పార్టీ అనుకూల మీడియా “ఫ్లాష్ సర్వే’’ల ఫలితాల తీరును చూస్తుంటేనే తెలుగుదేశం పార్టీ ధీన స్థితి ఏమిటో అర్థం అవుతుంది. చంద్రబాబు పై సడలని నమ్మకం అంటూ ఏక వాక్యంలో చెప్పేస్తున్నారు. మరి అధికారంలోకి వచ్చిన ఈ రెండున్నరేళ్లలో బాబు ఏం సాధించారు అని ప్రజలకు నమ్మకం ఉంది? ఈ అంశం గురించి వివరణ ఇచ్చిన తర్వాత ఇలాంటి సర్వే ఫలితాలను వెల్లడించి ఉండాల్సింది.

సర్వేలో శాస్త్రీయత గురించి మనం అడగకూడదు.. వాళ్లు చెప్పనూకూడదు. రానున్నది తెలుగుదేశం ప్రభంజనమే అన్నట్టుగా ఉన్నాయి ఆ ఫలితాలు. ప్రతిపక్షంలో ఉండి ఎన్నికలను ఎదుర్కొన్న పార్టీలు - కొత్తగా ఏర్పడిన పార్టీలు ప్రభంజనాలు సృష్టించిన సందర్భాలు రాజకీయాల్లో ఉన్నాయి కానీ, ఐదేళ్ల అధికారాన్ని అనుభవించిన తర్వాత ప్రభంజనాలు సృష్టించిన పార్టీలేవీ దేశ రాజకీయ చరిత్రలో లేవు. కానీ తెలుగుదేశం అనుకూల మీడియా ఇలాంటి అబ్బురాలను అతికించిట్టుగా చెప్పడానికి ప్రయత్నించి.. ప్రజల చెవుల్లో పూలు పెట్టడానికి ప్రయత్నిస్తోంది.

సర్వేలో కొన్ని నియోజకవర్గాల పరిస్థితి కూడా చెప్పారు. ఆ వివరాల్లోకి వెళితే.. పాయకారావు పేట వంటి నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలవుతుందనే చెప్పారు. మరి పార్టీకి పట్టున్న - సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న చోట ఓడిపోతుంది అంటూనే.. ఇక నూటా ఇరవై సీట్లు ఎక్కడ వస్తాయి? పక్క రాష్ట్రంలో కూడా సాధించే సీట్లను కలిపి చెప్పారో ఏమో!

ఇక ఈ సర్వేలోని క్షేత్ర స్థాయి ఫలితాల్లోని మరో విచిత్రం.. అనంతపురం విషయంలో చెప్పినమాట. ఇక్కడ తెలుగుదేశం సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నాడు. ఆయన గెలుస్తాడనే మాట కూడా ఈ సర్వే చెప్పింది. గమనించాల్సిన విషయం ఏమిటంటే.. అనంతపురం నియోజకవర్గం అంతర్గత కుమ్ములాటలతో నంబర్ వన్ పొజిషన్ లో ఉంది. గత ఎన్నికల్లో వైకాపా చేసిన కొన్ని పొరపాట్ల ఫలితంగా అనంతలో తెలుగుదేశం జెండా ఎగిరింది. అది కూడా స్వల్ప మెజారిటీతో సాధించిన విజయం. ఇక గెలిచిన రోజు నుంచి… ఈ నియోజకవర్గంలో పెత్తనం విషయంలో ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, అనంత ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి - అనంత మేయర్ మదమంచి స్వరూప - ఇక జిల్లాపై పెత్తనాన్ని సాగించాలని ఆరాట పడే పరిటాల ఫ్యామిలీ కొట్టుకొంటూనే ఉన్నారు. ఈ విధంగా తెలుగుదేశం నేతల మధ్య అక్కడ ఆధిపత్య పోరు సాగుతోంది.

అభివృద్ధిని ఆశించే ప్రజలు.. తెలుగుదేశం ఎమ్మెల్యే - ఎంపీల కుమ్ములాటలు - పోటాపోటీ ధర్నాలు - కొట్లాటలతో విసిగిపోయి ఉన్నారు. అనంత ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిని - అనంత ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిని ఇద్దరినీ ఓడిస్తే తప్ప ప్రశాంత వాతావరణం ఏర్పడదేమో అనే భావనలో ఉన్న నియోజకవర్గంలో తెలుగుదేశం విజయం సాధిస్తుందని చెప్పుకురావడం.. ఈ ప్రహసన పర్వంలో ఒక అధ్యాయం.

ఎక్కడైనా ‘ఐక్యమత్యమే బలం’ అని అంటారు. అయితే తెలుగుదేశం వీర విధేయులు చేసిన ఈ సర్వేలో తెలుగుదేశం పార్టీ బీజేపీ - పవన్ కల్యాణ్ లను వదిలించుకుంటేనే మంచిదని ఉద్భోదించారు. హన్నన్నా.. ఎంత దారుణం - ఎవరిని అడ్డం పెట్టుకుని మొన్నటి ఎన్నికల్లో అధికారాన్ని సొంతం చేసుకున్నారో.. వారినే ఈసడించుకోవడమా! సిగ్గు వదిలిన కమలనాథులకు - బాబును ఇంకా సమర్థిస్తున్న పవన్ కల్యాణ్ కు జరిగిన తగిన శాస్తి ఇది.

చంద్రబాబు పై భ్రమలు తొలగిన వేళ ఇలాంటి సర్వేలు వసూలు చేసి యథాతథంగా తమ వంతు జాకీలేసిన పచ్చ మీడియా.. ఈ భరోసాను బాబుకు కలిగిస్తుంటే, ఫిరాయింపు దారుల చేత రాజీనామా చేయించి, ఈ సర్వే ఫలితాలను రుజువు చేయవచ్చు. ఇంత సానుకూల స్థితే ఉంటే.. అంత ఛీత్కారాలను ఎదుర్కొనాల్సిన అవసరం ఏమిటి? సిగ్గు లేదా.. శరం లేదా… అనిపించుకుంటున్న ఫిరాయింపు ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి - తమకు ఉన్న సానుకూల స్థితిని ఎన్నికల ఫలితాల ద్వారా రుజువు చేయవచ్చు. అలాంటి ధైర్యం ఏ కోశానా కనిపించడం లేదు. ఈ కామెడీ ఎపిసోడ్ లో మరింత కామెడీ ఏమిటంటే.. అనుకూల మీడియా చేసిన ఈ సర్వే పై ఇప్పటి వరకూ సీఎం చంద్రబాబు కానీ, ఆయన తనయుడు లోకేష్ కానీ స్పందించకపోవడం!

అవును..ఆ సర్వే నిజం - అని చెప్పే ధైర్యం వాళ్లకు లేదు. కానీ శూన్యం నుంచి ఇలాంటి సర్వే భూతాలను పట్టుకొచ్చి పంచరైన సైకిల్ కు గాలి కొట్టే యత్నం చేస్తున్నారు. బ్యాలెన్స్ పరువు ఏమైనా ఉంటే దాన్ని తీసుకుంటున్నారు. ఈ విషయంలో వీళ్ల ను అడ్డుకోవాల్సిన అవసరం కూడా లేదు.

-ఐవీ రెడ్డి,
గిద్దలూరు నియోజకవర్గ సమన్వయకర్త- వైఎస్సార్సీపీ - ప్రకాశం జిల్లా.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/