Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ అధ్యక్ష ప‌ద‌వికి ఆ వివాదాస్ప‌ద ఎంపీ పోటీ ఖాయ‌మే!

By:  Tupaki Desk   |   20 Sep 2022 1:30 PM GMT
కాంగ్రెస్ అధ్యక్ష ప‌ద‌వికి ఆ వివాదాస్ప‌ద ఎంపీ పోటీ ఖాయ‌మే!
X
కాంగ్రెస్ జాతీయ అధ్య‌క్ష ప‌ద‌విని చేప‌ట్ట‌డానికి సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంకా గాంధీ మొగ్గుచూప‌ని సంగతి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో రాజ‌స్థాన్ ముఖ్య‌మంత్రి అశోక్ గెహ్లోత్ పేరు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్య‌క్ష ప‌ద‌వికి ఇటీవ‌ల వినిపించింది. అయితే ఆయ‌న కూడా రాజ‌స్థాన్‌లో ముఖ్య‌మంత్రిగా ఉండ‌టమే త‌న‌కు ఇష్ట‌మంటూ అధ్య‌క్ష ప‌ద‌విని చేప‌ట్టడానికి ఇష్ట‌ప‌డ‌టం లేదంటున్నారు. అయితే సోనియా గాంధీ కుటుంబానికి అత్యంత విశ్వ‌స‌నీయ పాత్రుడైన అశోక్ గెహ్లోత్ ఆమె ఒత్తిడి చేస్తే పోటీ చేస్తార‌ని అంటున్నారు.

మ‌రోవైపు కేంద్ర మాజీ మంత్రి, కేర‌ళ‌లోని తిరున‌వంత‌పురం ఎంపీ శ‌శి థ‌రూర్ పేరు కూడా కాంగ్రెస్ అధ్యక్ష ప‌ద‌వికి వినిపిస్తోంది. ఈ మేర‌కు సోనియా గాంధీని క‌ల‌సి శ‌శి థ‌రూర్ ఆమె ఆశీర్వాదాలు తీసుకున్నాన‌న్నారు. కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి పోటీ చేసే ఉద్దేశం తనకు ఉందని వెల్లడించారు. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీతో ఈ విషయం చెప్పాన‌న్నారు.

కాగా ఈ ఎన్నికల్లో తాను తటస్థంగా వ్యవహరిస్తానని, ఎక్కువమంది పోటీ చేయడాన్ని ఆహ్వానిస్తానని సోనియా శ‌శిథ‌రూర్‌కు చెప్పిన‌ట్టు స‌మాచారం. మ‌రోవైపు పార్టీ ఎన్నికల్లో ఎవరైనా పోటీపడవచ్చనీ, ఎవరి అనుమ‌తి, అంగీకారం అవసరం లేదని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ చెప్పారు. కాగా 'ఉదయ్‌పుర్‌ డిక్లరేషన్‌' ప్రకారం పార్టీలో సంస్కరణలు తీసుకొస్తానని ప్రతిజ్ఞ చేయాలని కోరుతూ కాంగ్రెస్‌లోని 650 మంది యువ సభ్యుల బృందం తయారు చేసిన లేఖ‌పై తాను సంతకం చేసినట్లు థరూర్‌ ట్వీట్‌ చేశారు.

ఇదిలా ఉండ‌గా మరోవైపు రాహుల్‌గాంధీని పార్టీ అధ్యక్షునిగా నియమించాలంటూ మహారాష్ట్ర, తమిళనాడు, బిహార్‌, జమ్మూకశ్మీర్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీలు కూడా తీర్మానాలు చేశాయి. ఇప్పటికే రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, గుజరాత్‌ పీసీసీలు ఇలాంటి తీర్మానాలను ఆమోదించిన విషయం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో రాహుల్ గాంధీ కూడా తాను పోటీ చేయ‌బోన‌ని చెప్ప‌డం లేదు. అధ్యక్ష ప‌ద‌వి ఎన్నిక‌కు ఇంకా స‌మ‌యం ఉందని.. అప్పుడు ఆలోచిద్దామ‌ని చెబుతున్న‌ట్టు స‌మాచారం.

