Begin typing your search above and press return to search.

నిర్మలమ్మ మాటలకు కౌంటర్ ఏమైనా ఉందా కేటీఆర్?

By:  Tupaki Desk   |   3 Aug 2022 4:23 AM GMT
నిర్మలమ్మ మాటలకు కౌంటర్ ఏమైనా ఉందా కేటీఆర్?
X
గడిచిన కొద్ది రోజులుగా కేంద్రంపై వరుస పెట్టి ఘాటు విమర్శలు చేస్తున్న తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ సంగతి తెలిసిందే. ఈ మధ్యన జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చిన వస్తుసేవలపైనా ఆయన విరుచుకుపడ్డారు. ఇదేం పద్దతి అని కేంద్రాన్ని ప్రశ్నించారు. సామాన్యులు వినియోగించే వస్తువల మీద పన్నులు వేయటం ఏమిటంటూ మండిపడ్డారు.

మంత్రి కేటీఆర్ మాటల్ని విన్న వారంతా.. ప్రజల తరఫు ఎంత బాగా కోట్లాడుతున్నాడన్న భావనను వ్యక్తం చేయగా.. కొందరు మాత్రం కాస్తంత భిన్నంగా కొత్త సందేహాల్ని సంధించారు.

ఇప్పుడు ఇన్ని మాటలు మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్.. జీఎస్టీ కౌన్సిల్ లో చర్చ జరిగినప్పుడు.. ఈ నిర్ణయాల్ని తప్పు పట్టారా? అన్న సందేహాన్ని వ్యక్తం చేశారు. ఒకవేళ చేసి ఉంటే.. ఆ విషయాన్ని కూడా ప్రస్తావించేవారు కదా? అలాంటిదేమీ లేకుండా ఇప్పుడు ప్రశ్నించటం ఏమిటి? అన్న డౌట్లు వచ్చాయి. అయితే.. ఈ సందేహాలకు తాజాగా సమాధానం దొరికేలా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు ఉండటం గమనార్హం.

ప్యాక్ చేసి లేబుల్ వేసిన ఆహార పదార్థాల మీద ఐదు శాతం జీఎస్టీ విధించే ప్రతిపాదనను జీఎస్టీ కౌన్సిల్ లో అన్ని రాష్ట్రాలు ఓకే చెప్పాయని.. ఈ ప్రతిపాదనలకు ఒక్కరు కూడా వ్యతిరేకంగా మాట్లాడలేదని స్పష్టం చేశారు.

నిర్మలా మాటకు మంత్రి కేటీఆర్ ఇప్పుడు సమాధానం చెప్పాల్సి ఉంది. ఎందుకంటే.. నిత్యం కేంద్రం మీద విరుచుకుపడే కేటీఆర్.. తాజాగా నిర్మలమ్మ నోటి నుంచి వచ్చిన మాటలపై ఏం కామెంట్లు చేస్తారు? అన్నది ఆసక్తికరంగా మారింది.

నిజంగానే.. జీఎస్టీ కౌన్సిల్ లో ప్యాక్ చేసి.. లేబుల్ వేసిన ఫుడ్ మీద 5 శాతం వేయాలన్న నిర్ణయం వేళ టీఆర్ఎస్ కు చెందిన సభ్యులు మౌనంగా ఉంటే.. దానికి కేటీఆర్ బదులిస్తారా? లేదంటే.. మౌనంగా ఉండిపోతారా? అన్నది తేలాల్సి ఉంది.