Begin typing your search above and press return to search.

కంట్రోల్ చేయాలంటే జగన్ మాదిరి నిర్ణయం తప్పదు సారూ

By:  Tupaki Desk   |   20 Jun 2020 3:45 AM GMT
కంట్రోల్ చేయాలంటే జగన్ మాదిరి నిర్ణయం తప్పదు సారూ
X
మాయదారి రోగం అంతకంతకూ విస్తరిస్తూ విరుచుకుపడుతున్న వేళలో ఏం చేస్తే మంచిది? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. లాక్ డౌన్ ఎత్తేయటంతో మహమ్మారి ముప్పు మరింత పెరుగుతుందన్న అంచనాలకు తగ్గట్లే పాజిటివ్ కేసుల సంఖ్య గడిచిన కొద్దిరోజులుగా అంతకంతకూ పెరుగుతున్నాయి. గడిచిన ఐదారు రోజులుగా చూస్తే.. తెలంగాణలో బయటకొస్తున్న పాజిటివ్ కేసులు కొత్త కంగారును తీసుకురావటమేకాదు.. ఈ తీవ్రతకు అడ్డుకట్ట వేసేదెలా? అన్న ఆందోళన పెరుగుతోంది.

తెలంగాణలో మాదిరే ఏపీలోనూ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఏపీలో పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్న మూడు జిల్లాల్లో మరోసారి లాక్ డౌన్ విధించాలన్న కీలక నిర్ణయాన్ని తీసుకుంది ఏపీ సర్కారు. కేసుల్ని కంట్రోల్ చేయాలంటే కట్టడికి మించిన మందు మరొకటి లేదన్న వాదనకు ఏపీ సర్కారు మొగ్గిచూపింది. దీంతో.. ఏపీలో పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్న ప్రకాశం.. అనంతపురం.. శ్రీకాకుళం జిల్లాల్లో లాక్ డౌన్ ను విధిస్తూ నిర్ణయాన్ని తీసుకున్నారు.

ఇరుగు పొరుగు రాష్ట్రాలతో పాటు.. విదేశాల నుంచి వచ్చిన వారి పుణ్యమా అని పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగినట్లుగా అంచనా వేస్తున్నారు. శుక్రవారం ఒక్కరోజులోనే 465 కేసులు నమోదయ్యాయి. దీంతో.. మరోసారి లాక్ డౌన్ దిశగా ఏపీసర్కారు నిర్ణయం తీసుకుంది. తెలంగాణ విషయానికి వస్తే.. శుక్రవారం ఒక్కరోజులోనే 499 పాజిటివ్ కేసులు నమోదైన తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా ఉలిక్కిపడేలా చేసింది.

మొన్నటివరకూ రోజుకు వంద నుంచి నూట యాభై కేసులకే పరిమితమైన స్తానం నుంచి చూస్తుండగానే 200.. 300.. 400.. చివరకుఐదు వందలకు దగ్గరగా రావటం ఇప్పుడు భయాందోళనలకుగురి చేస్తుంది. అంతకంతకూ పెరుగుతూ పోతున్న పాజిటివ్ కేసులకు కట్టడి చేసే వారెవరు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఈ నేపథ్యంలో ఏపీ సర్కారు మాదిరి కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్నచోట లాక్ డౌన్ అమలు చేయటం మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మందు లేని ఈ మహమ్మరికి ముందస్తు జాగ్రత్తలతో కట్టడి చేయటమే మంచి మందు. ఆ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తించి కఠిన నిర్ణయాన్ని తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పక తప్పదు.