Begin typing your search above and press return to search.

రైనా మెరుపులు మాయమేనా?

By:  Tupaki Desk   |   14 Feb 2022 11:30 AM GMT
రైనా మెరుపులు మాయమేనా?
X
అది 2004 సంవత్సరం.. హైదరాబాద్ లో రంజీ మ్యాచ్ జరుగుతోంది. ఉత్తరప్రదేశ్ కు చెందిన 18 ఏళ్ల కుర్రాడు అద్భుత ఆటతీరుతో అదరగొట్టాడు. చేసింది 30, 40 పరుగులే. కానీ, అతడి బ్యాటింగ్ తీరు చూసినవారు.. ఎడమ చేతివాట సచిన్ టెండూల్కర్ అని పొగడడం ప్రారంభించారు. అక్కడ ఉన్న మీడియా ప్రతినిధి ఒకరు.. రైనా మీరు కచ్చితంగా ఇండియాకు ఆడతావని చెప్పారు. అది నిజమైంది కూడా.అంతలా ఆకట్టుకున్న ఆ కుర్రాడు సురేశ్ రైనా... తొలుత పెట్టుకున్న అంచనాలకు తగ్గట్టుగానే రైనా ఏడాదిలోనే టీమిండియాకు ఎంపికయ్యాడు.

అద్భుత ఫీల్డింగ్ తో కట్టిపడేశాడు. యువరాజ్ సింగ్ తో కలిసి ఫీల్డ్ లో చురుకైన ఫీల్డర్ గా పేరు తెచ్చుకున్నాడు. కొద్దిగా ఇబ్బంది పడినా తర్వాత జట్టులో కుదురుకున్నాడు. ఓ దశలో వైస్ కెప్టెన్ గా, కీలక ఆటగాడిగానూ ఎదిగాడు. టెస్టు మ్యాచ్ అరంగేంట్రలోనే సెంచరీ కొట్టి తిరుగు లేదనిపించాడు. కానీ, క్రమంగా అతడి ప్రభ మసకబారింది. టీమిండియాకు దూరమయ్యాడు. గాయం బారినపడ్డాడు. తనకెంతో ఇష్టమైన ఐపీఎల్ కు పరిమితం అయిపోయాడు. రెండేళ్ల కిందట అర్థంతరంగా లీగ్ నుంచి తప్పుకొని వివాదస్పదడుయ్యాడు. అయితే, ఈ ఏడాది కనీసం అతడిని కొన్నవారే లేకపోయారు. ఉమేశ్ యాదవ్ లాంటి పేసర్

తొలి విడత వేలంలో

అమ్ముడుపోకున్నా రెండో విడతలో ఎవరో ఒకరు కొనుక్కున్నారు. రైనా పేరు రెండవ యాక్సిలరేషన్ జాబితాలో కూడా లేదు. వేలంలో మొద‌టి సారి అమ్ముడు పోని ఆట‌గాళ్ల‌కు చివ‌ర‌న మ‌రోసారి అవ‌కాశం ఇస్తారు. ఫ్రాంచైజీలు ఎంచుకున్న ఆట‌గాళ్ల‌కు మ‌ళ్లీ వేలం నిర్వ‌హిస్తారు. కానీ దుర‌దృష్ట‌వ‌శాత్తూ రైనాను ఏ ఫ్రాంచైజీ ఎంచుకోలేదు. అంటే ఈ సీజ‌న‌ల్‌లో సురేష్‌ రైనా ఇక క‌నిపించ‌డు.

ధోని సొంత తమ్ముడిలా..

మాజీ కెప్టెన్ ధోనికి సొంత తమ్ముడు ఉంటే ఎలా ఉంటాడో తెలియదు కానీ.. రైనా మాత్రం సొంత తమ్ముడిలానే ఉండేవాడు. టీమిండియా కు ఆడినా, చెన్నై సూపర్ కింగ్స్ కు ఆడినా రైనా ధోని జంట సూపర్ క్లిక్.

