Begin typing your search above and press return to search.

ఐటీ దాడులు: ఇక చంద్రబాబు, లోకేశ్ తప్పించుకోలేరు!

By:  Tupaki Desk   |   8 Feb 2020 6:10 AM GMT
ఐటీ దాడులు: ఇక చంద్రబాబు, లోకేశ్ తప్పించుకోలేరు!
X
రెండు రోజులు గా టీడీపీ నాయకుల నివాసాల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు. పక్కా సమాచారంతో సోదాలు చేశారు. ఈ తనిఖీల్లో భారీ ఎత్తున అవినీతి, అక్రమాలు జరిగాయని వెల్లడైంది. దీంతో వారి నివాసాల్లో విలువైన డాక్యుమెంట్లు, కంప్యూటర్లు, హార్డ్ డిస్క్ లు తదితర స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అయితే వీటన్నిటిని వెనక టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, అతడి తనయుడు లోకేశ్ హస్తం ఉందని స్పష్టంగా తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో కమీషన్ల కోసం చేయని పనులకు చేసినట్లు బిల్లులు సృష్టించి భారీగా ప్రభుత్వం నుంచి లబ్ధి పొందినట్లు గుర్తించారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి గా ఉన్న లోకేశ్ ఆధ్వర్యంలో ఈ అవినీతి బాగోతం జరిగిందని వెల్లడవుతోంది.

చంద్రబాబు, లోకేశ్ బినామీ సంస్థలు, బినామీలుగా ఉన్న వారి ఇళ్లల్లో రెండు రోజులు గా అధికారులు సోదాలు చేశారు. చంద్రబాబుకు దాదాపు పదేళ్లుగా వ్యక్తిగత కార్యదర్శిగా పని చేసిన శ్రీనివాస్, లోకేశ్ ఆంతరంగికుడు, కుటుంబ వ్యాపార సంస్థ నిర్వాణ హోల్డింగ్స్‌ డైరెక్టర్‌ కిలారు రాజేశ్, వైఎస్సార్‌ జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి కి సంబంధించిన ఆర్కే ఇన్‌ఫ్రా, సబ్‌ కాంట్రాక్టర్‌ సుబ్బా రెడ్డి, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శర్‌త్‌ కు చెందిన అవెక్సా ఇన్‌ఫ్రాలలో గురు, శుక్రవారాల్లో ఏకకాలంలో ఐటీ అధికారుల బృందాలు దాడులు చేశాయి. ఈ తనిఖీల్లో ఐటీ అధికారులు పలు కీలక ఆధారాలను సేకరించారు. ఎలాంటి పనులు చేయకుండానే కాంట్రాక్టు సంస్థల నుంచి బిల్లుల రూపంలో కమీషన్లు వసూలు చేశారని గుర్తించారు. జీఎస్టీ ఇంటెలిజెన్స్‌ విభాగం కూడా రంగంలోకి దిగి కూపీ లాగుతోంది.

తీగ లాగితే కదులుతున్న డొంక
చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో పనుల అంచనా వ్యయాన్ని ఇబ్బడిముబ్బడిగా పెంచేసి ఎంపిక చేసిన కాంట్రాక్టర్లకే పనులు దక్కేలా టెండర్లు నిర్వహించి అధిక ధరలకు కట్టబెట్టి ముడుపులు వసూలు చేసుకున్నారు. కాంట్రాక్టు సంస్థల నుంచి వసూలు చేసిన కమీషన్లను తమ బినామీ సంస్థలు, బినామీల ఖాతాల్లోకి మళ్లించారు. ఆ తర్వాత వారి నుంచి కుటుంబ వ్యాపార సంస్థల్లోకి, విదేశాలకు దారి మళ్లించి పక్కా ప్లాన్ తో వ్యవహారం నడిపించారు. అయితే ముంబై కేంద్రంగా పనిచేసే ఓ బడా కాంట్రాక్టు సంస్థ కార్యాలయాల్లో సోదాలు చేయగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముఖ్యనేతకు రూ.150 కోట్లకు పైగా ముడుపులు అందాయని ఐటీ అధికారులు పక్కా ఆధారాలు సేకరించిన విషయం విదితమే. దాన్ని పట్టుకుని విచారణ చేస్తే చంద్రబాబు, లోకేశ్ అక్రమాల డొంక కదులుతోంది.

