Begin typing your search above and press return to search.

సెంచరీకి చేరువలో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర‌లు ?

By:  Tupaki Desk   |   6 Jan 2020 9:03 AM GMT
సెంచరీకి చేరువలో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర‌లు ?
X
గత కొద్ది రోజుల నుంచి హెచ్చు తగ్గుదలకు లోనైన చమురు ధరలు.. ఇప్పుడు మరింత పెరిగాయి. మొత్తానికి 80 రూపాయల గీటు దాటింది. 2019 సంవత్సరంలో 80కి అటూ, ఇటూ ఊగిసలాడుతూ ఉండేది. ఈ కొత్త ఏడాదిలో బంగారం పెరుగుదలతో పాటు పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరిగాయి. గత ఏడాది సెప్టెంబర్‌లో సౌదీ ముడిచమురు స్థావరాలపై దాడి తర్వాత మళ్లీ పెరగడం ఇదే. సాధారణంగా గ‌ల్ఫ్ లో ప‌రిస్థితులు సానుకూలంగా ఉన్న స‌మ‌యంలోనే మోడీ స‌ర్కారు పెట్రోల్ ధ‌ర‌ల‌ను దేశ వ్యాప్తంగా 80 రూపాయ‌లకు చేరువ చేసింది. ఇప్పుడు అక్క‌డ ప‌రిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. దీంతో పెట్రో ధ‌ర‌లు మండ‌బోతున్నాయ‌ని వార్త‌లు వినపడుతున్నాయి.

ఇప్ప‌టికే ప్ర‌ధాన న‌గ‌రాల్లో బ్రాండెడ్ పేరుతో కొన్ని పెట్రోల్ బంకుల్లో లీట‌ర్ పెట్రోల్ ను 90 రూపాయ‌ల‌కు అమ్ముతున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఇప్పుడు ధ‌ర‌లు మరోసారి పెరిగితే ... లీట‌ర్ పెట్రోల్ ధ‌ర‌ మూడంకెల సంఖ్య‌కు చేర‌డం ఖాయం. కాగా.. ప్రస్తుతం ఇరాన్‌లో నెలకొన్న యుద్ధ వాతావరణంలో భాగంగా.. మధ్యప్రాచ్యలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీని కారణంగా పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే.. బ్యారెల్‌కు 4.5 శాతం పెరిగి 69.20 డాలర్లకు చేరడంతో ఇండియాలో ఆయిల్ కంపెనీలు కూడా పెట్రోల్, డీజిల్ ధరలపై సమీక్షించారు.

ఇకపోతే ఈ నేపథ్యంలో దీంతో హైదరాబాద్‌లో సోమవారం లీటరు పెట్రోల్ ధర రూ.80.48కు చేరింది. డీజిల్ ధర రూ.74.88కు చేరింది. అమరావతిలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి ఇలానే ఉంది. పెట్రోల్‌ ధర 15 పైసలు పెరుగుదలతో రూ.80.01కు చేరింది. డీజిల్‌ ధర 18 పైసలు పెరుగుదలతో రూ.74.07 గా ఉంది.