Begin typing your search above and press return to search.

సఫారీలను చుట్టేసిన టీమిండియా

By:  Tupaki Desk   |   29 Dec 2021 3:28 AM GMT
సఫారీలను చుట్టేసిన టీమిండియా
X
బహుశా తొలిసారి అనుకుంటా...? సఫారీ గడ్డపై టీమిండియా తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ లోనే పట్టుబిగించండం... తొలుత ఓపెనర్ మయాంక్ అగర్వాల్ చక్కటి అర్ధశతకం, కేఎల్ రాహుల్ అద్వితీయ శతకం.. అజింక్య రహానే కళాత్మక ఇన్నింగ్స్ తో 327 పరుగుల మోస్తరు స్కోరు చేసిన భారత్.. బౌలింగ్ లో మరింత చెలరేగింది. దక్షిణాఫ్రికాను 197 పరుగులకే ఆలౌట్ చేసింది. సీనియర్ పేసర్ మొహమ్మద్ షమీ (5/44) చక్కగా రాణించాడు. వరుసగా రెండోసారి దక్షిణాఫ్రికా గడ్డపై 5 వికెట్ల ప్రదర్శన చేశాడు. 2018 దక్షిణాఫ్రికా పర్యటనలో వాండరర్స్ స్టేడియంలో జరిగిన చివరి, మూడో టెస్టులో షమీ ఐదు వికెట్లు పడగొట్టి జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు.

పేలవంగా దక్షిణాఫ్రికా బ్యాటింగ్

మిడిలార్డర్ బ్యాట్స్ మన్ బవుమా (52) మినహా దక్షిణాఫ్రికా బ్యాట్స్ మన్ ఎవరూ నిలకడగా ఆడలేకపోయారు. వికెట్ కీపర్ డికాక్ (34) కాసేపు అతడికి తోడుగా నిలిచాడు. భారత బౌలర్లలో బుమ్రా (2/16), సిరాజ్ (1/45), శార్దూల్ (2/51) కీలక సమయాల్లో వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిని నిలదొక్కుకోనీయకుండా చేశారు. కెప్టెన్, ఓపెనర్ డీన్ ఎల్గర్ (1)ను తొలి ఓవర్లోనే బుమ్రా అద్భుత బంతితో ఔట్ చేశాడు. మార్క్ర్ క్రమ్ (13), కీగన్ పీటర్సన్ (15), డసెన్ (3) ఎక్కువసేపు నిలవలేదు. రబడ(25), జనసెన్ (19) కాసేపు ప్రతిఘటించారు. 130 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (4) వికెట్ కోల్పోయి 16 పరుగులు చేసింది. శార్దుల్
(4 బ్యాటింగ్) నైట్ వాచ్ మన్ గా వచ్చాడు. రాహుల్ (5 బ్యాటింగ్).. మిగతా బ్యాట్స్ మన్ బుధవారం ఆధిక్యాన్ని ఎక్కడకు తీసుకెళ్తారో చూడాలి.

మన చేతుల్లోకి వచ్చేసిట్టే?

ఇప్పటికే దాదాపు 150 పరుగుల ఆధిక్యం.. రెండు రోజుల ఆట మిగిలి ఉంది. పుజారా, కోహ్లి, రహానే, పంత్ బ్యాటింగ్ కు దిగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో భారత్ బుధవారం టీ విరామం తర్వాత మరో గంట వరకు ఆడినా ఆధిక్యం 350కు చేరొచ్చు. అనంతరం ఇన్నింగ్స్ డిక్లేర్ చేస్తే సఫారీల ముందు భారీ లక్ష్యం ఉంటుంది. నాలుగో రోజు బుధవారమే ఒకటీ, రెండు వికెట్లు పడగొడితే టెస్టు మ్యాచ్ టీమిండియా చేతుల్లోకి వచ్చేసినట్టే. అలాకాకుండా.. టీమిండియా 150-200కు ఆలౌటైనా మొగ్గు మనవైపే ఉంటుంది. భారత బౌలర్ల జోరు చూస్తుంటే.. దక్షిణాఫ్రికా ఈ మాత్రం ఆధిక్యాన్ని అయినా ఛేదించడం కష్టమే.

అదే జరిగితే చరిత్రే...

30 ఏళ్లుగా ఏడుసార్లు దక్షిణాఫ్రికాలో పర్యటించిన భారత జట్టు ఏనాడూ సిరీస్ ను గెలుపుతో ప్రారంభించలేదు. 7 సిరీస్ ల్లో 20 టెస్టుల్లో పది ఓడిపోయింది. మూడింటిలో మాత్రమే గెలిచింది. 2010-11 సిరీస్ ను డ్రా (1-1) చేసుకోవడమే ఇప్పటివరకు దక్షిణాఫ్రికాలో భారత అత్యుత్తమ ప్రదర్శన. అయితే, ఈసారి తొలి టెస్టులోనే విజయం సాధించేలా కనిపిస్తోంది. ఇదే జరిగితే తొలిసారిగా సఫారీ టూర్ ను విజయంతో మొదలుపెట్టినట్లు అవుతుంది.