Begin typing your search above and press return to search.

షర్మిల అనుకున్నది సాధించింది..

By:  Tupaki Desk   |   30 Nov 2022 5:54 AM GMT
షర్మిల అనుకున్నది సాధించింది..
X
పట్టుమని పది మంది కూడా ఆమె వెంట లేరు. పార్టీ పెట్టి.. పాదయాత్రగా తెలంగాణ అంతటా తిరుగుతున్నా స్పందన లేదు. 3వేల కి.మీలు పూర్తి చేసినా కూడా తెలంగాణ సమాజం.., మీడియా వైఎస్ షర్మిలను పట్టించుకున్న పాపాన పోవడం లేదు. అందుకే ఆ ఫస్ట్రేషన్ లో షర్మిల ఏం చేస్తుందో కూడా అర్థం కావడం లేదని పలువురు సెటైర్లు వేస్తున్నారు. ఆమె వేషభాష చూస్తుంటే అదే అనిపిస్తోంది మరీ.. నిన్న ఏకంగా పాత కారు ఎక్కి ప్రగతి భవన్ పైకి దండయాత్రకు వెళ్లింది. కేసీఆర్ ను ఢీకొంటేనే తనకు మైలేజ్ వస్తుందని నానా యాగీ చేసింది. మీడియాలో నానాలని షర్మిల చేసిన ప్రయత్నాలు నిన్న బాగానే ఫలించాయి. పోలీసులు షర్మిలను కారుతో సహా క్రేన్ తో లాక్కెళ్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. షర్మిలకు తోడుగా వైఎస్ విజయమ్మ కూడా రోడ్డెక్కి మొసలికన్నీరు కార్చడంతో తల్లీకూతుళ్లకు కావాల్సినంత మైలేజ్ మీడియాలో ప్రజల్లో వచ్చినట్టైంది.

నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఏపీలో ప్రారంభించిన పాదయాత్రకు అద్భుత స్పందన వచ్చింది. రైతులు, ప్రజలు వెంట నడిచిన పరిస్థితి. నియోజకవర్గాల్లో పర్యటిస్తుంటే నేతలంతా కాంగ్రెస్ లో చేరారు. వైఎస్ జగన్ విషయంలోనూ అంతకుమించిన స్పందన.. కానీ ఏపీ ఆడకూతురు వైఎస్ షర్మిల తెలంగాణలో అప్పుడే 3వేల కి.మీల పాదయాత్ర పూర్తయినా కూడా ఏమాత్రం ఉలుకూ పలుకు లేదు. ఎవరూ పట్టించుకున్న పాపాన పోవడం లేదు. ఒక్క చిన్న స్థాయి నాయకుడు కూడా ఆమె పార్టీలోకి రాకపోవడం చూసి అందరూ షర్మిల పాదయాత్ర వృథా అంటూ కామెంట్లు చేస్తున్నారు.అయితే, క్షేత్రస్థాయి నివేదికల ప్రకారం చూస్తే, షర్మిల పాదయాత్ర ఓటర్లపై పెద్దగా ప్రభావం చూపడం లేదని అంటున్నారు. ఆమె ఇంత కష్టపడినా వచ్చే ఎన్నికల్లో ఆమెకు ఏం ప్రయోజనం దక్కేలా కనిపించడం లేదని అభిప్రాయపడుతున్నారు.

షర్మిల తన సభలకు ప్రజల నుంచి విపరీతమైన స్పందన వస్తోందని చెప్పుకుంటున్నప్పటికీ.. ఆశించిన జనం రావడం లేదు. కనీసం సర్పంచ్ స్థాయి నేతలు కూడా ఆమె సమక్షంలో పార్టీలో చేరడం లేదు. అసలు నేతల నుంచి స్పందనే కరువైందని అంటున్నారు. ఆమె ఏ తెలంగాణకు చెందిన నేత కాకపోవడం.. తెలంగాణ కార్డును ప్లే చేయలేకపోవడంతో చేరడానికి చాలా మంది భయపడుతున్నారు. ఆమె తన తండ్రి వైఎస్ఆర్ సెంటిమెంట్ పైనే ఆధారపడి ఉంది.

