Begin typing your search above and press return to search.

పాక్ ఉగ్రశిబిరాలపై భారత్ మెరుపుదాడి

By:  Tupaki Desk   |   26 Feb 2019 4:20 AM GMT
పాక్ ఉగ్రశిబిరాలపై భారత్ మెరుపుదాడి
X
పాకిస్తాన్ పై భారత్ ప్రతీకారం తీర్చుకుంది. భారత సరిహద్దుల్లోని పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉంటున్న ఉగ్రవాద శిబిరాలపై భారత వాయుసేన మెరుపుదాడులకు దిగింది. అప్పట్లో భారత మిలటరీ సర్టికల్ స్ట్రైక్ ద్వారా పాకిస్తాన్ లోకి ప్రవేశించి ఉగ్రవాదులను మట్టుబెట్టిందో ఇప్పుడు అదే రీతిలో భారత వాయుసేన దాదాపు 1000 కిలోల పేలోడ్ పదార్థాలతో పాక్ లోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసింది.

ఈరోజు తెల్లవారుజామున 3.30 గంటలకు భారత వైమానిక దళానికి చెందిన 12మిరాజ్ యుద్ధవిమానాలు దాడులు చేసినట్టు సమాచారం. పీవోకేలోని జైషే మహ్మద్ ఉగ్రవాద శిబిరాలను గుర్తించి వాటిపై ఎయిర్ ఫోర్స్ విరుచుకుపడింది. జైషే మహ్మద్ కు ఇది చావుదెబ్బ అని దాదాపు 200 మంది మరణించినట్టు సమాచారం.

పుల్వామాలో భారత సైనికులపై ఉగ్రవాద దాడి తర్వాత దేశం రగిలిపోతోంది. పాక్ పై దాడులు చేయాలని ఒత్తిడి తీవ్రమైంది. దీంతో భారత సైన్యానికి స్వేచ్ఛనిస్తున్నట్టు ప్రధాని మోడీ ప్రకటించారు. ప్రతీకారం ఖాయమనే అంచనాలు వచ్చాయి. ఇప్పుడు భారత ఎయిర్ ఫోర్స్ ఆధ్వర్యంలో మరో సర్జికల్ స్ట్రైక్ జరగడం విశేషం.

అయితే ఈ వార్తను భారత ప్రభుత్వం అధికారికంగా వెల్లడించలేదు. పాకిస్తాన్ ఆర్మీ అధికారి మాత్రం ట్వీట్ చేశారు. భారత వాయుసేన పాకిస్తాన్ గగనతలంలోకి వచ్చిందని.. తాము వాటిని తరిమికొట్టామని ట్విట్టర్ లో పేర్కొన్నారు. దీన్ని బట్టి పాకిస్తాన్ పై భారత్ మెరుపుదాడి చేసిందని అర్థమవుతోంది. దీనికి సంబంధించిన విజువల్స్ కూడా బయటకు వచ్చాయి.