Begin typing your search above and press return to search.

ప్రాణం పోతోంది.. ఆశ్రయమివ్వండి ప్లీజ్

By:  Tupaki Desk   |   15 May 2019 5:17 AM GMT
ప్రాణం పోతోంది.. ఆశ్రయమివ్వండి ప్లీజ్
X
కాలం మారింది.. సమాజం మారింది. మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త కొత్త వ్యాధులు పుట్టుకొస్తున్నాయి. అందుకే ప్రాణాలకు ఈ సమాజంలో గ్యారెంటీ లేకుండా పోతోంది. ఉన్నత చదువుల కోసమని దేశం కానీ దేశం వెళ్లిన యువతికి అరుదైన వ్యాధి సోకింది. దానికి ఇండియాలో చికిత్సే లేదు.. ఆమె ఉంటున్న బ్రిటన్ లో ఉంది. కానీ ఇప్పుడు ఆ దేశం కూడా ఆమెను బహిష్కరిస్తోంది.. దీంతో ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఆమె పోరాడుతోంది.

ఇండియాకు చెందిన భవాని ఈస్పతి ఉన్నత విద్యా కోసం బ్రిటన్ వెళ్లింది. కొన్ని రోజులకు ఆమెకు అరుదైన జీర్ణ వాహిక వ్యాధి సోకింది. ఈ వ్యాధికి ఇండియాలో చికిత్స లేకపోవడంతో ఆమె బ్రిటన్లోనే చికిత్స తీసుకుంటోంది. అయితే స్టూడెంట్ వీసాపై వెళ్లిన ఆమె గడువు తీరిపోయింది. దీంతో దేశం విడిచి వెళ్లాలని బ్రిటన్ ఇమిగ్రేషన్ అధికారులు అల్టీమేటం జారీ చేశారు. లేదంటే దేశం నుంచి బహిష్కరిస్తామని స్పష్టం చేశారు.

అయితే తాను బతకాలంటే బ్రిటన్ లోనే ఉండాలని.. తనకు అనుమతించాలని భవానీ, ఆమెకు కాబోయే భర్త మార్టిన్ మాంగ్లెర్ తో బ్రిటన్ ప్రభుత్వాన్ని కోరారు. డిసెంబర్ లో దరఖాస్తు కూడా చేసుకున్నారు. అయినా ఆమెకు అనుమతి రాలేదు..

కాగా ఆమెకు చికిత్స చేస్తున్నడాక్టర్లు ఆమె అన్నవాహికకు ఆపరేషన్ చేయగా కోమాలోకి వెళ్లింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. మరో సారి ప్రేగుకు ఆపరేషన్ చేయాలని.. ఇప్పుడు దేశం విడిచి వెళితే బతకడం కష్టమని వైద్యులు స్పష్టం చేస్తున్నారట.. ఈ నేపథ్యంలోనే భవానీ ఆరోగ్యం దృష్ట్యా బ్రిటన్ లోనే ఉండనివ్వాలని ప్రవాస సంక్షేమ కౌన్సిల్ లీగల్ డైరెక్టర్ చాయ్ పటేల్ బ్రిటన్ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ విషయంలో భారత ప్రభుత్వం కలుగుజేసుకోవాలని విన్నవిస్తున్నాడు.