ఇంత కాలికాలిన పిల్లిలా తిరుగుతున్నా కూడా షర్మిల పాదయాత్రకు స్పందన రాకపోవడం.. ఎవరూ చేరకపోవడం చూసి షర్మిలలో అసహనం పెల్లుబుకుతోంది. అందుకే ఏ నియోజకవర్గానికి వెళితే ఆ నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలను తిట్టడమే పనిగా పెట్టుకుంది. ఇటీవల సంగారెడ్డి వెళ్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని తిట్టింది. జగ్గారెడ్డి వైఎస్ఆర్ ఫ్యామిలీ గుట్టును అంతా బయటపెట్టి షర్మిల పరువు తీశాడు. అయినా బుద్దిరాకుండా ఆంథోల్ వెళ్లి టీఆర్ఎస్ ఎమ్మెల్యేతో సున్నం పెట్టించుకుంది.

షర్మిలను ఎవరూ పట్టించుకోకపోవడంతో 'దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి' అని సవాల్ చేస్తోంది. మొన్నీ మధ్య సంకెళ్లతో ప్రెస్ మీట్ లో హల్ చల్ చేసింది. అయినా పోలీసులు పట్టించుకోలేదు. ఇక నిన్న ఏకంగా సీఎం కేసీఆర్ నివాసంపైకి దండెత్తింది. అరెస్ట్ అయ్యింది. కొంత మైలేజ్ సాధించింది.

ఇన్నాళ్లు మీడియా పట్టించుకోలేదు. ఎంత తిట్టినా ఎంపీలు, ఎమ్మెల్యేలు షర్మిలకు కౌంటర్ ఇవ్వడం లేదు. టీఆర్ఎస్ వాళ్లను తిట్టినా పట్టించుకోకపోవడంతో ఫస్ట్రేషన్ లో రోడ్డున పడింది షర్మిల.

షర్మిల ప్రెస్ మీట్స్ అంతా కేఏ పాల్ మాదిరి కామెడీ పీస్ గా ఉంటున్నాయని యూట్యూబ్ వాళ్లు ఆడిపోసుకుంటున్నారు. అందుకే ఇక కేసీఆర్ పైకి దండెత్తితేనే తనను పట్టించుకుంటారని మొత్తానికి ఒకరోజు అయినా అరెస్ట్ కావాలని నిన్న హంగామా చేసింది. మీడియా స్పేస్ ఇస్తుందని కేసీఆర్ ఇంటి ముట్టడికి వెళ్లి తిట్టిపోసింది. ఎట్టకేలకు అరెస్ట్ అయ్యింది.

ఇలా తెలంగాణ మీడియా, ప్రజానీకం దృష్టిలో పడడానికి షర్మిల చేయని ప్రయత్నాలు లేవు. ఎంత చేస్తున్నా ఫాఫం షర్మిలక్కకు కావాల్సినంత మైలేజ్ అయితే రావడం లేదు. నిన్న కాస్త అలజడి సృష్టించినా కూడా మిగతా పార్టీల హైప్ అయితే రాలేదు. కానీ షర్మిల ఒక్క నేత ఉన్నారని మాత్రం తెలంగాణలో ప్రొజెక్ట్ అయ్యింది. తల్లి కూతుళ్ల రాజకీయం నిన్న సరిగా పండలేదన్న టాక్ వినిపించింది. ఎన్ని కుప్పిగంతులు వేసినా షర్మిలను పట్టించుకున్న పాపాన పోవడం లేదు.

రాజకీయాల్లోకి వచ్చాక పరిణతి ఉండాలి. అభివృద్ధి, సమస్యలపై మాట్లాడాలి. కానీ ఇలా వ్యక్తిగతంగా ఇమేజ్ డ్యామేజ్ చేయాలని చూస్తే పోయేది షర్మిల పరువే. దాన్ని గుర్తు ఎరిగి ఇప్పటికైనా షర్మిల జాగ్రత్త వహిస్తే చాలా మంచిదని పలువురు హితవు పలుకుతున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.