Begin typing your search above and press return to search.

ఐటీ రంగం పట్టాలెక్కించే పరిస్థితి లేదా?

By:  Tupaki Desk   |   6 July 2021 8:30 AM GMT
ఐటీ రంగం పట్టాలెక్కించే పరిస్థితి లేదా?
X
కొత్త ఒక వింత.. పాత ఒక రోత అంటారు.. ఇప్పుడు అదే జరుగుతోంది. పాత అంటే ఆఫీసులో కూర్చొని పనిచేయడం.. కొత్త అంటే ఇంట్లోనే వర్క్ ఫ్రం హోం చేయడం.. ఈ రెండింటిలో ఏది బెస్ట్ అంటే.. కంపెనీలు ఏమో ‘వర్క్ ఫ్రం హోం’తో తమకు రూపాయి ఖర్చు లేదని.. నిర్వహణ బాధ తప్పిందని.. కంపెనీలు మూసి ఉండడంతో బోలెడు డబ్బు, వ్యయం తగ్గిందని చెబుతున్నాయి.

ఇక ఉద్యోగులది మరో వ్యథ. సంవత్సరన్నర నుంచి.. కరోనా లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి వర్క్ ఫ్రం హోం అంటూ పగలూ రాత్రి తేడా లేకుండా.. ఓ సమయం పాడూ లేకుండా పనిచేస్తున్నారు. ఇక ఇంట్లో భార్యా, పిల్లల హోరుతో పనిపై కాన్సట్రేట్ చేయలేని పరిస్థితి. అందుకే వర్క్ ఫ్రం హోం అంటేనే ఉద్యోగులు హడలిచస్తున్నారు. తాము వెంటనే ఆఫీసులకు వస్తామని.. టైం ప్రకారం చేసి సేదతీరుతామంటున్నారు.

అయితే ఈ ఇద్దరిగోల ఇలా ఉంటే తెలంగాణ ప్రభుత్వానిది మరో గోల.. ఉద్యోగులంతా ఇంట్లోనే ఉంటే ఖర్చు కాదు.. కంపెనీలు తెరుచుకోవు. తద్వారా ఆర్థిక వ్యవస్థ పట్టాలెక్కదు. అందుకే సినిమా థియేటర్ల దగ్గర నుంచి ఐటీ కంపెనీల వరకు అన్నింటిని తెరవాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తాజాగా ఆయా వర్గాలతో సమావేశమయ్యారు. అవసరమైతే ఐటీ ఉద్యోగులకు , వారి కుటుంబాలకు తామే టీకాలు వేస్తామని చెబుతున్నారు.త్వరలోనే ఐటీ కంపెనీలతో తెలంగాణ ప్రభుత్వం సమావేశం నిర్వహించబోతోంది.

గత ఏడాది మార్చి నుంచి ఐటీ కంపెనీలు అన్నీ తమ ఉద్యోగులందరికీ వర్క్ ఫ్రం హోం ఆప్షన్ ఇచ్చాయి. దీంతో వారంతా ఎక్కడి వారు అక్కడే వాళ్ల ఊళ్లల్లో ఉండి పనులు చేసుకుంటున్నారు.

ఐటీ ఉద్యోగులు తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో ప్రధాన భాగం. వర్క్ ఫ్రం హోంతో కంపెనీలకు చాలా నిర్వహణ ఖర్చు తగ్గుతుండడంతో అప్పుడిప్పుడే అవన్నీ కంపెనీలు ఓపెన్ చేయడానికి ఉత్సాహంగా లేవు. తిరిగి కార్యాలయాలు తెరవానికి ఏ కంపెనీ కూడా ఉత్సాహం చూపడం లేదు.

అయితే ఆర్థిక వ్యవస్థ గాడిన పడాలంటే వీలైనంత త్వరగా వాటిని తిరిగి తెరవడానికి ప్రభుత్వం ఆసక్తి చూపుతోంది. అవసరమైతే ఉద్యోగులు, వారి కుటుంబాలకు 100శాతం టీకాలు వేయడానికి ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ప్రభుత్వం నుంచి సాయం అందిస్తామని ప్రకటించారు.

కాగా ఇప్పటికే చాలా ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు టీకాలు వేయడం ప్రారంభించాయి. కానీ థర్డ్ వేవ్ వస్తుందన్న నివేదికలతో మళ్లీ ఇప్పుడు కార్యాలయాలు తెరిచే అవకాశాలు కనిపించడం లేదు. అందుకే వర్క్ ఫ్రం హోంను ఈ ఏడాది చివరి వరకు కొనసాగించాలని యోచిస్తున్నాయి.

మొదటి వేవ్ తర్వాత కూడా ఇదే విధంగా కంపెనీలపై ఒత్తిడి తెచ్చారు.కానీ సెకండ్ వేవ్ రావడంతో వర్క్ ఫ్రం హోంనే కంటిన్యూ చేశారు. అందుకే ఇప్పుడు కంపెనీలు తొందరపడి ఆఫీసులు తెరిచే యోచన చేయడం లేదు. ప్రభుత్వం ప్రయత్నించినప్పటికీ కంపెనీలు ముందుకొచ్చే అవకాశాలు లేవు.