Begin typing your search above and press return to search.

గౌతం గంభీర్ ఆశల పై ప్రశాంత్ కిశోర్ నీళ్లు చల్లనున్నారా?

By:  Tupaki Desk   |   14 Dec 2019 7:34 AM GMT
గౌతం గంభీర్ ఆశల పై ప్రశాంత్ కిశోర్ నీళ్లు చల్లనున్నారా?
X
పార్టీలను గెలిపించడంలో మంచి ట్రాక్ రికార్డు ఉన్న పొలిటికల్ కన్సల్టెంట్ ప్రశాంత్ కిశోర్ ప్రధాని నరేంద్ర మోదీకి మంట పుట్టించే నిర్ణయం తీసుకున్నారు. మరికొద్ది నెలల్లో జరగనున్న దిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం ఆయన మోదీ కీలక ప్రత్యర్థు ల్లో ఒకరైన అరవింద్ కేజ్రీవాల్ కోసం పనిచేయనున్నారు. ఈ మేరకు కేజ్రీవాల్ ట్విటర్ వేదికగా వెల్లడించారు. ప్రశాంత్ కిశోర్‌ కు చెందిన పొలిటికల్ కన్సల్టెన్సీ ఐప్యాక్‌ తమకు వచ్చే ఎన్నికల్లో సేవలందించబోతోందని వెల్లడించారు.


కాగా ప్రశాంత్ కిశోర్ కూడా కేజ్రీ ట్వీట్‌ ను రీట్వీట్ చేస్తూ ‘మేం ఇంత వరకు ఎదుర్కొన్న ప్రత్యర్థుల్లో అత్యంత టఫ్ మీరు.. ఇప్పుడు మీతో చేతులు కలపడం ఆనందంగా ఉంది’ అని ట్వీట్ చేశారు. కాగా ఐప్యాక్ ప్రస్తుతం పశ్చిమబెంగాల్‌ లో తృణమూల్ కాంగ్రెస్ కోసం పనిచేస్తోంది.

కాగా ప్రశాంత్ కిశోర్ ఒకప్పుడు, అంటే 2014లో మోదీ కోసం పనిచేసి ఆయన విజయం లో కీలక పాత్ర పోషించారు. కానీ, ఆ తరువాత ఏడాది జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి బీజేపీ ప్రత్యర్థి జేడీయూతో కలిసి పనిచేశారు. 2017లో కాంగ్రెస్‌తో పనిచేసి పంజాబ్ ఎన్నికల్లో ఆ పార్టీని గెలిపించారు. దీంతో మోదీ వ్యతిరేకుల పక్షాన కొన్నాళ్లుగా ప్రశాంత్ కిశోర్ పనిచేస్తున్నారు. ఇప్పుడు బీజేపీ ఎన్నో ఆశలతో ఉన్న దిల్లీలోనూ ఆయన మరోసారి బీజేపీ వ్యతిరేక పార్టీ ఆమ్ ఆద్మీ తో కలిసి పనిచేయనుండడం తో మోదీ టీం లో అలజడి మొదలవుతోంది.

మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ దిల్లీలోని 7 లోక్ సభ సీట్లకు 7 కూడా గెల్చుకుని అసెంబ్లీ ఎన్నికల్లో విజయంపై ఆవలు పెంచుకుంది. కానీ, కేజ్రీవాల్ కూడా పట్టు వదలకుండా కరెంటు చార్జీలు ఫ్రీ చేయడం.. మహిళలలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడం వంటి చర్యలు వెంటనే ప్రారంభించి మళ్లీ పుంజుకొన్నారు. దీంతో దిల్లీ ప్రజలు లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటేసినా అసెంబ్లీకి మాత్రం కేజ్రీవాల్‌కే అంటున్నారు. ఇలాంటి తరుణంలో కేజ్రీ ట్రంప్ కార్డులో ప్రశాంత్ కిశోర్‌ను కూడా దించుతుండడంతో దిల్లీ అసెంబ్లీపై బీజేపీ ఆశలు గల్లంతయినట్లేనని వినిపిస్తోంది.

మరోవైపు దిల్లీలో బీజేపీని గెలిపించి సీఎం కావాలని కలలు కంటున్న మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ కూడా ప్రశాంత్ కిశోర్ ఎంట్రీతో కంగారుపడుతున్నారు. దిల్లీ తూర్పు లోక్ సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఉన్న గంభీర్ దిల్లీలో పార్టీ కోసం రాష్ట్రవ్యాప్తంగా భారీగా ఖర్చు చేస్తున్నారు. సీఎం సీటు టార్గెట్‌గా ఆయన అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు. అయితే.. ఇప్పుడు ప్రశాంత్ కిశోర్ ఎంట్రీతో అసలు బీజేపీ గెలుపు ఎంతవరకు సాధ్యమన్న అనుమానాలు మొదలయ్యాయి.