Begin typing your search above and press return to search.

ష‌ర్మిల పార్టీని చీల్చేందుకు రేవంత్ ప్ర‌య‌త్నిస్తున్నారా?

By:  Tupaki Desk   |   5 July 2021 1:54 AM GMT
ష‌ర్మిల పార్టీని చీల్చేందుకు రేవంత్ ప్ర‌య‌త్నిస్తున్నారా?
X
గ‌త కొద్దికాలంగా ఒకింత స్త‌బ్ధుగా ఉన్న‌ కాంగ్రెస్ పార్టీ రాజ‌కీయాలు పీసీసీ అధ్య‌క్షుడిగా రేవంత్ రెడ్డి నియామ‌కంతో దూకుడుగా మారిన సంగ‌తి తెలిసిందే. పార్టీ ప‌గ్గాలు అధికారికంగా చేప‌ట్ట‌క‌ముందే ఆయ‌న త‌న ముద్ర వేసుకుంటున్నారు. పార్టీలోని సీనియ‌ర్లు, జూనియ‌ర్ల‌ను క‌లుపుకునే ఎజెండాతో రేవంత్ ముందుకు సాగుతున్నారు. ఈ క్ర‌మంలో నేత‌ల ఇళ్ల‌కు స్వ‌యంగా ఆయ‌నే వెళుతున్నారు. అయితే ఓ వైపు ఇలా రేవంత్ త‌న ముద్ర‌తో ముందుకు సాగుతుంటే ఆయ‌న‌పై వైఎస్ ష‌ర్మిల పార్టీ నేత ఒక‌రు సంచ‌ల‌న ఆరోప‌ణ చేశారు.

వైఎస్సార్ తెలంగాణ పార్టీ నేత‌, షర్మిల అనుచరురాలు ఇందిరా శోభన్ పార్టీ మారనున్నట్లు వార్త‌లు వ‌చ్చాయి. ఈ వార్త‌ల‌ను ఆమె ఖండించారు. ప్రాణం ఉన్నంత వరకు అదే పార్టీలో ఉంటానని, షర్మిల పార్టీ నుంచి బయటకు వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పార్టీలో తనకు ఎటువంటి లోటు లేదని, తనను షర్మిల కుటుంబ సభ్యురాలిగా భావిస్తారని తెలిపారు. కావాలని తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఇందిరా శోభ‌న్‌ ఫైర్ అయ్యారు. వైఎస్సార్‌టీపీని అధికారంలోకి తీసుకొచ్చేలా కృషి చేస్తానని వివరించారు. త‌న‌పై ఒక ప్రముఖ ఛానెల్‌లో చెత్త కథనాలు వేశారని మండిప‌డ్డారు. కావాలనే త‌న‌ను ఇరుకున పెట్టే కథనాలు ప్రసారం చేస్తున్న తీరు ఖండిస్తున్నానని పేర్కొన్నారు.

తాను అధికారం కోసం పార్టీలోకి రాలేదని, ప్రజాసేవే త‌నకు ముఖ్యమ‌ని ఇందిరా శోభ‌న్ తెలిపారు. కాంగ్రెస్ వాళ్లకు త‌న అవసరం ఉంది కాబట్టి వాళ్లు అలా చేస్తున్నారని ఇందిరా శోభ‌న్ వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డికి అవసరం కాబట్టి ఇలా చేస్తున్నారు అంటూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. కుట్రలు, కుతంత్రాలు చేస్తే ఊరికే వదిలిపెట్టను అని వ్యాఖ్యానించారు. అయితే, వైఎస్ ష‌ర్మిల పార్టీ నేత‌ల‌ను త‌మ గూటికి ర‌ప్పించేలా రేవంత్ గేమ్ ప్లే చేస్తున్నారా? ఇప్పుడు అలాంటి ఆలోచ‌న‌, అవ‌స‌రం నిజంగా రేవంత్ నాయ‌క‌త్వానికి ఉందా? అంటూ ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు. ఈ సందేహాల‌కు స‌ద‌రు నేత‌లు ఏం స‌మాధానం ఇస్తారో మ‌రి.