Begin typing your search above and press return to search.

జనాలను ఆపేస్తున్న పోలండ్ సైన్యం

By:  Tupaki Desk   |   27 Feb 2022 8:23 AM GMT
జనాలను ఆపేస్తున్న పోలండ్ సైన్యం
X
ఉక్రెయిన్ నుండి బయటపడేందుకు మన వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు అంతగా సక్సెస్ కావటంలేదు. ఎందుకంటే ఉక్రెయిన్లో చిక్కుకున్న సుమారు 25 వేలమందిని పోలండ్, హంగేరి దేశాల్లోకి రమ్మని భారత రాయబార కార్యాలయం అధికారులు చెప్పారు. అధికారులు చాలా సింపులుగా చెప్పేశారు కానీ రావటం ఎలాగ ? అన్నదే కీలకమైన పాయింట్. ఇప్పటికే పోలండ్, హంగేరి సరిహద్దులకు దగ్గరలో ఉన్న కాలేజీల్లో చదువుతున్న విద్యార్ధులు, నివసముంటున్న వాళ్ళు ఒకే ఏదో పద్దతిలో చేరుకుంటారు. మరి మిగిలిన వాళ్ళ మాటేమిటి ?

ఉక్రెయిన్ సెంటర్ పాయింట్ కు పోలండ్ కు మధ్య దూరం 800 కిలోమీటర్లు. యుద్ధ సమయంలో రోడ్లపైన మామూలు జనాలను బయటకు రావద్దని ఉక్రెయిన్ ప్రభుత్వం ఒకవైపు వార్నింగులిస్తోంది. ఇంకోవైపు రష్యా సైన్యాలు బాంబులు, క్షిపణులతో ధ్వంసం చేస్తోంది. ఈ పరిస్ధితుల్లో మామూలు జనాలు రోడ్లపైకి ఎలా రాగలుగుతారు ? వచ్చిన వందల కిలోమీటర్లు ఎలా ప్రయాణం చేస్తారు. ఎందుకంటే వాహనాలు ఏవీ తిరగటంలేదు. పబ్లిక్ ట్రాన్స్ పోర్టును ప్రభుత్వమే రద్దుచేసేసింది.

ఇక సరిహద్దు ప్రాంతాల్లో ఉంటున్న జనాలు చచ్చీచెడి పోలండ్ దగ్గరకు చేరుకోవాలని ప్రయాణం చేస్తున్నా సాధ్యం కావటంలేదు. ఎందుకంటే పోలిండ్ దేశపు సైన్యం అప్రమత్తమైపోయి ఉక్రెయిన్ నుండి వస్తున్న జనాలను సరిహద్దులకు 10 కిలోమీటర్ల దూరంలోనే ఆపేస్తోంది. మరి ఈ 10 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించాలంటే పోలండ్ అనుమతి ఉండాల్సిందే. రాత్రుళ్ళు మైనస్ డిగ్రీల చలిలో దొంగతనంగా కొందరు నడుచుకుంటు పోలండ్ లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో సరిహద్దులో సమస్యలు పెరిగిపోతున్నాయి.

యుద్ధం మొదలైన వెంటనే ముందుజాగ్రత్తగా పోలండ్ సరిహద్దుల్లోకి చేరుకున్న భారతీయులే ఇపుడు స్వదేశానికి రాగలుగుతున్నారు. సరిహద్దుల్లో ఉన్న భారతీయులందరినీ వెంటనే పోలండ్ లోకి అనుమతించేట్లుగా కేంద్రప్రభుత్వం పోలండ్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతోంది. దీని ఫలితంగానే నాలుగు ప్రత్యేక విమానాల్లో కొందరైనా తిరిగి దేశానికి రాగలిగారు. మరి అక్కడే ఉన్న వేలాదిమందిని కేంద్రప్రభుత్వం ఎప్పటకి వెనక్కు తీసుకురాగలుతుందో చెప్పలేకపోతున్నారు.