Begin typing your search above and press return to search.

హుజూరాబాద్ పై ఇంటెలిజెన్స్ ‘ఐ’

By:  Tupaki Desk   |   29 Sep 2021 9:30 AM GMT
హుజూరాబాద్ పై ఇంటెలిజెన్స్ ‘ఐ’
X
తెలంగాణలో హుజూరాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల కావడంతో పార్టీలన్నీ అలెర్ట్ అయ్యాయి. మంగళవారం ఎలక్షన్ కమిషన్ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేయడంతో ఇక్కడి రాజకీయ నాయకులు ఉప పోరుకు సిద్ధమవుతున్నారు. అక్టోబర్ 30న ఎన్నిక ఉన్నట్లు ప్రకటించడంతో ఆ మేరకు రాజకీయ పార్టీలు పోరుకు సన్నద్ధమవుతున్నాయి. మాజీ మంత్రి ఈటల రాజీనామా చేసిన తెల్లారి నుంచే హుజూరాబాద్ లో రాజకీయం వేడెక్కింది. ఈటల బీజేపీలో చేరడంతో అధికార టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా సాగుతోంది. మరోవైపు కాంగ్రెస్ కూడా తన పట్టును నిలపుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈక్రమంలో అధికార టీఆర్ఎస్ ప్రభుత్వ ఇంటెలిజెన్స్ ను రంగంలోకి దించింది. ఇక ఆయా పార్టీలకు చెందిన వారు ప్రైవేటు ఇంటెలిజెన్స్ వర్గాలు ఇప్పటికే సర్వేను చేపట్టాయి. తాజాగా షెడ్యూల్ విడుదల కావడంతో మరోసారి ఈ విభాగం రంగంలోకి దిగనుంది.

హుజూరాబాద్ ప్రజలను ఆకట్టకునేందుకు గత నెల రోజులగా టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లో పోటా పోటీగా ప్రచారం చేస్తున్నాయి. వాస్తవానికి ఆగస్టులోనే ఉప ఎన్నిక ఉంటుందని భావించి టీఆర్ఎస్ ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రత్యేక పథకాలు అమలు చేస్తూ ప్రజలను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో దళిత బంధు పథకాన్ని ప్రారంభించి హుజూరాబాద్ ను ఫైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. అలాగే మిగతా వారందరికీ దళిత బంధు ఫలాలను అందిస్తామని చెబుతోంది. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్ సైతం నియోజకవర్గంలో పర్యటించి దళిత బంధు పథకాన్ని ప్రారంభించారు.

ఆ తరువాత మంత్రి హరీశ్ రావుకు నియోజకవర్గ బాధ్యతలను అప్పగించడంతో ఇక్కడే మకాం వేశారు. రోజుకో కుల సంఘ, ఇతర వర్గాల వారితో సమావేశాలను నిర్వహిస్తూ ఆకట్టుకుంటున్నారు. ఇక సంక్షేమ పథకాలను నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేకంగా అందిస్తున్నారు. ఇతర జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు సహా అధికార పార్టీ నాయకులంతా నియోజకవర్గంలోనే పర్యటిస్తున్నారు. మొత్తంగా టీఆర్ఎస్ హుజూరాబాద్ సీటును ఎట్టి పరిస్థితుల్లో పోగొట్టుకోకుండా ప్రత్యేక వ్యూహం రచిస్తున్నారు.

మంత్రి పదవి నుంచి బర్త్ రఫ్ కావడంతో ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆ తరువాత బీజేపీలో చేరారు. సెంట్రల్ లో బీజేపీ అధికారంలో ఉండడంతో కేంద్ర, రాష్ట్ర నాయకులు ఈటలకు మద్దతు ఇస్తున్నారు. అంతేకాకుండా కేంద్రంలోని కీలక నాయకులు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హైదరాబాద్ నుంచి హుజూరాబాద్ వరకు పాదయాత్ర చేపట్టి కొనసాగిస్తున్నారు. ఉప ఎన్నిక సమయానికి హుజూరాబాద్ వరకు వచ్చేలా ప్లాన్ వేసుకున్నారు. ఈటల రాజేందర్ సైతం అంతకుముందు పాదయాత్ర చేసి ప్రజల్లోకి వెళ్లారు. మరోవైపు టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను వివరిస్తున్నారు.

ఇక కొత్తగా నియామకమైన పాలక వర్గం కొత్త జోష్ తో ఉంది. కొత్త పాలకవర్గానికి హుజూరాబాద్ ఉప ఎన్నిక సవాల్ గా మారనుంది. దీంతో ఇప్పటికే పార్టీకి చెందిన సీనియర్ నాయకులు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. గెలుపోటముల గురించి ఆలోచించకుండా పార్టీ పటిష్టత కోసం కాంగ్రెస్ కార్యకర్తలను ఉత్తేజపరుస్తున్నారు. కాంగ్రెస్ కీలక నాయకుడు రాహుల్ గాంధీని సైతం హుజూరాబాద్ కు రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

హుజూరాబాద్ ఎన్నిక తేది ఖరారు కావడంతో ఆయా పార్టీలో తమ ఇంటెలిజెన్స్ బృందాలను రంగంలోకి దింపాయి. టీఆర్ఎస్ పార్టీకి చెందిన వారు ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా..? ప్రభుత్వం గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు..? అనే ప్రశ్నలను అడుగుతున్నారు. బీజేపీకి చెందిన వారు కేంద్ర ప్రభుత్వ పథకాలు ఎంతమంది లబ్ధి పొందుతున్నారు...? బీజేపీ ప్రభుత్వంపై ప్రజలు ఏమనుకుంటున్నారు..? అని అడుగుతున్నారు. కాంగ్రెస్ ఇంటెలిజెన్స్ విభాగం ప్రభుత్వం పనితీరుపై ఎంతమంది అసంతృప్తితో ఉన్నారు..? కాంగ్రెస్ లీడర్ కు ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది..? అనే ప్రశ్నలను అడుగుతున్నారు.