Begin typing your search above and press return to search.

ఆ ఉప ఎన్నికల్లాగే.. మునుగోడూ టీఆర్ఎస్ కు లైటా? మరి ఈ మాటలేంటి?

By:  Tupaki Desk   |   11 Aug 2022 11:15 AM GMT
ఆ ఉప ఎన్నికల్లాగే.. మునుగోడూ టీఆర్ఎస్ కు లైటా? మరి ఈ మాటలేంటి?
X
టీఆర్ఎస్ అంటేనే ఉప ఎన్నికలకు పెట్టింది పేరు. అధినేత కేసీఆర్ నాయకత్వంలో.. ఉద్యమ సమయంలో.. పదవులను గడ్డిపోచల్లా వదిలేసి.. ఉప ఎన్నికలకు వెళ్లారు ఆ పార్టీ ఎమ్మెల్యేలు. అసలు టీఆర్ఎస్ పుట్టుకతోనే ఉప ఎన్నిక మొదలైంది. 2001లో సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్న కేసీఆర్.. పదవికి రాజీనామా చేశారు. అంతకుముందే ఆయన డిప్యూటీ స్పీకర్ పదవిని త్యజించారు. దాదాపు రెండు దశాబ్దాల టీడీపీ సభ్యత్వాన్ని కూడా వదులుకున్నారు. అలా.. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు సీఎంగా ఉండగా 2001లో సిద్దిపేట ఉప ఎన్నిక జరిగింది. కేసీఆర్ ను ఓడించేందుకు చంద్రబాబు రూ.50 కోట్లు ఖర్చుపెట్టారని చెబుతారు. స్వయంగా కేసీఆరే ఈ ఆరోపణ చేశారు. ఆ సంగతి పక్కన పెడితే.. టీఆర్ఎస్ చరిత్రలో ఎన్నో ఉప ఎన్నికలు. అన్ని పార్టీలకూ ఇలాంటి ఉప ఎన్నికలను ఎదుర్కొన్నా.. రాజీనామాల ద్వారా తెలంగాణ వాదాన్ని నిలిపేందుకు టీఆర్ఎస్ ఎక్కువసార్లు ఎదుర్కొంది.

ఉద్యమంలో ఒక లెక్క..

ఉద్యమ పార్టీగా 2001లో సిద్దిపేట ఉప ఎన్నిక నుంచి టీఆర్ఎస్ ప్రస్థానం ప్రారంభమైంది. అనంతరం కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని 2004లో కేసీఆర్ కరీంనగర్ ఎంపీగా, సిద్దిపేట ఎమ్మెల్యేగా పోటీచేసి గెలిచారు. సిద్దిపేటను వదులుకుని.. అక్కడినుంచి ఉప ఎన్నికలో హరీశ్ రావును బరిలో దింపారు. కేసీఆర్ కేంద్రంలో మంత్రి అయ్యారు. అయితే ఉమ్మడి ఏపీలో నెలకొన్న అనూహ్య పరిస్థితుల కారణంగా రాజీనామా చేశారు. రాష్ట్రంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చారు.

తర్వాత జరిగిన పరిణామాల్లో కాంగ్రెస్ సీనియర్లు కాకా, కేకే, ఎంఎస్ఆర్ చేసిన సవాళ్లతో కేసీఆర్ కరీంనగర్ ఎంపీ పదవికి రాజీనామా చేసి సంచలనం రేపారు. నాటి ఉప ఎన్నికలో తెలంగాణ వాదాన్ని తట్టి లేపారు. కేసీఆర్ విజయం సాధించారు. ఇక 2008లో ఓసారి, 2010లో మరోసారి తెలంగాణ కోసం టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేశారు. ఇవన్నీ ఉద్యమాన్నికాపాడేందుకు ఉపయోగపడ్డాయి. ఆఖరికి 2011లో పరకాల కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న కొండా సురేఖ రాజీనామా సందర్భంగానూ టీఆర్ఎస్ తీవ్ర పోరాటంతో దక్కించుకుంది.

