Begin typing your search above and press return to search.

తెలుగు న్యూస్ చానళ్ల మధ్య ముదిరిన వార్

By:  Tupaki Desk   |   29 March 2022 2:30 PM GMT
తెలుగు న్యూస్ చానళ్ల మధ్య ముదిరిన వార్
X
మిగిలిన భాషల న్యూస్ చానళ్లలో లేని అనారోగ్య వాతావరణం ఇప్పుడు తెలుగు న్యూస్ చానళ్ల మధ్యన చోటు చేసుకున్నట్లుగా చెబుతున్నారు. గతంలో ఎప్పుడూ లేని రీతిలో సాగుతున్న మీడియా వార్ లో సరికొత్త సంప్రదాయాలకు తెర తీస్తున్నారని.. ఈ తీరు మీడియా మీద ఉండే గౌరవ మర్యాదల్ని మంట కలిపేలా మారుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కరోనా కారణంగా టీవీ చానళ్లకు రేటింగులు ఇవ్వటం.. ప్రతి వారం వెలువడే ఈ రేటింగ్ లతో సదరు చానల్ పరిస్థితి ఏమిటి? నెంబరు వన్ ఎవరు? అంటూ అంకెల గేమ్ ఉండేది.

కరోనా కారణంగా అలాంటి మదింపును తాత్కాలికంగా ఆపేశారు. బార్క్ ఇచ్చే రేటింగ్ మీదనే బోలెడన్ని విమర్శలు ఉన్నాయి. చానళ్ల ప్రజాదరణ లెక్క శాస్త్రీయంగా సాగటం లేదన్న మాట పెద్ద ఎత్తున వినిపిస్తోంది. రేటింగ్ ను మదింపు చేసే విధానంలో చాలానే మార్పులు తీసుకురావాలన్న అభిప్రాయానికి బలం పెరుగుతోంది.అయితే.. అదంత తేలిక కాకపోవటంతో.. ప్రస్తుతం అమలవుతున్న విధానాన్ని అందరూ ఫాలో అవుతున్నారు.

బార్క్ ఇచ్చే రేటింగ్ ఆధారంగానే యాడ్ రెవెన్యూ ఆదారపడి ఉండటం.. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీడియా సంస్థలకు ప్రాణవాయువుగా మారిన ప్రకటనల ఆదాయం మీదనే చాలా సంస్థల బండిని నడిపిస్తున్నాయి. ఇటీవల బార్క్ ప్రకటించిన రేటింగ్స్ తెలుగు న్యూస్ చానళ్ల మధ్య కొత్త పోరుకు తెర తీశాయి. సుదీర్ఘకాలంగా తెలుగు న్యూస్ చానళ్లలో నెంబరు వన్ స్థానంలో ఉన్న చానల్ అకస్మాత్తుగా నెంబర్ వన్ నుంచి కిందకు దిగిపోవటం.. అనూహ్యంగా మరో సంస్థ నెంబర్ వన్ గా మారటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

కరోనా నేపథ్యంలో బార్క్ రేటింగ్స్ లేని నేపథ్యంలో ఎవరికి వారు తమ చానల్ నెంబర్ వన్ అంటూ ప్రచారాన్ని సాగించటం తెలిసిందే. ఇప్పుడేమో రేటింగ్స్ రావటంతో నెంబర్ గేమ్ లో పడిన చానళ్లకు పాలుపోని పరిస్థితి. దీంతో.. వెను వెంటనే తమ స్థానాన్ని కాపాడుకోవటానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు మొదలెట్టాయి. మారిన రేటింగ్స్ తో నిజంగానే తమ చానల్ కు ప్రజాదరణ తగ్గిపోయి. ప్రత్యర్థి చానల్ ప్రజాదరణ పెరిగిందా? తాము ఎక్కడ వెనుకబడిపోయాయి? లాంటి అంశాలపై మరింత ఫోకస్ పెంచినట్లుగా చెబుతున్నారు.

చానళ్ల మధ్య నడుస్తున్న పోటీకి సంబంధించి సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు వీరి మధ్య ప్రచారమంటను మరింతగా మండిస్తున్నాయి. సోషల్ మీడియాలో ముదురుతున్న చానళ్ల ప్రచార పోరు శ్రుతి మించి రాగాన పడటమే కాదు.. తమ చానల్ పరువును దెబ్బ తీసేలా ప్రచారం సాగుతోందంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకునే వరకు విషయాలు వెళుతున్నట్లుగా చెబుతున్నారు.

ఇప్పటికైనా తెలుగు న్యూస్ చానళ్లు కాస్తంత సంయమనం పాటించకుంటే అందరి ముందు పలుచన కావటమే అవుతుందన్న మాట వినిపిస్తోంది. అందుకే.. ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరించకుండా కాస్తంత నియంత్రణ పాటిస్తే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి.. ఈ విషయం తెలుగున్యూస్ చానళ్ల యాజమాన్యాలకు ఎప్పుడు అర్థమవుతుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.