Begin typing your search above and press return to search.

ఎంఎల్సీ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోందా ?

By:  Tupaki Desk   |   24 Oct 2022 4:30 AM GMT
ఎంఎల్సీ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోందా ?
X
హిందుపురంలో అధికారపార్టీ సమన్వయకర్త చౌళూరు రామకృష్ణా రెడ్డి హత్య కేసు చివరకు ఎంఎల్సీ మహమ్మద్ ఇక్బాల్ మెడకు చుట్టుకుంటోందా ? క్షేత్ర స్ధాయిలో జరుగుతున్న ప్రచారం ప్రకారం ఇదే అనుమానం పెరిగిపోతోంది. ఎందుకంటే ఎంఎల్సీ ఇక్బాల్ పీఏ గోపీకృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకుని చేసిన విచారణలో అనేక విషయాలు బయటపడ్డాయట. హత్య జరిగిన వెంటనే మృతుడి కుటుంబ సభ్యులు కూడా ఎంఎల్సీ ఇక్బాల్ ఆయన పీఏ గోపీకృష్ణతో పాటు మరికొందరిపై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

నియోజకవర్గం సమన్వయకర్త హోదాలో రెడ్డి పార్టీ కార్యక్రమాల్లో బాగా చురుగ్గా పాల్గొంటున్నాడు. బహుశా కొంతమంది మద్దతుదారులతో వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నట్లున్నారు. అయితే మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయి ప్రస్తుతం ఎంఎల్సీగా ఉన్న ఇక్బాలే మళ్ళీ పోటీకి రెడీ అవుతున్నారు. ఈ నేపధ్యంలోనే వీళ్ళిద్దరి మధ్య గొడవలు మొదలై బాగా పెరిగిపోయాయి. ఇక్బాల్ వ్యవహారశైలిపై మద్దతుదారులతో రెడ్డి ఫిర్యాదులు చేయిస్తున్నారు.

దాంతో ఇక్బాల్ కు రెడ్డిపై పీకల్లోతు కోపం పెరిగిపోయింది. ఇదే విషయమై రెడ్డిని అడ్డుకునే విషయాన్ని తన పీఏ తో ఎంఎల్సీ చర్చించారట. తన మద్దతుదారులతో రెడ్డిని కంట్రోల్ చేస్తానని పీఏ ఎంఎల్సీకి హామీఇచ్చాడట. దాంతో ఆ విషయాన్ని ఇక్బాల్ తన పీఏకి వదిలిపెట్టేశారు. ఆ తర్వాత ఏమైందో ? పీఏ ఎవరి సాయం తీసుకున్నారో తెలీదుకానీ మొత్తానికి రెడ్డి హత్యకు గురయ్యాడు.

ఇక్బాల్ పై ఫిర్యాదులు, పీఏ ఇన్వాల్వ్ మెంట్, రెడ్డిని కంట్రోల్ చేయటానికి పీఏ రంగంలోకి దిగడం లాంటి వాటికి సంబందించిన ఫోన్ ఆడియోలు లీకవ్వటంతో మొత్తం విషయం వెలుగులోకి వచ్చింది. దాంతో తప్పనిసరిగా పీఏని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించాల్సొచ్చింది.

ఈ మొత్తం వ్యవహారంలో ఒక ఇన్స్ పెక్టర్ పాత్రకూడా వెలుగుచూసింది. గతంలో ఇక్బాల్ పోలీసుశాఖలో ఉన్నతాధికారి గా పనిచేసిన కారణంగా ఇపుడు పోలీసుల సహకారం బాగా ఉందనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. చివరకు ఈ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాల్సిందే.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.