Begin typing your search above and press return to search.

నెక్స్ట్ టార్గెట్ ఆప్ ప్రభుత్వమేనా ?

By:  Tupaki Desk   |   25 Aug 2022 7:31 AM GMT
నెక్స్ట్ టార్గెట్ ఆప్ ప్రభుత్వమేనా ?
X
నాన్ బీజేపీ ప్రభుత్వాల్లో ఒక్కోదాన్ని బీజేపీ కూల్చేస్తోంది. నాన్ బీజేపీ ప్రభుత్వాలను కూల్చేయటానికి బీజేపీ రెండు మార్గాలను అవలంభిస్తోంది. మొదటిది అధికార పార్టీ ఎంఎల్ఏల్లో చీలిక తీసుకురావటం. రెండోది అధికార పార్టీ ఎంఎల్ఏలను తమ పార్టీలోకి లాగేసుకోవటం. ఇక మూడో మార్గం అధికార పార్టీ లోని మంత్రులు, ఎంఎల్ఏలపై కేసులు పెట్టి లొంగదీసుకోవటం. దేశవ్యాప్తంగా బీజేపీ పై మూడు పద్దతులనే అవలంభిస్తోంది. కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లో ఏమి జరిగిందనే విషయం అందరికీ తెలిసిందే.

రాజస్ధాన్లో కూడా తమ వ్యూహాలను అమలు చేయాలని అనుకున్నా సాధ్యం కాలేదు. ఝార్ఖండ్ లో తన ప్రయత్నాలను పదే పదే చేస్తోంది. బెంగాల్లో తృణమూల్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టినట్లే ఉంది.

ఈ నేపథ్యంలోనే తాజాగా ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)ని బీజేపీ టార్గెట్ చేసినట్లే అనుమానాలు పెరిగిపోతున్నాయి. నరేంద్ర మోడీకి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పంటిలో రాయిలాగ తయారయ్యారు. బీజేపీని ఎదిరించి మూడుసార్లు సీఎం అయిన కేజ్రీవాల్ ప్రభుత్వంపై రకరకాలుగా కేంద్రప్రభుత్వం కక్ష సాధింపులకు దిగుతోంది.

తాజాగా లిక్కర్ స్కాం జరిగిందని అందుకు కేజ్రీవాలే కీలక పాత్రధారిగా బీజేపీ ఆరోపణలు మొదలుపెట్టింది. ఒకవైపు ఇలా ఆరోపణలు చేస్తునే ఆప్ కు చెందిన నలుగురు ఎంఎల్ఏలపై వల విసిరిందట. ఆప్ లో నుండి తమ పార్టీలోకి చేరితే ఒక్కోక్కళ్ళకు రు.

20 కోట్లు ఇస్తామని బీజేపీ ఆఫర్ చేసిందన్న ఆప్ ఎంఎల్ఏల ఆరోపణలు సంచలనంగా మారాయి. అయితే తమకు ఆఫర్ ఇచ్చిందెవరు, పార్టీ మారాలని తమపై ఒత్తిళ్ళు తెచ్చిందెవరని మాత్రం ఆప్ ఎంఎల్ఏలు చెప్పలేదు.

బహుశా ఈ విషయాలను ముందు ముందు వివరిస్తారేమో తెలీదు. ఏదేమైనా బీజేపీ ట్రాక్ రికార్డు చూస్తే మాత్రం ఆప్ ప్రభుత్వాన్ని కూల్చేసేందుకు ప్రయత్నాలు మొదలైనట్లు అందరు అనుమానించటంలో తప్పేమీ లేదు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కేవలం బీజేపీ ప్రభుత్వాలు మాత్రమే ఉండాలన్న ఆలోచనే దీనికంతటికీ కారణం.