కాగా సెప్టెంబ‌ర్‌ 22న అధ్యక్ష ఎన్నికలకు నోటిఫికేషన్‌ వెలువ‌డ‌నుంది. 24 నుంచి 30 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. పోటీ అనివార్యమైతే అక్టోబర్‌ 17న ఓటింగ్‌ నిర్వహిస్తారు. ఈ నేప‌థ్యంలో రాహుల్ గాంధీ చివ‌రి నిమిషంలో పోటీ చేయ‌ని ప‌క్షంలో కాంగ్రెస్ అధ్యక్ష ప‌ద‌వికి శ‌శిథ‌రూర్‌, అశోక్ గెహ్లోత్ నామినేష‌న్లు వేసే అవ‌కాశం ఉంది. అయితే శ‌శి థ‌రూర్‌కు పార్టీ బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డానికి సోనియా, రాహుల్ అంగీక‌రిస్తారా అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. ఎందుకంటే పార్టీలో సంస్థాగ‌త మార్పుల‌ను సూచిస్తూ.. గ‌తంలో కాంగ్రెస్ అధిష్టానంపై లేఖ‌లు సంధించిన జీ-23 కాంగ్రెస్ నేత‌ల్లో శ‌శిథ‌రూర్ ఒక‌రిగా ఉన్నారు.

గాంధీల కుటుంబానికి అత్యంత విశ్వాస‌పాత్రులైన‌వారినే అధ్య‌క్ష ప‌ద‌వికి ఎంపిక చేసే వీలుంది. ఈ నేప‌థ్యంలో శ‌శి థ‌రూర్‌కు అవ‌కాశాలుంటాయా అనే దానిపై చ‌ర్చ జ‌రుగుతోంది. ఆయ‌న ఎన్నిక‌ల్లో పోటీ చేసినా అశోక్ గెహ్లోత్ ఎంపిక‌య్యే అవ‌కాశం ఉందని అంటున్నారు. సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీల మొగ్గు అశోక్ గెహ్లోత్ కే ఉందంటున్నారు.

కాగా అధ్యక్ష పదవికి ఎన్నిక జరిగితే దేశవ్యాప్తంగా దాని ప్రభావం ఉంటుందని శ‌శి థరూర్ ఇటీవ‌ల ఓ ప‌త్రిక‌కు రాసిన వ్యాసంలో పేర్కొన్నారు. ఇందుకు ప్రస్తుతం బ్రిటన్‌ ప్రధాని పదవి కోసం అధికారిక కన్జర్వేటివ్‌ పార్టీలో జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను ఆయన ఉదాహరణగా చూపించారు. ప్రధాని అభ్యర్థిని ఎన్నుకోవడానికి ఆ పార్టీలో జరుగుతున్న ఎన్నిక ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆస‌క్తిని రేకెత్తించింద‌ని ఆయ‌న గుర్తు చేస్తున్నారు. అలాంటి ప్రయత్నమే కాంగ్రెస్‌లోనూ జరగాల్సి ఉందని అంటున్నారు. అభ్యర్థులు తమ విజన్‌ను పార్టీ ముందు ఉంచితే తప్పనిసరిగా అది ప్రజల్లో ఆసక్తి కలిగిస్తుందని శ‌శి థ‌రూర్ అభిప్రాయంగా ఉంది. కాగా త‌న పోటీ విషయమై ఇప్పటికే ఆయన పలువురు కాంగ్రెస్ నాయకులతో చర్చలు జర‌ప‌డం విశేషం.

ఒక వేళ కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి చాలా మంది అభ్యర్థులు పోటీ పడితే ఎన్నిక నిర్వహిస్తారు. అదే జరిగితే 22 ఏళ్ల తరువాత ఆ పదవికి ఎన్నిక జరిగినట్టు అవుతుంది. 2000 నవంబరులో సోనియా గాంధీపై జితేంద్ర ప్రసాద పోటీ చేశారు. సోనియాకు 7,542 ఓట్లు రాగా, జితేంద్రకు కేవలం 94 మాత్రమే వచ్చాయి. ప్రజాస్వామ్య స్ఫూర్తి కోసమే పోటీ చేసినట్టు ఆ సందర్భంగా ఆయన ప్రకటించ‌డం గ‌మ‌నార్హం.

కాగా శ‌శి థ‌రూర్ 2009, 2014, 2019 ఎన్నిక‌ల్లో తిరువ‌నంత‌పురం నుంచి కాంగ్రెస్ ఎంపీగా గెలుపొందారు. సునంద పుష్క‌ర్ అనుమానాస్ప‌ద మృతిలో శ‌శి థ‌రూర్‌పై తీవ్ర ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఆమెది స‌హ‌జ మ‌ర‌ణం కాద‌ని.. హ‌త్యేన‌ని క‌థ‌నాలు వెలువ‌డ్డాయి. కాగా శ‌శి థ‌రూర్.. మ‌న్మోహ‌న్ సింగ్ ప్ర‌భుత్వ హ‌యాంలో కేంద్ర విదేశాంగ స‌హాయ మంత్రిగా పనిచేశారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.