Begin typing your search above and press return to search.

వైఎస్ బొమ్మ వాడుకుంటే సరిపోదు షర్మిలమ్మ ....

By:  Tupaki Desk   |   6 July 2021 6:41 AM GMT
వైఎస్ బొమ్మ వాడుకుంటే సరిపోదు షర్మిలమ్మ ....
X
బుధవారం కొత్తగా రాజకీయ పార్టీని ప్రకటించబోతున్న వైఎస్ షర్మిల తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ బొమ్మతోనే దూసుకువెళ్ళేందుకు ప్లాన్ చేస్తున్నారు. మొదటినుండి తెలంగాణాలో రాజన్న పాలన తీసుకొస్తానని షర్మిల చెబుతున్న విషయం అందరికీ తెలిసిందే. తాను చెబుతున్నట్లే పార్టీ జెండాలో కూడా వైఎస్ బొమ్మ ఉండేలా డిజైన్ చేసినట్లు సమాచారం.

పార్టీ జెండా ఇదే అంటు ఓ జెండా బొమ్మ లీకైంది. ఇపుడీ జెండా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. పార్టీ జెండాలో కొంతభాగం పాలపిట్ట రంగు మిగిలిన భాగం నీలం రంగుతో నిండిపోయింది. నీలంరంగు మధ్యలో తెలంగాణా రాష్ట్రం మ్యాప్ కనిపిస్తోంది. ఈ మ్యాప్ మధ్యలో చిరునవ్వుతో ఉన్న వైఎస్సార్ బొమ్మ కనబడుతోంది.

అటు ఏపిలో కూడా జగన్మోహన్ రెడ్డి 2009లో పార్టీ పెట్టినపుడు వైఎస్ పేరు గుర్తుకొచ్చేలా పార్టీ పేరు పెట్టుకున్న విషయం తెలిసిందే. పార్టీ పేరుతో పాటు జెండాలో కూడా వైఎస్సార్ ప్రముఖంగా కనబడేట్లుగా జాగ్రత్తలు తీసుకున్నారు. అదే విధంగా ఇపుడు తన చెల్లెలు, తెలంగాణాలో అదృష్టం పరీక్షించుకునేందుకు పార్టీ ఏర్పాటు చేయబోతున్నారు.

జెండాను చూడగానే తన తండ్రి గుర్తకొచ్చేలా సహజంగా తన తండ్రి బొమ్మే ప్రముఖంగా కనబడేట్లుగా జెండాను డిజైన్ చేయించుకున్నారు. తెలంగాణాలోని చాలా జిల్లాల్లో వైఎస్ పై జనాల్లో ఉన్న అభిమానాన్ని అడ్వాంటేజ్ తీసుకోవాలని షర్మిల వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.

పార్టీ పేరు, జెండాలో తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని వాడేసుకుంటున్న వైఎస్ షర్మిల రెడ్డి వైఎస్ ఆర్ వారసురాలిగా ఆయన ఆశయాలు ఆయన ధైర్యాన్ని మాత్రం పుణికిపుచ్చుకోవడం లేదు. ఆనాడు టీఆర్ఎస్ పార్టీ విషయంలో వైఎస్ రాజశేఖరరెడ్డి చూపిన దూకుడు, ప్రత్యర్థులపై గెలవడంలో వైఎస్ రాజశేశేఖరరెడ్డి చూపిన ధైర్యం ఏ కోశాన షర్మిల చూపడం లేదు.

వైఎస్ వారసత్వాన్ని రాజకీయాలకు వాడుకోవడమే కాకుండా అన్ని ప్రాంతాల వారికి న్యాయం జరగాలన్న వైఎస్ ఆర్ ఆశయానికి విరుద్ధంగా షర్మిల ముందుకు నడుస్తున్నారు. ఒక్క నీటి బొట్టును కూడా ఆంధ్రాకు పోనివ్వం అంటూ వైఎస్ షర్మిల చేసిన ప్రకటన వైఎస్ఆర్ ప్రభను మసకబార్చేలా ఉంది. ఆమె వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలు ఎవరూ నమ్మకపోగా... ఆంధ్రాలో నవ్వుల పాలయ్యాయి.

అలాంటి డైలాగులు వేస్తే రాజకీయ లాభం వస్తుందంటే... ఇంకేమైనా ఉందా? అందరికీ సమన్యాయం కలిగేలా జల వివాదాలు పరిష్కరించే దిశగా షర్మిల మాట్లాడి ఉండుంటే వైఎస్ ఆర్ అభిమానుల మనసు గెలుసుకునే వారు షర్మిల. కానీ వైఎస్ అభిమానులతో పాటు అందరూ నొచ్చుకునేలా ఉన్నాయి ఆమె మాటలు.