Begin typing your search above and press return to search.

జగన్‌ కు ఈ మార్పు మంచిదేనా?

By:  Tupaki Desk   |   16 Dec 2022 9:30 AM GMT
జగన్‌ కు ఈ మార్పు మంచిదేనా?
X
ఆంధ్రప్రదేశ్‌ లో వచ్చే ఎన్నికల్లో 175కి 175 సీట్లు సాధించాలని వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ కంకణం కట్టుకున్నారు. తన పార్టీ నేతలకు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మంత్రులకు సైతం ఆయన ఇదే విషయాన్ని నూరిపోస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో 175కి 175 సీట్లు సాధిస్తామని చెబుతున్నారు.

ఇందులో భాగంగా ప్రతి నియోజకవర్గం నుంచి 50 మంది కార్యకర్తల చొప్పున ఎంపిక చేసి జగన్‌ వారితో ప్రత్యేకంగా భేటీ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నుంచి మొదలుపెట్టి ఇటీవల టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కలి వరకు సమీక్షలు నిర్వహించారు.

తాజాగా ఎన్టీఆర్‌ మైలవరం నియోజకవర్గానికి చెందిన 50 మంది కార్యకర్తలతో జగన్‌ భేటీ అయ్యారు. ఈ కార్యక్రమంలో మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ సైతం పాల్గొన్నారు.

కాగా గతంలో కార్యకర్తలతో సీఎం భేటీపై వారిలోనే అసంతృప్తి వ్యక్తమైంది. మొత్తం సమయమంతా జగనే మాట్లాడుతున్నారని.. తమ అభిప్రాయాలు లె లుసుకోవడం లేదని, తమను చెప్పనీయడం లేదని, సీఎం ఏం చెప్పాలనుకుంటున్నారో అదే విషయాన్ని చెప్పి పంపిస్తున్నారని కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. తమకు మాట్లాడటానికి అవకాశం ఇవ్వనప్పుడు, తమ అభిప్రాయాలు తెలుసుకోనప్పుడు కార్యకర్తల మీటింగ్‌ వల్ల ప్రయోజనం ఏముంటుందని గతంలోనే కార్యకర్తలు నిర్వేదం వ్యక్తం చేశారు.

కార్యకర్తల అసంతృప్తి విషయం జగన్‌ వరకు వెళ్లిందేమో ఈసారి మాత్రం కార్యకర్తలు చెప్పినదానికి, వారి అభిప్రాయాలకే జగన్‌ పెద్దపీట వేశారు. దాదాపు రెండు గంటలకు పైగా సాగిన మైలవరం నియోజకవర్గం కార్యకర్తలతో భేటీలో సీఎం జగన్‌ కేవలం పావు గంట మాత్రమే మాట్లాడినట్టు తెలుస్తోంది. మిగతా గంటా 45 నిమిషాల సమయమంతా కార్యకర్తల అభిప్రాయాలు వినడానికే వెచ్చించినట్టు తెలుస్తోంది.

మైలవరం నియోజకవర్గంలో పరిస్థితులు, ప్రజలకు సంక్షేమ పథకాలు, వివిధ అభివృద్ధి కార్యక్రమాలు అందుతున్న తీరు, ప్రతిపక్షాల బలాబలాలు, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, మంత్రి జోగి రమేష్‌ మధ్య కోల్డ్‌ వార్‌ తదితర అంశాలపై సీఎం వైఎస్‌ జగన్‌ కార్యకర్తల అభిప్రాయాలు సేకరించినట్టు చెబుతున్నారు.

గతంలో లాగా తానొక్కడే చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పడం కాకుండా తాను తక్కువ సమయం మాట్లాడి.. ఎక్కువ సమయం కార్యకర్తలతో మాట్లాడటానికే వెచ్చించారని అంటున్నారు.

దీంతో కార్యకర్తలు సైతం సంతృప్తి వ్యక్తం చేశారని.. తమ అభిప్రాయాలను, క్షేత్ర స్థాయి పరిస్థితులను స్వయంగా ముఖ్యమంత్రి, పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ కే వినిపించే అవకాశం రావడం పట్ల కార్యకర్తలంతా సంతోషం వ్యక్తం చేశారని టాక్‌ నడుస్తోంది. మొత్తానికి జగన్‌ లో వచ్చిన మార్పు మంచిదేననే టాక్‌ నడుస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.