Begin typing your search above and press return to search.

తెలంగాణలో నీరసం.. ఓటేస్తారా లేదా?

By:  Tupaki Desk   |   10 April 2019 6:06 AM GMT
తెలంగాణలో నీరసం.. ఓటేస్తారా లేదా?
X
తెలంగాణలో పోలింగ్ ఊపు లేదు.. జనాలు నీరసించిపోయారు. ఓటేయడానికి వస్తారో రారో అన్న టెన్షన్ తెలంగాణలోని పార్టీలను వెంటాడుతోంది. ఏపీతో పోలిస్తే భిన్నమైన వాతావరణం ఇక్కడ నెలకొంది. ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, పార్లమెంట్ ఏకకాలంలో కావడంతో జనాలందరూ ఆసక్తితో భారీ పోలింగ్ కు సిద్ధమవ్వగా.. తెలంగాణలో మాత్రం పార్లమెంట్ ఎన్నికలే కావడంతో ఎవరిమానాన వారు మిన్నకుండిపోతున్నారు..

మొన్నటి డిసెంబర్ లో చల్లటి వాతావరణంలో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ ఓటర్లు కొన్ని నియజకవర్గాల్లో పోటెత్తారు. 80శాతానికి దగ్గరగా పోలింగ్ నమోదైంది. కొన్ని చోట్ల 80 దాటింది. హైదరాబాద్ మినహా తెలంగాణ అంతటా.. తమ తలరాతలను మార్చే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఓన్ చేసుకొని మరీ ఎన్నుకున్నారు. గులాబీ పార్టీకి పట్టం కట్టారు. ఇప్పుడు తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు మాత్రమే జరుగుతున్నాయి.

పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణలో అస్సలు ఊపు లేకుండా పోయింది. ఇక్కడ టీఆర్ ఎస్ ప్రభంజనంతో మిగతా పార్టీలన్నీ డీలా పడ్డాయి. కాంగ్రెస్, బీజేపీలైతే ఎలాగూ గెలవమని తెలిసి ఢిల్లీ అధిష్టానం నుంచి వచ్చిన డబ్బులను అభ్యర్థులు దాచుకొని అస్సలు ప్రచారం చేయకుండా.. జనంలో తిరిగి ఖర్చు చేయకుండా ఉండిపోతున్నారన్న టాక్ వినిపిస్తోంది. కేవలం గులాబీ దండు అదీ మండలస్థాయిలోనే ప్రచారం చేస్తోంది. క్షేత్రస్థాయి ఓటరును ఇప్పటివరకూ ఏపార్టీ కలిసింది లేదు.. బీరు, బిర్యానీ, డబ్బులు పంచింది లేదు. దీంతో ఎవరి పనుల్లో వారున్నారు. తమను ఎవరూ పట్టించుకోవడం లేదని ఓటర్లు కూడా ఈ పార్లమెంట్ ఎన్నికలను పట్టించుకోవడం లేదు. దీంతో అసలు పోలింగ్ 50శాతం దాటుతుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రస్తుతం ఎక్కడా డబ్బులు పంచడం లేదు. మద్యం పంపిణీ కూడా జరగడం లేదు. గెలుస్తామనే ధీమాతో టీఆర్ ఎస్ ఏం పంచకుండా ఉండగా.. అధిష్టానం పంపినా.. ఖర్చు బొక్కా అని బీజేపీ, కాంగ్రెస్ లు తూతూ మంత్రంగా తిరుగుతున్నాయి. దీంతో అసలు తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ఊపే లేకుండా పోయింది. ఈ ప్రభావం ఖచ్చితంగా తెలంగాణ పోలింగ్ పై ఉటుందని విశ్లేషకులు అంచనావేస్తున్నారు.