Begin typing your search above and press return to search.

ఏపీ నిఘా సర్వే ఫలితాలు ఇవేనా?

By:  Tupaki Desk   |   14 April 2019 8:49 AM GMT
ఏపీ నిఘా సర్వే ఫలితాలు ఇవేనా?
X
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న వేళ.. ఎగ్జిట్ పోల్స్ మీద ఎన్నికల సంఘం పరిమితులు విధించింది. అయినప్పటికి పలు ప్రైవేటు సంస్థలు.. వివిధ మీడియా సంస్థలు చేసినట్లుగా చెబుతున్న సర్వేలు సోషల్ మీడియాలో రోటేట్ అవుతున్నాయి. ప్రధాన మీడియా స్రవంతి మీద కనిపించని ఈ సర్వే ఫలితాలు అదే పనిగా వైరల్ అవుతున్నాయి.

తాజాగా అలాంటిదే ఒక సర్వే ఫలితం వైరల్ గా మారింది. ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికలకు సంబంధించి ఏపీ నిఘా విభాగం ఒక సర్వే నిర్వహించినట్లుగా చెబుతున్నారు. దీనికి సంబంధించిన పోస్ట్ ఒకటి వైరల్ గా మారింది. అయితే.. ఈ రిపోర్ట్ విశ్వసనీయత మీద సందేహాలు ఉన్నప్పటికీ.. పలువురు ఈ సర్వే రిపోర్ట్ ను షేర్ చేయటం గమనార్హం.

ఏపీ నిఘా విభాగానికి సంబంధించిన ఎగ్జిట్ పోల్ ఫలితాన్ని చూస్తే.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 117 స్థానాలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక.. ఏపీ అధికారపక్షమైన టీడీపీకి 43 స్థానాలు వచ్చే వీలుందని సదరు రిపోర్ట్ చెబుతోంది. ఇక 13 స్థానాల్లో టీడీపీ.. జగన్ పార్టీకి మధ్య పోటీ తీవ్రంగా ఉంది. ఏపీ ఎన్నికల ఫలితాల్లో తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని చెబుతున్న జనసేన రెండు సీట్లకు మించి గెలిచే అవకాశం లేదంటున్నారు.

టీడీపీ.. జగన్ పార్టీకి మధ్య పోటాపోటీగా ఉన్న 13 స్థానాలు టీడీపీ సొంతమైనా.. ఆ పార్టీకి వచ్చే సీట్ల సంఖ్య 56 మాత్రమేనని లెక్కలు వేస్తున్నారు. ఇక.. కాంగ్రెస్.. బీజేపీలు ఖాతాలు తెరిచే అవకాశం లేదంటున్నారు. ఏపీ నిఘా విభాగం సర్వే చేసినట్లు చెబుతున్న ఈ రిపోర్ట్ విశ్వసనీయత ఎంతన్నది చెప్పలేకున్నా.. సోషల్ మీడియాలో మాత్రం పెద్ద ఎత్తున వైరల్ గా మారింది.