Begin typing your search above and press return to search.

కార్గిల్ తర్వాత ఇదే పెద్ద దాడి..

By:  Tupaki Desk   |   26 Feb 2019 5:39 AM GMT
కార్గిల్ తర్వాత ఇదే పెద్ద దాడి..
X
భారత్ మరోసారి సర్జికల్ స్ట్రైక్ నిర్వహించింది. 2016లో ఉరిలోని ఆర్మీ బేస్ క్యాంప్ పై ఉగ్రవాదుల దాడులతో మొదటిసారి భారత ఆర్మీ పాకిస్తాన్ కు చొచ్చుకెళ్లి ఉగ్రవాదుల శిబిరాలను మట్టిబెట్టి వారిని చంపేసింది. ఇప్పుడు పుల్వామా దాడుల నేపథ్యంలో రెండోసారి భారత్ సర్జికల్ స్ట్రైక్ కు దిగింది. ఈ ప్రతీకార దాడుల్లో దాదాపు 12 మిరాజ్ 2000 యుద్ధ జెట్ విమానాలు పాక్ సరిహద్దుల్లోని ఉగ్రవాద శిబిరాలపై డాడి చేశాయి. దాదాపు 1000 కిలోల బాంబులతో విరుచుకుపడ్డాయి..

భారత్ సరిహద్దులకు ఆవల పాకిస్తాన్ లోని 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న భైబర్ ఫక్తూన్ ఖావా ప్రావిన్స్ లోని బాలకట్ పట్టణంలోని ఉగ్రవాద శిబిరాలను కూడా భారత వాయుసేన విమానాలు బాంబులతో నేలమట్టం చేయడం విశేషం.

అర్ధరాత్రి 3.30 గంటలకు భారత వాయుసేన విమానాలు వెయ్యికిలోల బాంబులతో జైషే మహ్మద్ తీవ్రవాద స్థావరాలపై వేశాయి. అర్థరాత్రి ఏం జరుగుతుందో ఉగ్రవాదులు తేరుకొని పారిపోయేలోపే అంతా మరణించినట్లు సమాచారం. పాకిస్తాన్ ఆర్మీ కూడా తేరుకొని బదులిచ్చేలోపే కేవలం 20 నిమిషాల్లోనే భారత యుద్ధవిమానాలు దాడులను పూర్తి చేసి వెనక్కి వచ్చేయడం విశేషంగా చెప్పవచ్చు.

భారత ప్రతీకార దాడిలో పీవోకే ఉన్న అతిపెద్ద జైషే ఉగ్రశిబిరం పూర్తిగా ధ్వంసమైందని సమాచారం. పాక్ లోని బాలాకోట్, చకోటి, ముజఫరాబాద్ లోని 3 ఉగ్రశిబిరాలు కూడా నేలమట్టం అయ్యాయని.. ఈ దాడుల్లో మొత్తం 300 మంది ఉగ్రవాదులు హతమయ్యారని సమాచారం. కార్గిల్ యుద్ధం తర్వాత భారత్ చేసిన అతి పెద్ద దాడి ఇదేనంటున్నారు.

కాగా వాయుసేన దాడికి ప్రధాని మోడీ స్వయంగా ఆదేశాలిచ్చినట్టు సమాచారం. ఈ దాడి , అనంతరం పరిణామాలపై ఈ ఉదయం నుంచి మోడీ ఉన్నత స్థాయి వర్గాలతో సమాలోచనలు జరుపుతున్నారు.యుద్ధం అనివార్యం, ఇతర ఆప్షన్లు, ఏం చేయాలనేదానిపై కేంద్రమంత్రులు, ఉన్నతాధికారులతో చర్చలు జరుపుతున్నారు.

కాగా ఉగ్రవాద దాడిలో పాల్గొన్న భారత పైలెట్లకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సహా అధికార, ప్రతిపక్షాలకు చెందిన నేతలు పైలెట్లకు సెల్యూట్ అంటూ ట్వీట్స్ చేసి అభినందిస్తున్నారు.