Begin typing your search above and press return to search.

మహారాష్ట్ర ఎమ్మెల్యేలను బీజేపీ కిడ్నాప్ చేస్తోందా?

By:  Tupaki Desk   |   22 Jun 2022 1:15 PM GMT
మహారాష్ట్ర ఎమ్మెల్యేలను బీజేపీ కిడ్నాప్ చేస్తోందా?
X
మహారాష్ట్రలో శివసేన ప్రభుత్వంలో తలెత్తిన సంక్షోభాన్ని బీజేపీ తనకు అనుకూలంగా మలుచుకోవడానికి ప్రయత్నిస్తోందా అంటే అవుననే అంటున్నారు.. రాజకీయ విశ్లేషకులు.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే కేబినెట్ లో మంత్రిగా, శివసేన శాసనసభా పక్ష నేతగా ఉన్న ఏక్ నాథ్ షిండే తిరుగుబాటు చేయడం వెనుక ఉంది మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేందర్ ఫడ్నవీస్ అని పేర్కొంటున్నారు. ఏకనాథ్ షిండే అసమ్మతి ఎమ్మెల్యేలతో కలసి ముందు గుజరాత్ లోని సూరత్ లో క్యాంపు ఏర్పాటు చేశారు. అలాగే ఇప్పుడు అసోంలోని గువహటికి అసమ్మతి ఎమ్మెల్యేలను తరలించారు. అటు గుజరాత్ లోనూ, ఇటు అసోంలోనూ బీజేపీ ప్రభుత్వాలే ఉండటం ఇందుకు ఊతమిస్తోందని చెబుతున్నారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ - శివసేన-ఎన్సీపీ సర్కారును కూలదోయడం బీజేపీ ఉద్దేశమని అంటున్నారు.

శివసేన తిరుగుబాటు నేత ఏకనాథ్ షిండే కూడా ఇదే చెబుతుండటం గమనార్హం. ఉద్ధవ్ ఠాక్రే మీద తమకు కోపం లేదని.. శివసేన.. కాంగ్రెస్, ఎన్సీపీలను వదిలిపెట్టి బీజేపీతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది తన ఒక్కడి డిమాండ్ మాత్రమే కాదని.. తనతో ఉన్న అందరి ఎమ్మెల్యేల డిమాండ్ అని స్పష్టం చేస్తున్నారు.

మరోవైపు శివసేన ఎమ్మెల్యేలను బీజేపీ కిడ్నాప్ చేస్తోందని విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఏకనాథ్ షిండే క్యాంపు నుంచి బయటకొచ్చిన ఎంఎల్ఏ నితిన్ దేశముఖ్ ఇదే చెబుతున్నారు. తనను బీజేపీ నేతలు కిడ్నాప్ చేశారని ఆయన తెలిపారు. గుజరాత్ లోని సూరత్ కు తమను బలవంతంగా తరలించారని.. అక్కడ ఒక ఆస్పత్రిలో ఇంజెక్షన్లు చేశారని ఆరోపిస్తన్నారు. అంతేకాకుండా తాము పారిపోకుండా తమ చుట్టూ 200 మంది పోలీసులను పెట్టారని మండిపడ్డారు.

కాగా గుజరాత్ లోని సూరత్ లో ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో మకాం వేసిన ఏకనాథ్ షిండే వర్గం ఎమ్మెల్యేలంతా జూన్ 22న బుధవారం అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో అసోం వెళ్లారు. సూరత్ లో ఉన్న తమ వద్దకు ఉద్దవ్ ఠాక్రే మంత్రులు, ఇతర సీనియర్ నేతలను పంపుతుండటంతో అసమ్మతి ఎమ్మెల్యేల మనసు మారకుండా ఉండేందుకు వారిని అసోం తరలించారు. అంతకుముందు సూరత్ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడిన ఏకనాథ్ షిండే శివసేన ఎమ్మెల్యేల్లో మూడింట రెండు వంతులు తన వెంటే ఉన్నారన్నారు.

కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినందుకు ఏకనాథ్ షిండే.. ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేపై మండిపడ్డారు. వెంటనే కాంగ్రెస్ ను, ఎన్సీపీని వదలిపెట్టి బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.