Begin typing your search above and press return to search.

పుడింగ్ అండ్ మింక్ పబ్ కేసులో కీలక పరిణామం

By:  Tupaki Desk   |   14 April 2022 10:43 AM GMT
పుడింగ్ అండ్ మింక్ పబ్ కేసులో కీలక పరిణామం
X
హైదరాబాద్లో సంచలనం సృష్టించిన పుడింగ్ అండ్ మింక్ పబ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.. గత శనివారం రాత్రి ఈ పబ్ పై దాడి చేసిన పోలీసులు అనేక కోణాల్లో విచారిస్తున్నారు. ఇక్కడ డ్రగ్స్ వినియోగించారన్న అభియోగంతో పోలీసులు అర్ధరాత్రి దాడి చేశారు. దాదాపు 150 మందిని అదుపులోకి తీసుకొని వదిలేశారు. కానీ వారి దగ్గర నుంచి వివరాలు తీసుకొని వదిలేశారు.

పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తుండడంతో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 20 మంది డ్రగ్స్ వినియోగించారని, అందుకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయని పోలీసులు చెబుతున్నట్లు తెలుస్తోంది. పార్టీపై ముందుగా మేనేజర్ అనిల్ ను బంజారాహిల్స్ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఎంతకాలంగా సరఫరా చేస్తున్నారనే దానిపై పోలీసులు ఆరాతీస్తున్నారు.

ఇక పబ్ లో దొరికిన కొకైన్ ను ఎవరు సరఫరా చేశారని ప్రశ్నిస్తున్నారు. ఆ పెడ్లర్ ఎవరనే దానిపై పోలీసులు ప్రశ్నిస్తున్నారు. సేకరించిన ఆధారాలు, వీడియో గ్రఫీని ముందుపెట్టి మరీ పోలీసులు విచారిస్తున్నారు. ప్రస్తుతం మేనేజర్ అనిల్ విచారణ తర్వాత అభిషేక్ ను పోలీసులు విచారించనున్నారు.

ఇక తమ పబ్ పై దాడి చేయకుండా కొందరికి లంచాలు కూడా ఇచ్చారని పోలీసులు గుర్తించినట్లు సమాచారం.పబ్ కు వచ్చిన ఆదాయంలో వాటా రూపంలో వారికి చెల్లించి అక్రమంగా పబ్ నిర్వహించారని తెలుస్తోంది.

ఇక పబ్ నిర్వాహకుల్లో ఒకరైన అభిషేక్ కు గోవాతో సంబంధాలున్నాయని పోలీసులు అంటున్నారు. ఆయనకు ముంబై వ్యక్తులతో సంబంధాలున్నాయని, వారి ద్వారానే ఈ పబ్ కు డ్రగ్స్ తీసుకొచ్చారని అంటున్నారు.

ఈ పబ్ కు వచ్చిన 20 మంది డ్రగ్స్ తీసుకొని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే వారికి పరీక్షలు చేసిన తరువాత అసలు విషయం చెబుతామని అంటున్నారు.