Begin typing your search above and press return to search.

జగన్ కు గిఫ్ట్ ఇస్తానంటున్న మంత్రి.. సాధ్యమేనా?

By:  Tupaki Desk   |   3 March 2021 3:30 AM GMT
జగన్ కు గిఫ్ట్ ఇస్తానంటున్న మంత్రి.. సాధ్యమేనా?
X
ఏపీలో త్వరలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఇప్పటి నుంచే ఎన్నికల వేడి రాజుకుంది. ఆయా పార్టీలు అభ్యర్థులెవరిని దించాలా..? అనే పనిలో పడ్డారు. ఇక అధికారంలో ఉన్న వైసీపీ ఏ ఒక్క మున్సిపల్ లేదా కార్పొరేషన్ ను కూడా వదిలేలా కనిపించడం లేదు. ఇందులో భాగంగా ఆయా స్థానాల్లో ఉన్న మంత్రులకు ఈ బాధ్యతలను అప్పగించింది. ముఖ్యంగా నెల్లూరు నియోజకవర్గంలో కార్పొరేషన్ ఎన్నికల వేడి ఇప్పటికే మొదలైంది. ఇక్కడ మంత్రిగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ కార్పొరేషన్ స్థానాన్ని ఎట్టి పరిస్థితులో చేజారనివ్వకుండా తీవ్రంగా కృషి చేస్తున్నాడు.

2014 కార్పొరేషన్ ఎన్నికల్లో నెల్లూరు కార్పొరేషన్ ను టీడీపీ గెలుచుకుంది. దీంతో మేయర్ గా అజీజ్ ఎన్నికయ్యారు. ఆయన గత ఎన్నికల్లో రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అంతేకాకుండా నెల్లూరులో టీడీపీ పరిస్థితి రోజురోజుకు దిగజారుతోందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తనకు అనుగుణంగా పరిస్థితులు మార్చుకునే పనిలో ఉన్నాడు. ఆయన ఇటీవల జగన్ తో జరిగిన సమావేశంలో నెల్లూరు కార్పొరేషన్ ను మీకు గిఫ్ట్ గా ఇస్తానని శపథం చేశాడట. దీంతో ఆయన ఎలాగైనా ఇక్కడ వైసీపీ జెండా ఎగురవేసేందుకు తీవ్ర కసరత్తు చేస్తున్నాడట.

టీడీపీలో మాజీ మంత్రి పి. నారాయణ, మాజీ మేయర్ అజీజ్, ఇతర నేతలు ఉన్నా కింది స్థాయి నాయకుల్లో మాత్రం ఉత్సాహం కరువైంది. వైసీపీకి ధీటుగా పార్టీని నడిపించగల సత్తా నాయకుడు లేకపోవడంతో ఆ పార్టీని పట్టించుకోనట్లు తెలుస్తోంది. ఇదే కాకుండా ఉన్న నాయకుల్లో గ్రూపులు ఏర్పడి ఒకరిపై ఒకరు విమర్శలు దిగడం పార్టీ పరిస్థితి మరీ అధ్వానంగా తయారైనట్లు తెలుస్తోంది.

వైసీపీలో దూకుడైన మంత్రుల్లో అనిల్ యాదవ్ ఒకరు. దీంతో త్వరలో జరిగే కార్పొరేషన్ ఎన్నికల్లో తనదైన శైలీలో నాయకులను పరుగులు పెట్టిస్తున్నాడు. త్వరలో మంత్రి వర్గ విస్తరణ ఉండనున్నందున తన పదవికి ఎలాంటి ముప్పు రాకుండా ఇక్కడ గెలిచేందుకు వైరవర్గంగా ఉన్న అనం లాంటి నేతలకు కూడా అవకాశం ఇవ్వడం లేదట. మరి ఇక్కడ వైసీపీ జెండాను మంత్రి ఏ విధంగా ఎగురవేయగలడో చూద్దాం..