Begin typing your search above and press return to search.

హెచ్‌1బీలపై సూప‌ర్ క్లారిటీ ఇచ్చిన టెక్ దిగ్గ‌జం

By:  Tupaki Desk   |   23 Jun 2017 5:24 AM GMT
హెచ్‌1బీలపై సూప‌ర్ క్లారిటీ ఇచ్చిన టెక్ దిగ్గ‌జం
X
భార‌తీయ ఐటీ సంస్థ‌ల‌పై జ‌రుగుతున్న దుష్ప్ర‌చారానికి, అమెరికాతో తేడా వ‌స్తే మ‌న కంపెనీల‌కు భ‌విష్య‌త్ లేద‌నే అభిప్రాయానికి ఇన్ఫోసిస్ సీఈవో విశాల్ సిక్కా చెక్ పెట్టారు. మ‌న ఐటీ సంస్థలు తమ వ్యాపార కార్యకలాపాల నిర్వహణకు ప్రధానంగా హెచ్1బీ వీసాలపైనే ఆధారపడుతున్నాయని, ఇన్ఫోసిస్ - విప్రో - టీసీఎస్‌ లే ప్రతియేటా భారీ సంఖ్యలో వీసాలు దక్కించుకుంటున్నాయని అమెరికా ప్రభుత్వ అధికారి ఒకరు గతంలో ఆరోపించిన సంగ‌తి తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చాక హెచ్1బీ వీసాల నిబంధనలను మరింత కఠినతరం చేశారు. దీంతో బడా ఐటీ కంపెనీల లాభాలకు భారీ గండిపడవచ్చన్న అంచనాలున్నాయి. ఇలా విస్తృత ప్ర‌చారం సాగుతున్న నేప‌థ్యంలో సిక్కా పీటీఐతో మాట్లాడుతూ కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్లు క్లారిటీ ఇచ్చారు.

భారత ఐటీ పరిశ్రమ కేవలం అమెరికా హెచ్‌-1బీ వీసాలపైనే ఆధారపడి లేదని విశాల్ సిక్కా తేల్చి చెప్పారు. అమెరికా వీసాలపైనే ఆధారపడి భారత ఐటీ సంస్థలు వ్యాపార విధానాలను కొనసాగించట్లేదని వివరించారు. ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక చేపడుతున్న రక్షణాత్మక చర్యల నేపథ్యంలో భారత ఐటీ పరిశ్రమపై ప్రభావపు విషయమై ఆయన పీటీఐతో ప్రత్యేకంగా ముచ్చ టించారు. భారత ఐటీ సంస్థలు హెచ్‌-1బీ విధానంపై ఆధారపడి పనిచేస్తున్నాం అని చెప్పడం ఏమాత్రం సరికాదని ఆయన ఆక్షేపించారు. ``గత పదేళ్ల‌ కాలాన్ని చూసినట్లయితే.. ఏటా అమెరికా సగటున 65 వేల హెచ్‌-1బీ వీసాలను మంజూరు చేస్తూ వచ్చింది. అంటే పదేండ్లలో దాదాపు 6.50లక్షల మంది మాత్రమే అమెరికాలో మనవాళ్లు ఐటీ కొలువుల్లో ఉండాలి. కానీ.. అగ్రరాజ్యంలోని ఐటీ సంస్థల్లో ప్రస్తుతం లక్షల సంఖ్యలో మన ఉద్యోగులున్నారని అన్నారు. ఒక్క మా సంస్థలోనే దాదాపు 2లక్షల మంది పని చేస్తున్నారు`` అని తెలిపారు. తమ పోటీ సంస్థ టీసీఎస్‌లో ఈ సంఖ్య దాదాపు రెట్టింపుగానే ఉండే అవకాశం ఉందన్నా రు. ఎంతమందినైతే కొలువుల్లోకి తీసుకుంటున్నామో.. అంతే స్థాయిలో తాము అమెరికా కోసం పనిచేస్తున్నామని సిక్కా వివరించారు.

అమెరికా ఆర్థిక రంగానికి భారత ఐటీ సంస్థలు ఎంతగానో దోహదం చేస్తున్నాయని, తమ సంస్థ గత 35 ఏళ్ల‌లో అమెరికాకు మేం ఎంతో చేసినట్టుగా సిక్కా వివరించారు. ఇక ముందు కూడా చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. రానున్న రెండేళ్ల‌లో 10 వేల మందిని కొత్త ఉద్యోగులను తీసుకునే ఆలోచనలో ఉన్నట్టుగా ఆయన వెల్లడించారు. ప్రస్తుతం ఐటీలో అనేక మార్పులొచ్చాయని వివరించారు. ``ఇప్పుడు మానవుడి జీవితంలో సాఫ్ట్‌వేర్‌ సర్వసాధారణం అయిపోయింది. అందుకే కృత్రిమ మేథ (ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌), సైబర్‌ సెక్యూరిటీ, వర్చ్యుయల్‌ రియాల్టీ వంటి కొత్తకొత్త అంశాలపై కూడా ఉద్యోగులు దృష్టి పెట్టాలి. అప్పుడే విజయం సాధిస్తారు`` అని అన్నారు. కాగా, ప్రధానమంత్రి న‌రేంద్ర మోడీ వచ్చేవారం అమెరికాలో పర్యటించనున్నారు. ట్రంప్‌తో భేటీ అయినప్పుడు మోడీ.. ఐటీ సంస్థల వీసా సమస్యలను కూడా ప్రస్తావించే అవకాశం ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/