Begin typing your search above and press return to search.

కేసీఆర్ ను అనే దమ్ము కొమ్ములు తిరిగిన కాలమిస్టులకు లేదా?

By:  Tupaki Desk   |   5 July 2021 11:30 PM GMT
కేసీఆర్ ను అనే దమ్ము కొమ్ములు తిరిగిన కాలమిస్టులకు లేదా?
X
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం అన్న మాట కొద్దిరోజులుగా తరచూ వింటున్నాం. నిజానికి జలవివాదం ఉందా? అంటే అదో బ్రహ్మ పదార్థం. కొమ్ములు తిరిగిన కాలమిస్టులు సైతం ఈ విషయం వద్దకు వచ్చేసరికి న్యాయాన్ని న్యాయంగా చెప్పాల్సిన పరిస్థితిని అలా చెప్పకుండా.. మాటలు దాచేస్తున్న పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో కోరి తగాదా తెచ్చుకోవటానికి ఎవరూ ఇష్టపడటం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన్ను టచ్ చేసి సమస్యలు తెచ్చుకునే కన్నా.. చూసిచూడనట్లుగా వ్యవహరించాలన్నట్లుగా ఉంటున్నారు.

సాధారణంగా ఏదైనా అంశం మీద వివాదం నెలకొన్నప్పుడు.. దానికి సంబంధించిన పూర్వాపరాల్ని ప్రస్తావించటం.. విశ్లేషించటం.. ఎవరు ఎందుకు చేస్తున్నారు? అందులోని న్యాయన్యాయాల మాటేంది? లాంటి ప్రశ్నలకు.. తమకున్న సమాచారంతోపాటు.. అధికారిక సమాచారాన్ని వినియోగించి కాలమ్ లు రాయటం కాలమిస్టుల పని. అదేం దరిద్రమో కానీ.. ఏపీకి సంబంధించిన న్యాయమైన విషయాల్ని.. చాలామంది చేతుల్లో ఉన్న కలాలు ఉన్నది ఉన్నట్లుగా రాయటానికి కిందామీదా పడిపోతుంటారు. అదే సమయంలో ఏపీని దుమ్మెత్తిపోయటానికి మాత్రం అస్సలు వెనుకాడరు. ఎందుకిలా? అన్నది ప్రశ్న.

ఏపీ కడుతున్న రాయలసీమ ప్రాజెక్టుపైన నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్న తెలంగాణ అధికారపక్షానికి చెందిన నేతలు మాత్రమే కాదు.. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి చెలరేగిపోతున్నారు. నిబంధనల్ని తోసిరాజని తనకు తోచినట్లుగా వ్యవహరిస్తానన్న మాట ఆయన నోటి నుంచి యదాలాపంగా వచ్చేస్తోంది. ఇప్పటికే అమలవుతున్న ఒప్పందాల్ని తాము ఒప్పుకోమని..తాము చెప్పినట్లే చేయాలని చెప్పటం ఇప్పుడు షాకింగ్ గా మారుతోంది. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల మధ్య బోలెడన్ని జలవివాదాలు ఉన్నాయి.

వాటిని పరిష్కారించుకోవటానికి ఉన్న పద్దతుల్ని పక్కన పెట్టేసి.. నాకు నచ్చింది ఇలా.. తోచించి ఇలా.. నేను ఇలానే చేస్తాను. ఎవరేం చేస్తారో చేసుకోండి లాంటి మాటలు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ మాత్రం మంచిది కాదు. నిజానికి ఇదే తీరును కేసీఆర్ ఉద్యమం చేస్తున్న వేళ.. ఉమ్మడి పాలకులు అనుసరించిన ఉంటే పరిస్థితి ఎలా ఉంటుంది? నిజానికి ఉమ్మడి పాలకుల్ని తెలంగాణ ఏర్పడిన ఏడేళ్లకు కూడా తిట్టిపోసే కేసీఆర్.. నిజంగా ఉమ్మడి పాలకులు అంత దుర్మార్గులైతే.. కేసీఆర్ నోటికి అప్పట్లోనే తాళం వేసేవారు కదా? ఇప్పుడు ఎలా అయితే తన ప్రత్యర్థులకు చెక్ పెట్టేందుకు దేనికైనా సిద్ధమన్నట్లుగా వ్యవహరించే గులాబీ ముఖ్యమంత్రి తీరును.. అప్పటి ఉమ్మడి పాలకులు ఎందుకు అనుసరించనట్లు? అన్నది కూడా ప్రశ్నే.

