Begin typing your search above and press return to search.

బీజేపీ పార్కింగ్ ప్లేస్ అయిపోయిందా ?

By:  Tupaki Desk   |   11 Oct 2021 5:40 AM GMT
బీజేపీ పార్కింగ్ ప్లేస్ అయిపోయిందా ?
X
వలస నేతలకు బీజేపీ పార్కింగ్ ప్లేస్ లాగా అయిపోయింది ? ఇపుడిదే అంశంపై చర్చ జరిగింది. పార్టీ అనుబంధ సంస్థల పనితీరును సమీక్షించేందుకు విజయవాడలో పార్టీ సీనియర్ నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉత్తరాది నుంచి వచ్చిన ఓ సీనియర్ నేత మాట్లాడుతూ బీజేపీని వలస నేతలు కొందరు పార్కింగ్ ప్లేస్ లాగ వాడుకుంటున్నట్లున్నారు అంటూ కామెంట్ చేశారు. దీంతో సమావేశంలో ఒక్కసారిగా కలకలం మొదలైంది.

ఇంతకీ విషయం ఏమిటంటే 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోగానే నలుగురు రాజ్యసభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేష్, గరికపాటి మోహన్ రావు, టీజీ వెంకటేష్ వెంటనే బీజేపీలోకి ఫిరాయించిన విషయం అందరికీ తెలిసిందే. వీళ్ళు బీజేపీలోకి ఫిరాయించగానే అప్పటికే వీళ్ళపై ఉన్న సీబీఐ, ఈడీ, ఐటీ సంస్థల దర్యాప్తు లన్నీ ఒక్కసారిగి నిలిచిపోయాయి. అంటే తమ కేసుల నుండి రక్షణ కోసమే వీళ్ళు బీజేపీలోకి ఫిరాయించిన విషయం అందరికీ అర్థమైపోయింది.

ఇదే విషయాన్ని సదరు ఉత్తరాధి నేత మాట్లాడుతూ బీజేపీని కొందరు పార్కింగ్ ప్లేసు లాగ వాడుకుంటున్నట్లు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ కారణంగానే వలసనేతలకు పార్టీ సమావేశాల్లో పాల్గొనేందుకు ఆహ్వానాలు కూడా అందటం లేదనే కామెంట్ కూడా మొదలైపోయింది. సదరు ఉత్తరాధి నేత చేసిన వ్యాఖ్యలను కొందరు సమావేశం నుండే ఫోన్ చేసి సీఎం రమేష్, ఆదినారాయణరెడ్డికి వివరించారట. దాంతో సమావేశంలో ఎవరేమి మాట్లాడారనే విషయంపై రమేష్ ఆరా తీసినట్లు సమాచారం.

సమావేశంలో మాట్లాడిన ఉత్తరాధి నేత భవిష్యత్తులో టీడీపీతో బీజేపీకి పొత్తుండదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారట. రాష్ట్రంలో టీడీపీ తుడిచిపెట్టుకుని పోయేలా బీజేపీ నేతలు గట్టిగా పనిచేయాలని కూడా డైరెక్షన్ ఇచ్చారట. ఈ నేపధ్యంలోనే బీజేపీ అంటే పార్కింగ్ ప్లేస్ కాదంటు కామెంట్ చేశారట. మొత్తానికి సదరు ఉత్తరాధినేత చేసిన కామెంట్లు ఎవరికి తగలాలో వాళ్ళకే నేరుగా తగిలిందని సమావేశంలో నేతలకు అర్ధమైంది.