Begin typing your search above and press return to search.

బీజేపీ బలి పశువును రెడీ చేసిందా ?

By:  Tupaki Desk   |   2 Feb 2022 7:38 AM GMT
బీజేపీ బలి పశువును రెడీ చేసిందా ?
X
ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ మళ్ళీ ప్రయోగం చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కేంద్రమంత్రులను పోటీలోకి దింపుతోంది. ఈ మధ్యనే జరిగిన పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఇలాంటి ప్రయోగమే చేసి చేతులు కాల్చుకున్నది. ఇపుడు మళ్ళీ అదే ప్రయోగాన్ని యూపీ ఎన్నికల్లో చేస్తోంది. ఇంతకీ విషయం ఏమిటంటే కేంద్ర న్యాయశాఖ సహాయమంత్రి సత్యపాల్ బఘేల్ ను పోటీలోకి దింపుతోంది. అది కూడా కర్ హాల్ నియోజకవర్గంలో పోటీలోకి దింపుతుండటమే ఆశ్చర్యంగా ఉంది.

కర్ హాల్ అంటే ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ పోటీ చేస్తున్న నియోజకవర్గం. కర్ హాల్ నియోజకవర్గం అంటేనే ఎస్పీకి కంచుకోట. అందుకే అఖిలేష్ ఏరికోరి ఇక్కడ పోటీ చేస్తున్నారు. కర్ హాల్ నియోజకవర్గంలో మెజారిటీ యాదవులదే. తర్వాత ఎస్సీలు కూడా ఉన్నారు. బఘేల్ ప్రస్తుతం ఆగ్రా లోక్ సభ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బఘేల్ కూడా చిన్నా చితకా నేతేమీ కాదు సీనియర్ అనే చెప్పాలి. కాకపోతే అఖిలేష్ పై పోటీలోకి దింపటం ద్వారా బఘేల్ ను బీజేపీ బలిపశువును చేసిందనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

బఘేల్ ను పోటీలోకి దింపటంలో బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందనే వాదన కూడా ఉంది. అదేమంటే బఘేల్ కాకుండా ఇంకెవరైనా పోటీలో ఉండుంటే అఖిలేష్ అసలు పట్టించుకునే వారే కాదు. అయితే సీనియర్ నేత, ఎస్సీలో గట్టి పట్టున్న బఘేల్ పోటీలోకి దింపటం వ్యూహాత్మకమనే చెప్పాలి. ఇతర నియోజకవర్గాల్లో అఖిలేష్ ను స్వేచ్చగా ప్రచారం చేసుకునేందుకు లేకుండా కర్ హాల్ లోనే మ్యాగ్జిమమ్ పరిమితం చేయాలనేది బీజేపీ వ్యూహంగా కనబడుతోంది.

విచిత్రమేమిటంటే బఘేల్ రాజకీయ జీవితం మొదలుపెట్టిందే ఎస్పీ నుండి. ఎస్పీ తరపున 1998. 1999, 2004లో జలేసర్ నుంచి లోక్ సభ అభ్యర్థిగా గెలిచారు. తర్వాత బీఎస్పీలో చేరి 2010లో రాజ్యసభ ఎంపీ అయ్యారు. ఆ తర్వాత 2017లో బీజేపీలో చేరి ఎంఎల్ఏగా గెలిచి యోగి ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. మళ్ళీ 2019లో ఆగ్రా లోక్ సభ నుండి పోటీచేసి గెలిచి కేంద్రంలో న్యాయశాఖ మంత్రిగా ఉన్నారు. ప్రజా ప్రతినిధిగా ఇంతటి ఘన చరిత్ర కలిగిన బఘేల్ ఇపుడు అఖిలేష్ కు వ్యతిరేకంగా ఎంఎల్ఏగా పోటీ చేస్తున్నారు. మొత్తానికి పోటీ అయితే రసవత్తరంగా ఉండబోతోంది. మరి ఎవరు గెలుస్తారో చూడాలి.