Begin typing your search above and press return to search.

ఐటీ ప్రొఫెషనల్స్ ను కొబ్బరి తోటకు పంపిన కరోనా

By:  Tupaki Desk   |   18 March 2020 12:30 AM GMT
ఐటీ ప్రొఫెషనల్స్ ను కొబ్బరి తోటకు పంపిన కరోనా
X
కరోనా వైరస్ ప్రభావంతో విశ్వవ్యాప్తంగా ప్రజలు భయాందోళనలకు గురవుతున్న సంగతి తెలిసిందే. ఈ వైరస్ ధాటికి అటు ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఇటు ప్రైవేట్ ఉద్యోగులు కూడా తమ కార్యాలయాల్లో పనిచేసేందుకు వణికిపోతున్నారనే చెప్పాలి. కొన్ని ప్రైవేట్ కంపెనీలు అయితే ఏకంగ తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోంను అప్పజెప్పేశాయి. కరోనా ప్రభావంతో దేశాలకు దేశాలకు హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ ఐటీ కంపెనీ తమ ఉద్యోగులకు ఏకంగా కొబ్బరి తోటలో ఏర్పాటు చేసి అక్కడి నుంచే పని చేయిస్తున్న వైనం వైరల్ గా మారిపోయింది.

కరోనా వైరస్‌ కారణంగా కొన్ని కంపెనీలు.. ముఖ్యంగా ఐటీ కంపెనీలు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ పాలసీని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బెంగళూరుకు చెందిన ఓ ఐటీ కంపెనీ మాత్రం తమ ఉద్యోగులను తమిళనాడుకు తరలించింది. వర్తమానపురంలో ఉన్న కొబ్బరి తోటల్లో వర్క్‌ చేసేలా అన్ని ఏర్పాట్లు చేసింది. దీంతో ఉద్యోగులు కొబ్బరితోటల్లో చల్లగా పని చేసుకుంటున్నారు. ఏసీ రూములకు అలవాటు పడిన తమకు కొబ్బరి తోటల్లో పని చేయడం కొంచెం కష్టంగా ఉన్నా మంచి అనుభూతిని ఇస్తున్నదని ఐటీ ఉద్యోగులు చెబుతున్నారు.

కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి పలు ప్రైవేటు సంస్థలకు నిర్దిష్టమైన ఆదేశాలు అందాయి. తమ ఉద్యోగుల్లో 50 శాతం మేరకు వర్క్ ఫ్రమ్ కిందకు తరలించాలని, దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని నిర్దేశించింది కేంద్రప్రభుత్వం. వీలు కాని పరిస్థితిలో అవసరమైతే పెయిడ్ లీవుల్లో కొందరినైనా పంపించాలని కేంద్ర మార్గదర్శకాలను జారీ చేసింది. కేంద్రం నుంచి వచ్చిన ఈ మార్గనిర్దేశాల కారణంగానే ఈ బెంగళూరు ఐటీ కంపెనీ... తన ఉద్యోగులను వర్క్ ఫ్రం హోం కాకుండా కొబ్బరి తోటలకు తరలించేసి పని చేయిస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.