చిత్రమేమంటే.. ధోని రిటైర్మెంట్ ప్రకటించిన 2020 ఆగస్టు 15నే రైనా కూడా రిటైర్మెంట్ పలికాడు. ఇద్దరూ మొదటి నుంచి సూపర్ కింగ్స్ కు మాత్రమే ఆడుతున్నారు. రైనా ఈ క్ర‌మంలో మిస్ట‌ర్ ఐపీఎల్‌గా కూడా పేరు తెచ్చుకున్నాడు. ఆ జ‌ట్టు లేని రెండు సీజ‌న్లు మాత్రం గుజ‌రాత్ ల‌య‌న్స్ త‌ర‌ఫున ఆడాడు. సీఎస్కే విజ‌యాల్లో కీల‌క పాత్ర పోషించాడు. అయితే ఈ సారి రైనాను ఆ జ‌ట్టు రిటైన్ చేసుకోక పోవ‌డంతో మెగా వేలంలోకి వ‌చ్చాడు. 2 కోట్ల రూపాయ‌ల బేస్ ప్రైజ్‌తో వేలంలోకి రాగా ఏ జ‌ట్టు కూడా కొనుగోలు చేయ‌లేదు. సీఎస్కే కూడా ప‌ట్టించుకోలేదు.

దెబ్బకొట్టింది ఇవే..

గతేడాది ఐపీఎల్ ముంగిట రైనా కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అతడి మేనత్త కుటుంబంలో దొంగలు పడి పలువురిని హత్య చేశారు. ఇటీవల రైనా తండ్రి కన్నుమూశాడు. వ్యక్తిగత ఇబ్బందులు ఇలా ఉండగా.. అతడి ఫామ్ కూడా గొప్పగా లేదు. ఇదే అతడిని ఎవరూ కొనకపోవడానికి కారణంగా తెలుస్తోంది. దీనికితోడు ఇటీవ‌ల ఎలాంటి క్రికెట్ ఆడ‌లేదు. ఇక గ‌త సీజ‌న్లో కూడా రైనా దారుణంగా విఫ‌ల‌మ‌య్యాడు. అలాగే ఈ సీజ‌న్లో రాణిస్తాడ‌నే న‌మ్మకాన్ని కూడా ఫ్రాంచైజీల‌కు క‌ల్పించ‌లేక‌పోయాడు. దీనికి తోడు 2020లో ఇండియాలో క‌రోనా కార‌ణంగా యూఏఈలో లీగ్ జ‌రిగిన‌ప్పుడు రైనా మ్యాచ్‌లు మొద‌ల‌వ‌కుండానే స్వ‌దేశానికి తిరిగొచ్చేశాడు.

దీంతో ఈ సారి కూడా అలాంటి ప‌రిస్థితులు ఏర్పడితే రైనా జ‌ట్టుకు అందుబాటులో ఉండ‌డ‌ని కూడా ఫ్రాంచైజీలు భావించాయ‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే అంత‌ర్జాతీయ క్రికెట్ నుంచి కూడా త‌ప్పుకున్నాడు. ఈ కార‌ణాలన్నింటిని దృష్టిలో పెట్టుకునే రైనాను ఏ ఫ్రాంచైజీ ద‌క్కించుకోలేద‌ని క్రికెట్ విశ్లేష‌కులు అంటున్నారు.

సూపర్ కింగ్స్ సూపర్ సక్సెస్ క్రికెటర్..

ఐపీఎల్‌లో అత్యంత విజ‌య‌వంత‌మైన ఆట‌గాళ్ల‌లో రైనా ఒక‌డు.205 మ్యాచ్‌లు ఆడి 32 స‌గటుతో 5528 ప‌రుగులు చేశాడు. ఇందులో 39 హాఫ్ సెంచ‌రీలు, ఒక సెంచ‌రీ కూడా ఉన్నాయి. ఈ క్ర‌మంలో 506 ఫోర్లు బాదిన రైనా, 203 సిక్సులు కొట్టాడు. బౌల‌ర్‌గానూ 13 వికెట్లు తీశాడు. లీగ్ లో తొలి గా 5 వేల పరుగులు చేసినది రైనానే. ఆటలో ఎంత నిబద్ధతతో ఉంటాడో కెరీర్‌ను కూడా అంతే కచ్చితత్వంతో నిర్మించుకున్నాడు.

