Begin typing your search above and press return to search.

అస‌లైన సైకో సూదిగాడు దొరికాడు

By:  Tupaki Desk   |   26 Sep 2015 9:37 AM GMT
అస‌లైన సైకో సూదిగాడు దొరికాడు
X
గ‌త కొద్ది రోజులుగా రెండు తెలుగు రాష్ర్టాల ప్ర‌జ‌లు సైకో సూదిగాడి పేరు చెపితేనే భ‌య‌ప‌డిపోతున్నారు. వాడు ఎవ‌డో ..ఎలా ఉంటాడో...ఎక్క‌డ నుంచి వ‌స్తాడో తెలియ‌డం లేదు. మ‌హిళ‌లు - యువ‌తులు - విద్యార్థినిలు - పురుషులు అని చూడ‌కుండా సిరంజీతో గుచ్చి పారిపోతున్నాడు. వీడి భారీన ప‌డిన ఇద్ద‌రు మ‌హిళ‌లు తీవ్ర అనారోగ్యానికి కూడా గుర‌య్యారు. ఇప్ప‌టి వ‌ర‌కు వీడి జాడ గురించి కూడా తెలియ‌లేదు. అయితే శనివారం భాగ్య‌న‌గ‌ర్ ఎక్స్‌ ప్రెస్‌ లో ఓ సైకో సూదిగాడు వీరంగం సృష్టించాడు.

బ‌ల్లార్షా నుంచి సికింద్రాబాద్ వ‌స్తున్న భాగ్య‌న‌గ‌ర్ ఎక్స్‌ ప్రెస్‌ లో ఒక సూదిగాడు క‌నిపించిన వ్య‌క్తిన‌ల్లా సిరంజీతో పొడుచుకుంటూ వెళ్లిపోయాడు. అయితే ప్ర‌యాణికులు ఎట్ట‌కేల‌కు అత‌డిని ప‌ట్టుకుని చిత‌క‌బాది సికింద్రాబాద్‌ లో జీఆర్పీ పోలీసుల‌కు అప్ప‌గించారు. ఈ సంఘ‌ట‌న పూర్తి వివ‌రాలు ఇలా ఉన్నాయి. వ‌రంగ‌ల్ జిల్లా స్టేష‌న్ ఘ‌న్‌ పూర్‌ లో ర‌వికుమార్ అనే వ్య‌క్తి భాగ్య‌న‌గ‌ర్ ఎక్స్‌ ప్రెస్ ఎక్కాడు. రైలు క‌దిలిన వెంట‌నే అత‌డు క‌నిపించిన ప్ర‌యాణికులంద‌రిని సూదితో గుచ్చి గాయ‌ప‌రిచాడు.

ప్ర‌యాణికులంద‌రు మూకుమ్మ‌డిగా అత‌డిపై దాడి చేసి చిత‌క‌బాదారు. అత‌డిని జీఆర్ పీ పోలీసుల‌కు అప్ప‌గించారు. అతడి వద్ద నుంచి పోలీసులు రెండు సిరంజీలు, రెండు సిమ్ కార్డుల‌తో పాటు ఒక మందు సీసా కూడా స్వాధీనం చేసుకున్నారు. గంట‌పాటు అత‌డిని విచారించిన త‌ర్వాత కుటుంబ స‌భ్యుల‌కు స‌మాచారం ఇచ్చారు. అత‌డి మాన‌సిక స్థితి బాగోలేద‌ని పోలీసులు చెపుతున్నారు. రెండు నెల‌ల నుంచి ఇంటివ‌ద్ద కూడా ఉండ‌డంలేద‌ని కుటుంబ స‌భ్యులు చెప్పిన‌ట్టు తెలుస్తోంది.

ర‌వికుమార్ కుటుంబ స‌భ్యుల‌ను పూర్తిస్థాయిలో విచారించ‌నున్నారు. గ‌తంలో జ‌రిగిన సైకో దాడుల‌కు ఇత‌డికి ఏమైనా సంబంధం ఉందా అన్న కోణంలో పోలీసులు విచార‌ణ చేస్తున్నారు. నిన్న‌టి వ‌ర‌కు రెండు తెలుగు రాష్ర్టాల్లోను సైకో సూదిగాడు వార్త‌లు పెద్ద క‌ల‌క‌లం రేపినా ఎవ్వ‌రు డైరెక్టుగా సిరంజీల‌తో ప‌ట్టుబ‌డ‌లేదు. ఇప్పుడు ర‌వికుమార్ ప్ర‌యాణికుల‌పై దాడి చేసి సిరంజీల‌తో స‌హా ప‌ట్టుబ‌డ‌డం పెద్ద సంచ‌ల‌నంగా మారింది.