Begin typing your search above and press return to search.

300 తెలుగు విద్యార్థుల అవ‌స్థ వ‌ర్ణణాతీతం

By:  Tupaki Desk   |   19 Feb 2017 10:28 AM GMT
300 తెలుగు విద్యార్థుల అవ‌స్థ వ‌ర్ణణాతీతం
X
విదేశాల్లో మ‌న విద్యార్థులకు ఎదుర‌వుతున్న ఇక్క‌ట్ల జాబితాలో మ‌రో కొత్త కోణం. ఉన్నత చదువు కోసం న్యూజిలాండ్ వెళ్లిన తెలుగు విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. దాదాపు 300 మంది విద్యార్థులు వీసా పొందిన సమయంలో సమర్పించిన ధృవీకరణ పత్రాలు నకిలీవని ఆ దేశ ఇమ్మిగ్రేషన్ అధికారులు తేల్చారు. దీంతో వారిని భారతదేశం పంపిస్తామని న్యూజిలాండ్ ప్రభుత్వం స్పష్టంచేసింది. విద్యార్థులు విదేశాలకు వెళ్లేప్పుడు ధృవీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుంది. స్టడీ వీసాల కోసం వెళ్లే సమయంలో బ్యాంకులలో నిర్ణీత నగదు ఉందని, అందుకు విద్యార్థి రుణానికి సంబంధించి ఆధారాలను పొందుపరుచాల్సి ఉంటుంది. అయితే క‌న్స‌ల్టెన్సీల వ‌ల్ల ఇప్పుడు అవ‌స్త‌లు ప‌డుతున్నారు.

కమీషన్లకు కక్కుర్తి పడుతున్న కన్సల్టెన్సీలు అడ్డదారిలో వీసాలు ఇప్పించాయి. బ్యాంకులో డబ్బు ఉన్న ట్టు చూపించి వీసా రాగానే ఆ నగదును విత్‌డ్రా చేయడం, నకిలీ బ్యాంకు స్టేట్‌మెంట్ తయారు చేయడంతో 300 మంది విద్యార్థులు నకిలీ వీసాలని న్యూజిలాండ్ ఎమ్మిగ్రేషన్ అధికారులు గుర్తించారు. విద్యార్థులను దేశం విడిచి వెళ్లిపోమనడంతో వారు ఆందోళన చెందారు. ప్రస్తుతం వారు అక్లాండ్ చర్చి లో తలదాచుకున్నారు. వీరికి స్వచ్చంద సంస్థలు, లాయర్లు, ప్రతిపక్ష పార్టీలు మద్దతు పలుకడంతో న్యూజిలాండ్ సర్కార్ మెట్టుదిగింది. ఈ నెల 22 వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోబోమని ప్రకటించింది. విద్యార్థులను పంపిస్తే వారి భవిష్యత్తుపై ప్ర భావం చూపిస్తున్నదని యోచిస్తోంది. ఈ విషయం పై ఇమ్మిగ్రేషన్ మంత్రి మైఖేల్ హుడ్‌హౌస్ శనివారం భారత ఇమ్మిగ్రేషన్ అధికారులతో చర్చించారు.

కాగా, కొద్దిరోజుల క్రితం నిబంధ‌న‌ల పేరు చెప్తూ తమను క‌ష్టాల పాలు చేస్తున్న న్యూజిలాండ్ అధికారుల నుంచి న్యాయం చేయాలంటూ అక్క‌డ విద్య‌ను అభ్య‌సిస్తున్న విద్యార్థులు ఆంధ్ర- తెలంగాణ ప్రభుత్వాల్ని అభ్యర్థిస్తూ తమ బాధల్ని వీడియో రూపంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. చేయని నేరానికి తాము శిక్ష అనుభవిస్తున్నామని, ఈ విష‌యంలో తమకు సాయం చేయాలని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని న్యూజిలాండ్ లో విద్య అభ్య‌సిస్తున్న స‌ద‌రు విద్యార్థులు కోరారు. న్యూజిలాండ్ అధికారుల తీరుతో ఇబ్బందుల‌కు గురైన విద్యార్థుల ఆవేద‌న‌తో కూడా వీడియోలు వైర‌ల్ గా మారాయి. దీంతో సద‌రు విద్యార్థుల స‌మ‌స్య‌ల‌ను రెండు తెలుగు రాష్ర్ట ప్ర‌భుత్వాలు ప‌రిష్క‌రించాల‌ని మెజార్టీ నెటిజ‌న్లు కోరారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/