Begin typing your search above and press return to search.

వైసీపీ చంద్రబాబును లైట్‌ తీసుకోవడం వెనుక వ్యూహమిదేనా?

By:  Tupaki Desk   |   17 Nov 2022 3:00 PM IST
వైసీపీ చంద్రబాబును లైట్‌ తీసుకోవడం వెనుక వ్యూహమిదేనా?
X
2024 శాసనసభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో విజయం సాధించడం అన్ని పార్టీలకు జీవన్మరణ సమస్యగా మారింది. ముఖ్యంగా టీడీపీకి విజయం సాధించడం చాలా అవసరం. లేదంటే ఆ పార్టీ ఉనికికే ప్రమాదమని అంటున్నారు.

ఇది గుర్తెరిగిన టీడీపీ అధినేత నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు. ఇంకోవైపు నియోజకవర్గాల సమీక్షలు నిర్వహిస్తూ పార్టీ పరిస్థితిని అంచనా వేస్తున్నారు. ఒంగోలులో నిర్వహించిన మహానాడు అంచనాలకు మించి విజయవంతం కావడం, బాదుడే బాదుడు వంటి కార్యక్రమాలు ప్రజల ఆదరణ పొందడంతో టీడీపీలో జోష్‌ నెలకొంది. ఇదే సమయంలో జనసేనతో పొత్తు కుదిరే సూచనలున్నాయన్న వార్తలు టీడీపీ శిబిరంలో సంతోషాన్ని నింపుతున్నాయి.

ఈ నేపథ్యంలో వైసీపీ కూడా తన రూటు మార్చిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇంతకుముందు చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్‌ చిన్న ట్వీట్‌ చేసినా వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసేవారు. అలాంటిది గత కొద్ది రోజులుగా టీడీపీపై వైసీపీ నేతలు విమర్శలు తగ్గించేశారు. కింద స్థాయి నేతలకు కూడా చంద్రబాబును విమర్శించవద్దంటూ వైసీపీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసిందని చెప్పుకుంటున్నారు.

చంద్రబాబు, లోకేష్‌లకు అతిప్రాధాన్యత ఇచ్చి, వారిపైన విమర్శలు చేస్తే టీడీపీ బలంగా ఉందనే సంకేతాలు తానే ఇచ్చినట్టు అవుతుందని వైసీపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే తన వ్యూహం మార్చిందని అంటున్నారు.

ఇప్పుడు వైసీపీ నేతలంతా జనసేనాని పవన్‌ కల్యాణ్‌పై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఆయన చిన్న ట్వీట్‌ చేసినా మంత్రి అంబటి రాంబాబు వంటి వారు వెంటనే రంగంలోకి దిగిపోయి పవన్‌పై శివాలెత్తుతున్నారు.

వచ్చే ఎన్నికలు వైసీపీ వర్సెస్‌ జనసేన, జగన్‌ వర్సెస్‌ పవన్‌ అన్నట్టు వైసీపీ నేతలు మార్చేస్తున్నారని అంటున్నారు. తద్వారా టీడీపీ బలంగా లేదని.. తమ పోటీ అంతా జనసేనతోనేనని ప్రజల్లోకి ఒక భావన వ్యాపింపజేయడమే వైసీపీ ఉద్దేశమని అంటున్నారు.

తెలంగాణలో కేసీఆర్‌ సైతం ఇలాంటి వ్యూహాన్నే అనుసరించి కాంగ్రెస్‌ను దెబ్బతీశారు. కాంగ్రెస్‌ అత్యంత బలంగా ఉన్నప్పటికీ, వచ్చే ఎన్నికల్లో అధికారం కాంగ్రెస్‌దే అనే భావన ప్రజల్లో ఉన్నప్పటికీ కేసీఆర్‌తో సహా టీఆర్‌ఎస్‌ పార్టీ నేతలంతా తమకు పోటీ బీజేపీతోనేని పదేపదే నొక్కి వక్కాణించిన సంగతి తెలిసిందే.

తెలంగాణలో కాంగ్రెస్‌ తమకు పోటీ కానే కాదని.. ఆ పార్టీ నేతలకు డిపాజిట్లూ రావని కేసీఆర్‌ అండ్‌ కో ఒక వినూత్న వ్యూహాన్ని అమలు చేసింది. కేసీఆర్‌తో సహా అంతా బీజేపీ నేతలపైనే విరుచుకుపడి బీజేపీతోనే టీఆర్‌ఎస్‌ పోటీ అనే భావనను వ్యాపింపజేశారు. వాస్తవానికి అత్యంత బలంగా ఉన్న పార్టీ కాంగ్రెస్‌. అయితే టీఆర్‌ఎస్‌ నేతల వ్యూహం అర్ధం కాని ప్రజలు ఆ పార్టీ మాయలో పడ్డారని అంటున్నారు. అయితే ఏకుకు మేకైనట్టు బీజేపీ కేసీఆర్‌ను మూడు చెరువులా నీళ్లు తాగిస్తోందని చెబుతున్నారు.

ఇప్పుడు కేసీఆర్‌ అనుసరించిన వ్యూహాన్నే ఏపీలో వైసీపీ అనుసరిస్తోందని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో తమకు, జనసేనకే పోటీ అనే భావనను వ్యాపింపజేయడం ద్వారా టీడీపీని దెబ్బతీయడానికి ప్రణాళిక రచించారని చెబుతున్నారు. వైసీపీ వ్యూహంతో జనసేన బలం పుంజుకుని.. పవన్‌ కల్యాణ్‌ ఒంటరి పోరాటానికి లేదంటే బీజేపీతో కలిసి పోరాడటానికి సిద్ధమయితే ఓట్లు చీలిపోయి మళ్లీ తాము అధికారంలోకి వస్తామని వైసీపీ లెక్కలేసుకుంటోంది.మరి తెలంగాణలో కేసీఆర్‌కు ఎదురుతన్నిన ఈ వ్యూహం వైసీపీకి ఎంతవరకు విజయం సాధించిపెట్టగలదో వేచిచూడాల్సిందే!



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.