ఈ క్రమంలోనే అటు టీమ్‌ఇండియాలో, ఇటు చెన్నై సూపర్‌ కింగ్స్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా సీఎస్కేలో కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ తర్వాత అంతటి ఆటగాడిగా ఎదిగాడు. అలాంటి ఆటగాడిని చెన్నై ముందే వదులుకోవడం ఒకింత ఆశ్చర్యం. అయితే, అతడి కథ ఈ రెండేళ్లలోనే అడ్డం తిరిగింది. అది ఇప్పుడు కంచికి చేరినట్లు

స్పష్టమవుతోంది. ఎన్నిసార్లు వేలం పాటలు నిర్వహించినా, ఎన్నిసార్లు ఆటగాళ్ల రిటెన్షన్‌ పద్ధతులు కొనసాగినా సీఎస్కే ఎప్పుడూ అతడిని వదులుకోలేదు. చెన్నై అత్యంత విజయవంతమైన జట్టుగా ఎదగడంలో అతడిదే కీలక పాత్ర. 2016, 2017 సీజన్లలో ఆ జట్టు నిషేధానికి గురైనప్పుడు మినహాయిస్తే గడిచిన 14 ఏళ్లలో 11 సీజన్లు చెన్నైతోనే కొనసాగాడు. 2018లో తిరిగి ధోనీ చెంత చేరిన అతడు జట్టు మూడోసారి ట్రోఫీ అందుకోవడంలో కీలక పాత్ర పోషించాడు.

రెండేళ్లలోనే అంతా మారింది

గొప్ప రికార్డులున్న రైనా జీవితం రెండేళ్లలోనే పూర్తిగా మారిపోయింది. 2020లో యూఏఈకి వెళ్లేముందు చెన్నైలో నిర్వహించిన ప్రత్యేక శిక్షణ శిబిరం నుంచే ఇద్దరూ రిటైర్మెంట్‌ ప్రకటించి అందరికీ షాకిచ్చారు. ఇక అదే నెలలో చెన్నై జట్టుతోనే యూఏఈకి వెళ్లిన రైనా కొద్ది రోజుల తర్వాత తిరిగి భారత్‌కు వచ్చేశాడు. ఆ సమయంలో వ్యక్తిగత కారణాలతోనే తిరిగి భారత్‌కు వచ్చేసినట్లు పేర్కొన్నాడు. కానీ, అసలు విషయం ఏమిటంటే.. ఆ సమయంలో పంజాబ్‌లో ఉంటున్న రైనా దగ్గరి బంధువులపై దుండగులు దాడి చేశారు. ఆ చేదు ఘటనలో ఇద్దరు మృతి చెందగా పలువురు తీవ్రగాయాల పాలయ్యారు.

దీంతో భయాందోళనకు గురైన తన కుటుంబ సభ్యులకు ధైర్యంగా ఉండేందుకే రైనా 2020 సీజన్‌ను ఆడలేదు. అయితే, రైనా భారత్‌కు తిరిగి వచ్చినప్పుడు చెన్నై జట్టు యాజమాన్యంతో పడట్లేదనే ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. యూఏఈలో చెన్నై టీమ్‌ ప్రత్యేకంగా బసచేసిన హోటల్‌లో కెప్టెన్‌ ధోనీకి కేటాయించిన గది (బాల్కనీ వ్యూ ఉన్నది)

