Begin typing your search above and press return to search.

పుతిన్.. ఈసారి ఏకంగా అమెరికా ప్రాంతాల‌పైనే దృష్టి పెట్టారా?

By:  Tupaki Desk   |   9 July 2022 4:59 AM GMT
పుతిన్.. ఈసారి ఏకంగా అమెరికా ప్రాంతాల‌పైనే దృష్టి పెట్టారా?
X
ర‌ష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్.. ప్ర‌పంచ దేశాల‌ను ఏమాత్రం ఖాత‌రు చేయ‌కుండా ఉక్రెయిన్ పై యుద్ధం చేస్తూనే ఉన్నారు. ఐదు నెల‌లు దాటిపోయినా ఇప్ప‌టికీ ఉక్రెయిన్ పై దాడులు ఆప‌డం లేదు. అమెరికా, బ్రిట‌న్, జ‌ర్మ‌నీ, ఫ్రాన్స్, ఇత‌ర చిన్నాచిత‌క యూరోప్ దేశాలు హెచ్చ‌రిస్తున్నా ఏమాత్రం పుతిన్ త‌గ్గ‌డం లేదు. ఆయా దేశాలు ర‌ష్యాపైన క‌ఠిన ఆంక్ష‌లు విధించినా వాటిని బేఖాత‌రు చేసి ఉక్రెయిన్ లోని ప‌లు న‌గ‌రాల‌ను ఇప్ప‌టికే స్వాధీనం చేసుకున్నారు.

ఈ క్ర‌మంలో త‌మ‌పై ఆంక్ష‌లు విధించే దేశాల‌కు త‌గిన గుణపాఠం చెబుతామ‌ని, రిట‌ర్న్ గిఫ్టుల‌ను అంతే గ‌ట్టిగా ఇస్తామ‌ని పుతిన్ వార్నింగ్ హెచ్చ‌రించిన సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా అమెరికా త‌మ‌పై ఆంక్ష‌ల మీద ఆంక్ష‌లు విధించ‌డాన్ని స‌హించ‌లేని పుతిన్ తాజాగా ఆ దేశానికి తీవ్ర హెచ్చ‌రిక జారీ చేశారు.

తమపై ఆర్థిక ఆంక్షలను విధిస్తే.. అమెరికాలోని అలాస్కాను తిరిగి స్వాధీనం చేసుకుంటామని హెచ్చ‌రికలు జారీ చేశారు. మ‌రోవైపు రష్యాకు చెందిన ఆస్తులను స్తంభింపచేసినా, జప్తు చేసినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని రష్యా దిగువ సభ స్పీకర్ వ్యాచెస్లావ్ వోలోదిన్ కూడా అమెరికాను హెచ్చరించారు.

కాగా అల‌స్కా విష‌యానికొస్తే.. రష్యా సోవియట్‌ యూనియన్‌లో భాగంగా ఉన్నప్పుడు 1861లో జార్‌ అలెగ్జాండర్ కొన్ని సంస్క‌ర‌ణ‌లు తీసుకువ‌చ్చారు. ఇందులో భాగంగా రష్యాలోని కొంత భూభాగాన్ని అమ్మేశారు. 1867 అక్టోబర్ లో చోటుచేసుకున్న ఆర్థిక సంక్షోభంలో భాగంగా సోవియట్‌ యూనియన్‌లోని అలస్కా, అలూటియన్ దీవులను జార్‌ అలెగ్జాండర్‌.. 7.2 మిలియన్ డాలర్లకు అమెరికాకు విక్ర‌యించారు. ఆ అమ్మ‌కం జ‌రిగిన‌ప్పుడు అలస్కాలో రష్యా కాలనీలు సైతం అందులో ఉన్నాయి. ఇదిలా ఉండ‌గా 1881లో జార్‌ అలెగ్జాండర్ ను హ‌త్య చేశారు.

ఈ నేప‌థ్యంలోనే ర‌ష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ అమెరికాకు హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. త‌మ‌పై అమెరికా, దాని మిత్ర దేశాలు ఆంక్ష‌లు విధించినందుకు ప్ర‌తీకారంగా అల‌స్కాను స్వాధీనం చేసుకుంటామ‌ని తెలిపారు.

ర‌ష్యా నుంచి ఎవ‌రూ చ‌మురు కొనుగోలు చేయకూడ‌ద‌ని ఇప్ప‌టికే భార‌త్ తో స‌హా ప‌లు దేశాల‌కు గ‌ట్టి సూచ‌న‌లు చేసింది. అలాగే ర‌ష్యా దేశ‌స్తుల‌కు వివిధ దేశాల్లో ఉన్న ఆస్తుల‌ను స్తంభింప‌జేసింది. అంతేకాకుండా ర‌ష్యా అధినేత‌తో స‌హా మంత్రులు, వ్యాపార‌వేత్త‌లు త‌మ దేశంలోకి ప్ర‌వేశించ‌కుండా నిషేధం విధించింది.