అధికారంలోకి వచ్చాక ఒక లెక్క

అనేక పోరాటలతో 2014లో తెలంగాణ సిద్ధించడం, టీఆర్ఎస్ అధికారంలోకి రావడం అందరికీ తెలిసిందే. అయితే, 2014 ఎన్నికల్లో కేసీఆర్ మెదక్ ఎంపీగా, గజ్వేల్ ఎమ్మెల్యేగా గెలిచారు. తెలంగాణకు సీఎం అయ్యాక మెదక్ ఎంపీ పదవికి రాజీనామా చేశారు. నాడు జరిగిన ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థికి 4 లక్షల పైగా మెజారిటీ దక్కింది. ఇక 2015లో నారాయణఖేడ్, 2016లో పాలేరు ఎమ్మెల్యేల మరణంతో జరిగిన ఉప ఎన్నికలను ఆ పార్టీ గెలుచుకుంది.

ఈ రెండు స్థానాలు కాంగ్రెస్ వే కావడం గమనార్హం. 2015లో వరంగల్ ఎంపీగా కడియం శ్రీహరి వైదొలగిన తర్వాత ఆ స్థానాన్నీ టీఆర్ఎస్ అద్భుత మెజార్టీతో దక్కించుకుంది. కానీ, 2018 ఎన్నికల తర్వాత అధికారం దక్కినప్పటికీ.. టీఆర్ఎస్ కు ఉప ఎన్నికలు అంతగా కలిసిరావడం లేదు. 2019లో జరిగిన హుజూర్ నగర్ ఉప ఎన్నికలో గెలిచినా.. 2020లో జరిగిన దుబ్బాక, 2021లో హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఓడిపోయింది. 2021లో నాగార్జున సాగర్ లో గెలిచింది. అంటే.. విజయాల శాతం 50కి పడిపోయింది.

దుబ్బాక, హుజూరాబాద్ లో లాగే

అపజయాన్ని ఊహించో ఏమో దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నిక సమయంలో టీఆర్ఎస్ కీలక నేతలు.. ''ఈ ఉప ఎన్నికతో ఒరిగేదేం ఉండదు'' అంటూ కామెంట్లు చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా అయితే.. మంత్రి కేటీఆర్ ''హుజూరాబాద్ ఓ ఉప ఎన్నిక అంతే. ఎందుకంత ప్రాధాన్యం ఇస్తున్నారు''? అన్నట్లు మాట్లాడారు. అంతకుముందు దుబ్బాకనూ టీఆర్ఎస్ వర్గాలు తేలిగ్గా తీసుకున్నట్లు కనిపించాయి. ఇక తాజాగా ఉప ఎన్నిక జరుగనున్న మునుగోడుపైనా అదే స్వరం వినిపిస్తోంది. ''మునుగోడుతో మునిగేదేం ఉండదు'' అంటూ కేటీఆర్ అంటే.., ''మునుగోడు ఉప ఎన్నికలో భారీ హడావుడి, హంగామా లేకండా పనిచేయండి'' అని సీఎం కేసీఆర్ పార్టీ నేతలకు సూచించారు.

మరోవైపు రెండ్రోజుల కిందట శాసన మండలి స్పీకర్ గుత్తా సుఖేందర్ రెడ్డి సైతం ''మనుగోడు ప్రభావం సాధారణ ఎన్నిలకపై ఉండదని'' వ్యాఖ్యానించారు. ఉప ఎన్నిక ఫలితం అనేక కీలక పరిణామాలపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. ఇవన్నీ చూస్తుంటే టీఆర్ఎస్ దుబ్బాక, హుజూరాబాద్ లాగే మునుగోడు ఫలితాన్ని ముందే ఊహించిందా? ఒకవేళ ఓటమి ఎదురైనా తేలిగ్గా కొట్టిపారేసే వ్యూహంలో ఇలా చేస్తోందా? అనే అనుమానాలు వస్తున్నాయి.