లాంటిదే తనకూ కావాలని రైనా పట్టుబట్టినట్లు, దానికి యాజమాన్యం అంగీకరించనట్లు పుకార్లు షికార్లు చేశాయి. అందువల్లే రైనా ఆగ్రహించి భారత్‌కు తిరిగి వచ్చాడని వార్తలు వచ్చాయి. అదే సమయంలో సీఎస్కే యజమాని ఎన్‌.శ్రీనివాసన్‌ సైతం పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేయడంతో నిజంగానే రైనాకు ఆ జట్టుతో పడటం లేదనే అభిప్రాయం కలిగింది. ‘ఇంకా సీజన్‌ మొదలవ్వలేదు. ఇలా చేయడం వల్ల అతడు ఏం కోల్పోతాడనే సంగతి తర్వాత తెలుసుకుంటాడు. అతడికి వచ్చే డబ్బు కూడా నష్టపోతాడు. ఎవరైనా ఒకవేళ జట్టుతో సంతోషంగా లేకపోతే తిరిగి వెళ్లొచ్చు. నేను ఎవరినీ బలవంత పెట్టను. కొన్నిసార్లు సక్సెస్‌ నెత్తికెక్కుతుంది’ అని శ్రీనివాసన్‌ పరుష వ్యాఖ్యలు చేశారు. తర్వాత ఈ విషయంపై స్పందించిన రైనా.. తనకు చెన్నై జట్టుతో ఎలాంటి ఇబ్బందులు లేవని స్పష్టం చేశాడు. తనపై వచ్చిన వార్తలన్నీ పుకార్లేనని కొట్టిపారేశాడు.

ధోని అండ ఉన్నా..

2022 సీజన్‌కు ముందు చెన్నై‌ టీమ్‌ రైనాను రిటైన్‌ చేసుకోకపోవడమే అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. మరోవైపు అతడు ధోనీకి అత్యంత సన్నిహితుడు కావడంతోనూ వేలంలో తిరిగి దక్కించుకుంటుందనే భావన అభిమానుల్లో నెలకొంది. అయితే, వేలంలోనూ అతడిని తీసుకోకపోవడంతో ఇప్పుడు వారంతా విస్మయానికి గురవుతున్నారు. కాగా, చెన్నై.. అతడిని వదిలేయడానికి బలమైన కారణాలు కనిపిస్తున్నాయి. గత రెండేళ్లుగా రైనా సరైన పోటీ క్రికెట్‌ ఆడటం లేదు. గత సీజన్‌లోనూ పూర్తిగా తడబడ్డాడు. ఆడిన 12 మ్యాచ్‌ల్లో కేవలం 160 పరుగులే చేసి తొలిసారి ఐపీఎల్‌ టోర్నీలో విఫలమయ్యాడు. దీంతో అటు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమవ్వడం,

ఇటు రెండేళ్లుగా సరైన సాధన లేకపోవడం వంటి కారణాలను సీఎస్కే పరిగణలోకి తీసుకొని ఉండొచ్చు. ఈ నేపథ్యంలోనే రైనాను తిరిగి కొనసాగించాలంటే రూ.కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అయితే, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈసారి మెగా వేలంలో కొత్త సీఎస్కే జట్టును రూపొందిస్తామని ధోనీ గతంలోనే చెప్పడంతో అంత మొత్తం రైనాకు ఎందుకివ్వాలని కూడా ఆలోచించి ఉండొచ్చు. అందుకే చెన్నై ముందే రైనాను వదిలేసింది. దీంతో వేలంలోనూ కన్నెత్తి చూడలేదు. అయితే, అన్నిటికన్నా మరింత బాధ కలిగించే విషయం.. ఇతర జట్లు సైతం ఈ టాప్‌ బ్యాట్స్‌మన్‌ను కొనుగోలు చేయకపోవడం. దీంతో ఇక రైనా కెరీర్‌ పూర్తిగా ముగిసినట్లేనని అర్థమవుతోంది. ఇక భవిష్యత్తులో అతడు ఏ నిర్ణయం తీసుకుంటాడనేది ఆసక్తిగా మారింది.