ఈ విషయాల్ని వదిలేసి.. తన రాజకీయ ప్రయోజనాల కోసం మాట్లాడటం ఏ మాత్రం సమర్థనీయం కాదు. అదే సమయంలో.. కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయన్న విషయాన్ని విపులీకరించి విశ్లేషించాల్సిన కాలమిస్టులు సైతం.. ఆ ప్రయత్నం చేయటానికి ఇష్టపడకపోవటం గమనార్హం. తెలంగాణ ఉద్యమ వేళ నుంచి చూస్తే.. అన్ని తప్పులు ఆంధ్రా పాలకులు చేసినట్లుగా.. వారి తెలివితక్కువతనం.. చేతకానితనం అంటూ మాటలు అనేసే వారి మాటల్ని చూసినప్పుడు.. ఒక ప్రాంతానికి చెందిన వారు ఇంత దుర్మార్గంగా.. సినిమా విలన్ల కంటే దారుణంగా వ్యవహరించారా? అన్న సందేహం కలుగక మానదు.

నిజంగానే తప్పులు చేసి ఉంటే.. ఏపీ ఇప్పుడు చాలానే బాగుపడి ఉండాలి కదా? ఏపీ నేతలంతా ఢిల్లీలో చక్రం తిప్పేస్తారన్న ప్రచారంలో కూడా పస లేదన్న విషయాన్ని విభజన వ్యవహారం తేల్చి చెప్పింది. ఒకవేళ.. నిజంగానే ఆంధ్రా ప్రాంతానికి చెందిన నేతలు అంత పోటుగాళ్లు అయి ఉంటే.. విభజన వేళ ఏపీ అంతగా నష్టపోయేది కాదు. విభజన సందర్భంలో ఇరు రాష్ట్రాలకు జరిపిన పంపకాల్లో అసమతుల్యత కొట్టొచ్చినట్లు కనిపించినా.. ఇప్పుడు పెద్ద మనుషులుగా మాట్లాడే కాలమిస్టులు ఎవరూ కూడా ఏపీకి జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడింది లేదు. ఇదెక్కడి విభజన అంటూ.. గుండెలు బాదుకున్నది లేదు.

ఇలా చూసినప్పుడు ఏపీకి కేంద్రం మాత్రమే కాదు.. మేధావులు కూడా దెబ్బేశారు. మరీ ముఖ్యంగా మీడియాకు చెందిన వారు కూడా. దమ్మున్న కాలమిస్టులు సైతం కేసీఆర్ ను ఒక పరిధి దాటి తిట్టిపోసేందుకు.. ఆయన చేసే తప్పుల్ని ఎత్తి చూపించే సాహసం చేయలేకపోతున్నారు. మొదట్నించి వస్తున్న దరిద్రమే ఇప్పుడు నడుస్తోంది. దీంతో.. జలవివాదం అన్నది ఏమీ లేకున్నా.. తన రాజకీయ స్వలాభం కోసం తెర మీదకు తెచ్చిన వివాదంలోని డొల్లతనాన్ని ఎత్తి చూపించాల్సిన వారు.. కాలమే సమాధానం ఇస్తుందంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు

. అడ్డగోలుగుగా విద్యుదుత్పత్తి చేస్తున్న వైనాన్ని కూడా విశ్లేషించకుండా.. అప్పట్లో అలా జరిగిందంటూ కాలం మీదా.. అప్పటి వారి నిర్ణయం మీద నెపం నెట్టేస్తున్నారే తప్పించి.. అప్పుడు జరిగిన తప్పుల్ని ఇప్పుడు ఎందుకు సరిదిద్దకూడదు? భవిష్యత్తులో మరిన్ని పేచీలు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి ఎందుకు మాట్లాడరు? అన్నది ప్రశ్న. ఇదంతా చూసినప్పుడు అర్థమయ్యేదేమంటే.. కేసీఆర్ మాటకు ప్రతి మాట చెప్పే ధైర్యం.. సాహసం ఎవరికి లేకపోవటమే. ఈ మాటను జీర్ణించుకోవటం కష్టంగా ఉన్నప్పటికి ఇదే నిజమన్నది మర్చిపోకూడదు. ఇలాంటి చేతకాని కాలమిస్టులు.. ఏపీకి జరుగుతున్న అన్యాయాన్ని ఎలుగెత్తే ధైర్యం చేయలేని మేధావులతో నష్టపోతున్నది అమాయక ఆంధ్రా ప్రజలే.