Begin typing your search above and press return to search.

ఇంటర్ మంటలు చల్లారలేదు..తెలంగాణలో ఆరని వేడి!

By:  Tupaki Desk   |   2 May 2019 2:30 PM GMT
ఇంటర్ మంటలు చల్లారలేదు..తెలంగాణలో ఆరని వేడి!
X
ఇంటర్మీడియట్ ఫలితాల వెల్లడిలో చోటు చేసుకున్న తప్పుల వ్యవహారంపై తెలంగాణ లో రాజకీయ పార్టీల ఆందోళనలు కొనసాగుతూ ఉన్నాయి. గురువారం రోజున తెలంగాణలో ప్రతిపక్ష పార్టీలు భారీ స్థాయిలో నిరసన, ఆందోళన కార్యక్రమాలను నిర్వహించాయి. కొంతమంది నేతలు నిరాహార దీక్షలకు దిగారు. ఇంటర్మీడియట్ బోర్డు పై , గ్లోబరీనా సంస్థపై చర్యలను కోరుతూ తెలంగాణలోని రాజకీయ పార్టీల వాళ్లు వివిధ కార్యక్రమాలను హోరెత్తించారు.

ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ బంద్ కే పిలుపును ఇవ్వగా దానికి జనస్పందన కనిపించలేదు. అయితే బీజేపీ నేతలు తెలంగాణ వ్యాప్తంగా నిరసన దీక్షలు అయితే చేశారు. ఇంటర్మీడియట్ బోర్డు తప్పిదాల వ్యవహారంలో ప్రభుత్వం తీరును తప్పు పడుతూ.. ఆ పార్టీ నేతలు రాష్ట్రంలోని ప్రధాన నగరాల కూడళ్లలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు.

భారతీయ జనతా పార్టీ అనుబంధ విద్యార్థి విభాగం ధర్నాలను చేపట్టి నిరసన కార్యక్రమాలను నిర్వహించింది. మరోవైపు భారతీయ జనతా పార్టీ నేత లక్ష్మణ్ దీక్ష నాలుగో రోజు కూడా ఆసుపత్రిలో కొనసాగుతోంది.

ఆయన సోమవారం రోజున దీక్షను చేపట్టిన సంగతి తెలిసిందే. పోలీసులు ఆయనను ఆసుపత్రికి తరలించినా అక్కడ ఆయన దీక్ష కొనసాగుతూ ఉంది.ఆయన దీక్షకు బీజేపీ నేతలు పలువురు సంఘీభావం తెలిపారు. ఇలా భారతీయ జనతా పార్టీ వాళ్లు ఈ అంశం మీద గట్టిగానే పోరాడుతూ ఉన్నారు.

మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ అంశంపై రోడ్డు ఎక్కింది. తమ కార్యాలయం వద్ద ఆ పార్టీ నేతలు నలభై ఎనిమిది గంటల దీక్షకు దిగారు. యూత్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో - రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు చేపట్టారు. వీటిని ఆ పార్టీ యూత్ లీడర్లు - ముఖ్య నేతలు సమీక్షించారు.

ఇలా రాజకీయ పార్టీలు తెలంగాణలో ఇంటర్ మంటలను చల్లారనీయకుండా చూస్తున్నాయి. వేడిని ఆరనీయకుండా కేసీఆర్ ను ఇరకాటంలో పెట్టేందుకు అవి గట్టిగా ప్రయత్నాలు సాగిస్తూ ఉన్నాయి.