Begin typing your search above and press return to search.

సీబీఎన్ పదే పదే ముందస్తు...క్యాండిడేట్స్ లేరు కదా మరి ఎందుకు లోకేషూ...?

By:  Tupaki Desk   |   2 Sep 2022 1:30 PM GMT
సీబీఎన్ పదే పదే ముందస్తు...క్యాండిడేట్స్ లేరు కదా మరి ఎందుకు లోకేషూ...?
X
మాటకు వస్తే చాలు చంద్రబాబు నోట పదే పదే ముందస్తు ఎన్నికలు అని పాట వినిపిస్తూ ఉంటుంది. ఎపుడైనా ఎన్నికలు ఏపీలో రావచ్చు అని కూడా బాబు చెబుతూ ఉంటారు. అసలు ఈ పాటను జగన్ ఎన్నికైన తొలి ఏడాది నుంచే మొదలెట్టేశారు. గతంలో అయితే దీన్ని చాలా సీరియస్ గా రాజకీయ వర్గాలతో పాటు సొంత పార్టీ వారూ తీసుకునేవారు. ఇపుడు జగన్ సక్సెస్ ఫుల్ గా నలభై నెలల పాలన పూర్తి చేసుకుంటున్న వేళ ఇంకా ముందస్తు ఎన్నికలు ఏమిటి అని జనాలు అంతా అంటున్న పరిస్థితి.

వస్తే గిస్తే ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే వస్తాయని కూడా తమ్ముళ్లతో సహా అంతా అర్ధం చేసుకుంటున్నారు. ఇక జగన్ సైతం దానిమీద కచ్చితమైన మాట ఒకటి చెప్పేశారు. ఈ మధ్యన ఆయన నెల్లూరు జిల్లా టూర్ కి వెళ్ళినపుడు అక్కడ జరిగిన సభాసాక్షిగా తాను అనుకున్న ప్రాజెక్టులు అన్నీ పూర్తి చేసుకున్నాకే ఎన్నికలు అని చెప్పారు. దానికి గడువుగా వచ్చే ఏడాది సెప్టెంబర్ నెల అని కూడా పెట్టారు. అంటే ఇక ముందస్తు అన్న మాటకు అర్ధమేముంది అన్న చర్చ కూడా వస్తోంది.

అయినా సరే చంద్రబాబు మీడియా ముందుకు వచ్చిన ప్రతీ సారీ ముందస్తు ఎన్నికలు వస్తాయనే చెబుతున్నారు. అంటే పార్టీ నాయకులను కదిలించాన్న ఉద్దేశ్యం ఏదో దీని వెనక ఉన్నట్లుగా భావించాలేమో. పార్టీలో నాయకులు మరీ బొత్తిగా కదలకుందా స్తబ్దుగా ఉంటున్నారని భావించే ఈ రకంగా ఎన్నికల గురించి మాట్లాడి వారిలో చురుకు పుట్టించాలన్న ఉద్దేశ్యంతోనే బాబు ఈ రకంగా ప్రకటనలు చేస్తున్నారు అని అంటున్నారు.

ఇపుడు వారికి కూడా విషయమేమిటి అన్నది తెలిసిపోయింది కాబట్టి ఆ మాటలను ఎవరూ పెద్దగా పట్టించుకోవడంలేదు అని అంటున్నారు. ఇదిలా ఉంటే నిజంగా జగన్ ఎన్నికలను ముందుకు జరిపితే ఎదుర్కోవడానికి టీడీపీకి ఇపుడు వీలు కుదురుతుందా అన్న చర్చ కూడా ఉంది. ఎందుకంటే టీడీపీకి చాలా నియోజకవర్గాలలో సరైన అభ్యర్దులు లేరు అని కూడా చెబుతున్నారు. దాదాపుగా 75 నియోజకవర్గాలలో టీడీపీకి సరైన క్యాండిడేట్లు లేరు అని కూడా అంటున్నారు. మరి సీన్ ఇలా ఉంటే ఎన్నికలు అంటూ కలవరించడం వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా అన్న చర్చ కూడా సాగుతోంది.

ముందు పార్టీని చక్కబెట్టుకోకుండా ఎక్కడ ఉన్న లోపాలను అక్కడ సరిదిద్దుకుని ఎన్నికల యుద్ధానికి సన్నద్ధం కాకుండా ఎన్నికలు వస్తాయని చెప్పుకుంటూ తిరగడం వల్ల ఉపయోగం ఏమైనా ఉంటుందా అని కూడా అంటున్నారు. చినబాబు కూడా ఎపుడు ఎన్నికలు వచ్చినా రెడీ అంటున్నారు. ఆ విషయం ఓకే కానీ ముందు పార్టీలో ఇంచార్జిలు నియమించే విషయం కూడా సీరియస్ గా ఆలోచించాలి కదా అన్న మాట కూడా వినిపిస్తోంది. ఏది ఏమైనా ముందస్తు అంటూ కలవరించడం ద్వారా పెదబాబు చినబాబు జనాలకు ఇస్తున్న సందేశం ఏంటి అంటే అధికారం మీదనే ఫోకస్ పెడుతున్నారని.

ఆ విధంగా తప్పుడు సంకేతాలు జనాలకు ఇచ్చేబదులు ప్రజలు ఇచ్చిన తీర్పునకు కట్టుబడి అయిదేళ్ళూ మీరు పాలించండి, ఆ మీదట మేము చూసుకుంటామన్న మాటను తండ్రీ కొడుకులు అంటే హుందాగా ఉండడమే కాకుండా జనం మనసు గెలుచుకుంటున్నట్లుగా ఉంటుంది అని అంటున్నారు. ఇక్కడొక మాట చెప్పుకోవాలి. పక్కన ఉన్న తమిళనాడులో 2016లో ఏఐడీఎంకే అధికారంలోకి వచ్చింది. జయలలిత కొన్నాళ్ళ తరువాత మరణించారు. ఆ మీదట నాలుగేళ్ల పాటు ఆ పార్టీ నాయకులే అధికారంలో ఉన్నారు. నిజానికి నాడు తలచుకుంటే డీఎంకేలో ఉన్న స్టాలిన్ ఏఐడీఎంకేని నాడే తోసేసి అధికారం అందుకునేవారే.

కానీ ఆయన అయిదేళ్ళ పాటు వారికి అధికారం ఇచ్చారు. మేము విపక్షంలో ఉంటాం, ఎన్నికలు వచ్చినపుడే జనంలోకి వెళ్ళి గెలుచుకుంటామని చెప్పారు. ఆ విధంగానే ఆయన 2021లో మంచి మెజారిటీతో అధికారంలోకి వచ్చారు. అంతటి బలహీన ప్రభుత్వానికే టైమ్ ఇచ్చి చూసిన స్టాలిన్ ని ఇక్కడ టీడీపీ పెద్దలు ఆదర్శంగా తీసుకుంటే బలమైన జగన్ సర్కార్ మధ్యలో కూలిపోయి ఎన్నికలు రావాలనుకోరు అని అంటున్నారు.





నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.