భారీగాముడుపులు
ఇక నారా లోకేశ్ తమ కుటుంబ వ్యాపార సంస్థ నిర్వాణ హోల్డింగ్స్‌లో కిలారు రాజేశ్ ను పూర్తి కాలపు డైరెక్టర్‌గా నియమించుకున్నారు. మంత్రిగా ఉన్న సమయంలో లోకేశ్ వ్యవహారాలను రాజేశ్ చక్కబెట్టేవారు. ఓ బడా కాంట్రాక్టు సంస్థ నుంచి పెదబాబు వసూలు చేసిన ముడుపుల్లో కొంత భాగాన్ని కిలారు రాజేశ్ కు చెందిన రెండు షెల్‌ కంపెనీల ఖాతాల్లో జమ అయ్యాయని ఐటీ అధికారులు గుర్తించారు. దీంతో రెండు రోజులుగా హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ లోని ఆయన ఇల్లు, సంస్థ కార్యాలయాల్లో దాడులు చేశారు. దీంతో పలు కీలక ఆధారాలను సేకరించారు. మరో మూడు బడా కాంట్రాక్టు సంస్థల నుంచి చంద్రబాబు వసూలు చేసిన ముడుపులను కిలారు రాజేశ్ షెల్‌ కంపెనీల్లో జమ చేసినట్లు అధికారులు గుర్తించారు.

కీలక ఆధారాలు లభ్యం..
2009 నుంచి 19 వరకు చంద్రబాబు కు వ్యక్తిగత కార్యదర్శిగా శ్రీనివాస్‌ పనిచేశారు. చంద్రబాబు వసూల్ చేసిన ముడుపులు శ్రీనివాస్‌ వ్యక్తిగత ఖాతాతో పాటు ఆయన కుటుంబసభ్యుల పేర్ల తో ఏర్పాటుచేసిన షెల్‌ కంపెనీల్లోనూ జమ చేసినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. దీంతో శ్రీనివాస్ కు చెందిన విజయవాడ, హైదరాబాద్‌లోని నివాసాల్లో సోదాలు చేసిన ఐటీ అధికారులు కీలక ఆధారాలను సేకరించినట్లు సమాచారం. అక్రమాలకు తమదైన శైలిలో చంద్రబాబు, లోకేశ్ పద్ధతిలో వెళ్లారు. బడా కాంట్రాక్టు సంస్థల వద్ద వైఎస్సార్‌ జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డికి చెందిన ఆర్కే ఇన్‌ఫ్రా, సబ్‌ కాంట్రాక్టర్‌ సుబ్బారెడ్డి ఎలాంటి పనులు చేయకుండానే సబ్‌ కాంట్రాక్టు పనులు చేసినట్లు రికార్డులు సృష్టించి వాటికి బిల్లులు చెల్లించినట్లు చూపి ముడుపులను జమ చేయించుకున్నారు. దీన్ని గుర్తించిన ఐటీ అధికారులు ఆర్కే ఇన్‌ఫ్రాతోపాటు శ్రీనివాసులురెడ్డి, సుబ్బా రెడ్డి ఇళ్లల్లో సోదాలు చేశారు. వీరు జీఎస్టీ చెల్లించకపోవడాన్ని గుర్తించిన ఐటీ అధికారులు సమాచారం ఇవ్వడంతో జీఎస్టీ ఇంటెలిజెన్స్‌ విభాగం రంగంలోకి దిగింది. ఇప్పుడు ఈ అధికారులు కూడా తనిఖీలు చేసి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

ప్రత్తిపాటి పుత్రరత్నం భాగస్వామే
మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చంద్రబాబుకు సన్నిహితుడు. అయితే పుల్లారావు కుమారుడు శరత్‌కు చెందిన అవెక్సా ఇన్‌ఫ్రా లో చంద్రబాబు హయాంలో భారీ ఎత్తున లబ్ధి పొందింది. ఈ సంస్థలో కాంట్రాక్టులు పొందిన నాలుగు సంస్థల వద్ద అవెక్సా ఇన్‌ఫ్రా సబ్‌ కాంట్రాక్టు కింద పనులు చేసినట్లు చూపి వారి నుంచి వసూలు చేసిన ముడుపులను బిల్లుల రూపంలో చెల్లించినట్లుగా ఆ సంస్థ ఖాతాలోకి మళ్లించారు. ఐటీ అధికారులు హైదరాబాద్‌ లోని ఆ సంస్థ కార్యాలయం, శరత్‌ ఇళ్లల్లో తనిఖీలు చేయగా ఈ విషయం తెలిసింది. రూ.69 కోట్లను జీఎస్టీ గా చెల్లించాల్సి ఉండగా అవెక్సా ఇన్‌ఫ్రా ఎగ్గొట్టడం తో ఐటీ అధికారులు జీఎస్టీ ఇంటెలిజెన్స్‌ విభాగానికి ఫిర్యాదు చేశారు.