Begin typing your search above and press return to search.

చరిత్ర సృష్టించిన భారత హాకీ జట్టు.. 4 దశాబ్దాల తర్వాత పతకం !

By:  Tupaki Desk   |   5 Aug 2021 5:03 AM GMT
చరిత్ర సృష్టించిన భారత హాకీ జట్టు.. 4 దశాబ్దాల తర్వాత పతకం !
X
టోక్యో ఒలింపిక్స్‌ లో భారత హాకీ జట్టు చరిత్ర సృష్టించింది. కాంస్య పతకం కోసం జర్మనీతో జరిగిన మ్యాచ్‌ లో 5-4తో విజయం సాధించి 41 సంవత్సరాల తర్వాత దేశానికి పతకం అందించింది. తొలి నుంచి హోరాహోరీగా జరిగిన ఈ పోరులో చివరికి భారత జట్టు విజయం సాధించింది. మ్యాచ్ చివరి క్వార్టర్‌ లో ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు జరిగింది. జర్మనీ నాలుగు గోల్స్ సాధించడంతో మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. అయితే, భారత డిఫెన్స్ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శనతో జర్మనీకి మరో గోల్ దక్కకుండా జాగ్రత్తగా పడ్డారు. టోక్యోలో భారత జట్టు విజయం సాధించిన వెంటనే దేశంలో సంబరాలు మిన్నంటాయి. చారిత్రక విజయాన్ని అందించిన మన్‌ ప్రీత్ సింగ్ సేనపై ప్రశంసలు కురుస్తున్నాయి. మరోవైపు, ఓడిన జర్మనీ ఆటగాళ్లు మైదానంలోనే కుప్పకూలి విలపించగా, ఆనందంతో భారత ఆటగాళ్లు కన్నీళ్లు పెట్టారు.

మొదట జర్మనీ జట్టు దూకుడు ప్రదర్శిస్తూ.. భారత్‌ పై ఆధిపత్యం సాధిస్తున్నట్లు కనిపించింది. తొలి గోల్ జర్మనీయే సాధించింది. ఆ తర్వాత భారత ఆటగాడు సమర్ జిత్ గోల్ కొట్టి సమం చేశాడు. అనంతరం జర్మనీ జట్టు వరుసగా రెండు గోల్స్ సాధించడంతో 3-1 తేడాతో ఇండియన్ టీమ్ వెనకబడిపోయింది. ఐతే ఆ తర్వాత మనోళ్లు చెలరేగిపోయారు. వరుసగా నాలుగు గోల్స్ కొట్టారు. హార్ధిక్ సింగ్, హర్మన్‌ ప్రీత్ సింగ్, రూపిందర్ పాల్ సింగ్, సమర్ జిత్ సింగ్ గోల్ కొట్టడంతో 3-5 లీడింగ్‌ లోకి వెళ్లిపోయింది భారత్. అనంతరం జర్మనీ మరో గోల్ కొట్టినా.. 4-5 తేడాతో ఇండియా గెలిచింది. మొదటి క్వార్టర్ ముగిసే సరికి జర్మనీ 1-0 లీడింగ్‌లో ఉంది. రెండో క్వార్టర్‌లో భారత్ అద్భుతంగా పుంజుకుంది. జర్మనీ మరో 2 గోల్స్, భారత్ మూడు గోల్స్ సాధించడంతో 3-3తో స్కోర్లు సమయం అయ్యాయి.

మూడో క్వార్టర్లో భారత్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. రెండు గోల్స్ సాధించి 3-5 లీడింగ్‌ లోకి వెళ్లిపోయింది. ఐతే నాలుగో క్వార్టర్‌ లో జర్మనీ ఒక గోల్ సాధించడంతో భారత్ లీడింగ్ కాస్త తగ్గింది. ఐనా 4-5 తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో సమర్ జిత్ రెండు గోల్స్ సాధించి భాారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. హాకీలో కాంస్య పతకం గెలవడంతో ఇప్పటి వరకు మన దేశానికి మొత్తం నాలుగు పతకాలు వచ్చాయి. ఇందులో ఒక రజతం మూడు కాంస్య పతకాలు ఉన్నాయి. మొదట మీరాబాయి చాను వెయిట్ లిఫ్టింగ్‌ లో సిల్వర్ మెడల్ సాధించింది.

ఆ తర్వాత తెలుగు తేజం పీవీ సింధు.. బ్యాడ్మింటన్ మహిళ సింగిల్స్ విభాగంలో కాంస్య పతకం గెలిచి సత్తా చాటింది. వరుస ఒలింపిక్స్‌లో రెండు మెడల్స్ సాధించి చరిత్ర సృష్టించింది. బుధవారం 69 కేజీల మహిళ వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో అసోంకు చెందిన లవ్లీనా కాంస్యం గెలిచింది. ఇక ఇవాళ్టి హాకీ మ్యాచ్‌ లో జర్మనీపై విజయం సాధించి కాంస్యం గెలిచింది భారత జట్టు. ఒలింపిక్స్‌ లో భారత్ ఇప్పటి వరకు మొత్తం 12 హాకీ పతకాలు గెలుపొందగా.. జపాన్‌ లో భారత్‌ కు ఇది రెండో పతకం. టోక్యో 1964 గేమ్స్‌ లో సైతం ఫైనల్‌ లో పాక్‌ ను ఓడించి స్వర్ణం సాధించింది. ఇప్పటి వరకు ఈ విశ్వక్రీడలో ఇప్పటి వరకు భారత్‌ కు ఎనిమిది స్వర్ణాలు, ఒక రజత పతకం, మూడు కాంస్య పతకాలు వచ్చాయి.