Begin typing your search above and press return to search.

ఏపీ గురించి ప్ర‌శాంత్ కిషోర్ అలా అన్నాడా?

By:  Tupaki Desk   |   15 Feb 2020 5:06 PM GMT
ఏపీ గురించి ప్ర‌శాంత్ కిషోర్ అలా అన్నాడా?
X
ప్ర‌శాంత్ కిషోర్.. ఈ రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త ఇప్పుడు దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారాడు. ఎంత‌లా అంటే.. ఇత‌డి అభిప్రాయాలు కూడా తెగ చ‌ర్చ‌నీయాంశం అయిపోతున్నాయి. ఇటీవ‌లే తెలుగుదేశం అనుకూల మీడియా వ‌ర్గం అధినేత ఒక‌రు ఏపీ గురించి ప్ర‌శాంత్ కిషోర్ అలా అనుకుంటున్నాడు, ఇలా అనుకుంటున్నాడు.. అంటూ త‌న ఎడిటోరియ‌ల్ లో చెప్పుకొచ్చాడు. అయితే అదేమీ ప్ర‌శాంత్ కిషోర్ అధికారికంగా చేసిన ప్ర‌క‌ట‌న‌లూ కావు. ఆయ‌న అలా అనుకుంటున్నాడ‌ని, ఈయ‌న ఇలా చెప్పుకురావ‌డం అన‌మాట‌! ప్ర‌శాంత్ కిషోర్ పేరుతో అలా త‌న అభిప్రాయాన్ని ఆయ‌న ద‌ట్టించేశాడు! అలా ప్ర‌శాంత్ కిషోర్ ను కూడా తెగ హీరోని చేసేస్తోంది తెలుగు మీడియా.

ఆ సంగ‌త‌లా ఉంటే.. ఏపీ ప్ర‌జ‌ల గురించి ప్ర‌శాంత్ కిషోర్ అభిప్రాయం అంటూ నెట్ లో పోల్స్ కూడా పెట్టేస్తూ ఉన్నారు. ఆ మాట‌లు ప్ర‌శాంత్ కిషోర్ అన్నాడో లేదో ఎవ‌రికీ తెలియ‌దు. అయితే అత‌డిని కోట్ చేస్తూ.. ఎవ‌రికి తోచింది వారు వైర‌ల్ చేసే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్టుగా ఉన్నారు.

అందులో భాగంగా ఏపీ ప్ర‌జ‌ల‌కు కుల‌పిచ్చి ఎక్కువ అని, ఏపీ ప్ర‌జ‌ల‌కు ఆలోచ‌న శ‌క్తి త‌క్కువ అంటూ.. ఫ్రీగా వ‌స్తాయంటే దేనికైనా ఓటేస్తార‌ని పీకే ఏపీ ప్ర‌జ‌ల గురించి వ్యాఖ్యానించిన‌ట్టుగా ప్ర‌చారం జ‌రుగుతూ ఉంది. ఈ మ‌ధ్య‌కాలంలో పీకే ఎవ‌రికీ ప్ర‌త్యేకంగా ఇంట‌ర్వ్యూలు ఇవ్వ‌లేదు. అలాంటి ఇంట‌ర్వ్యూల్లో ఏపీ ప్ర‌జ‌ల గురించి ఆయ‌న ఒపీనియ‌న్ పాస్ చేసిన‌ట్టు గా కూడా లేదు.

అయితే పీకే అలా అన్నాడు.. ఇలా అన్నాడు.. అంటూ చెప్పుకోవ‌డం ఏపీ లో మార్కెటింగ్ టెక్నిక్ అయిపోయింది. ఈ నేప‌థ్యంలో..ప్ర‌శాంత్ కిషోర్ ఈ అభిప్రాయాన్ని వ్య‌క్తం చేసిన‌ట్టు గా సోష‌ల్ మీడియా లో ప్ర‌చారం జ‌రుగుతూ ఉంది. మ‌రి అస‌లు సంగ‌తేమిటో.. పీకే బ్యాచ్ కే తెలియాలి!